Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలు పరిష్కారం:
- మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
- యూనియన్ సంగారెడ్డి జిల్లా ప్రథమ మహాసభ
నవతెలంగాణ- అమీన్పూర్
కార్మికుల సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తున్న బీజేపీ, టీఆర్ఎస్లకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్మికుల ఐక్యత, పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ గుట్టపైన శనివారం యూనియన్ జిల్లా ప్రథమ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాల వల్ల మున్సిపల్ కార్మికులు అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టం తీసుకొచ్చినా కార్మికులకు వేతనాలివ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేస్తానని చెప్పిన కేసీఆర్ నేటికీ కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 11వ పీఆర్సీ ప్రకారం మున్సిపల్ కార్మికులకు నెలకు రూ.24 వేలు వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ పర్మినెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్టు కార్మికులకూ సబ్బులు, బూట్లు ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు ఒకటో తారీఖే జీతాలు తీసుకుంటున్నారని, కార్మికులకు మాత్రం నెలల తరబడి పెండింగ్లో ఉంచుతున్నారని విమర్శించారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షులు నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. శ్రమదోపిడీ చేస్తున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. అంతకుముందు బీరంగూడ శివాలయం చౌరస్తాలో సీఐటీయూ జెండాను నర్సింహారెడ్డి ఎగురవేశారు. కార్యక్రమంలో నాయకులు యాదగిరి, నాగేశ్వర్రావు, జయరాం, సరేష్, మహబూబ్, రాజేందర్, రాములు, దశరత్, లింగమ్మ, ఆగమ్మ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.