Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడు వేల మంది కిడ్నీ రోగుల జీవన్మరణ పోరాటం
- నిరాటంకంగా కార్పొరేట్ దోపిడీ
- పట్టని ప్రభుత్వం
జీవించాలనే ఆశ వారిదైతే .. ఎలాగైనా కాపాడుకోవాలనే తపన వారి బంధువులది. డయాలసిస్ తప్ప మరో మార్గం లేక కిడ్నీ బాధితులు వైద్యశాలల చుట్టూ తిరగడానికి సమయం సరిపోతున్నది. ఆరోగ్యశ్రీ పథకం భరోసా కల్పించక పోవటం, ప్రభుత్వ వైద్యశాలల్లో సరైన వైద్య సేవలు అందకపోవటంతో లక్షలాది రూపాయలు కార్పొరేట్ వైద్యశాలలకు చెల్లించి అప్పుల పాలవుతున్న దైన్య స్థితితో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్రంలోని ఏడు వేల మంది కిడ్నీ రోగుల జీవన్మరణ పోరాటంపై
ప్రత్యేక కథకం...
కొండూరి రమేశ్బాబు
రాష్ట్రంలో రెండు కిడ్నీలు చెడిపోయిన రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. 'క్రానిక్ కిడ్నీ డిసీజ్' (సీకేడీ)తో బాధ పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. సైలెంట్ కిల్లర్గా భావించే ఈ వ్యాధితో బాధ పడే రోగులకు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స ద్వారా సాధారణ స్థితికి తీసుకురాగలిగే అవకాశం ఉన్నదని వైద్యులంటున్నారు. కిడ్నీ దొరక్కపోవటం, శస్త్ర చికిత్స ఖర్చుతో కూడుకున్నది కావటంతో వెయ్యి మందికి ఒక్కరు కూడా ఈ మార్గం ఎంచుకోవడం లేదు. ప్రత్యామ్నాయంగా డయాలసిస్ ద్వారా కొంత కాలం సీకేడీ రోగులను బతికించే అవకాశం ఉండటంతో ఎక్కువ మంది ఈ మార్గాన్నే ఎంచుకుంటున్నారు. రాష్ట్ర రాజధానిలోని ప్రధాన వైద్యశాలలతో పాటూ జిల్లా కేంద్ర వైద్య శాలల్లో కూడా డయాలసిస్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేవలం ఆరోగ్యశ్రీ కింద నమోదయిన కిడ్నీ రోగుల సంఖ్య ఏడు వేలకు దాటిందని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. జిల్లా స్థాయిలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ పలు వైద్య శాలల్లో నెఫ్రాలజీ విభాగం లేదు. దీంతో కిడ్నీ రోగులకు వైద్య సేవలు అందటం లేదు. ఫలితంగా రాజధానిలోని నిమ్స్, ఉస్మానియా, గాంధీ వైద్యశాలల్లో కిడ్నీ రోగుల సంఖ్య నానాటికి పెరుగుతున్నది. కిడ్నీ వ్యాధిని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చినట్టు ప్రభుత్వం చెబుతున్నది. కానీ, కిడ్నీ వ్యాధితో వచ్చే అనుబంధ వ్యాధులు, అత్యవసర చికిత్సలు ఆరోగ్యశ్రీ కింద చేర్చలేదంటూ ప్రభుత్వ, కార్పొరేట్ వైద్య శాలలు రోగులను వెనక్కి పంపుతున్నాయి. దీనివల్ల లక్షలాది రూపాయలు చెల్లించి ప్రయివేటు వైద్యం చేయించుకుంటున్నారు.
కార్పొరేట్ దోపిడీ....
కిడ్నీ వ్యాధి పూర్తిగా ముదిరాకే రోగులు దానిని గుర్తిస్తున్నారు. ఆ తర్వాత వైద్యశాలలకు వచ్చే సరికే పరిస్థితి చేజారిపోతున్నది. ప్రభుత్వ వైద్యశాలలతో పాటూ ఆరోగ్యశ్రీ పథకం కింద నమోదు చేసుకున్న రాజధానిలోని 15 కార్పొరేట్ వైద్యశాలల్లో కిడ్నీ వ్యాధికి ఉచితంగా చికిత్స ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన పలువురు రోగులు వైద్యం కోసం ఈ వైద్యశాలలకు ముందుగా వెళ్తున్నారు. నిమ్స్, గాంధీ, ఉస్మానియా వైద్య శాలల్లో రోగుల సంఖ్య పెరగడంతో తప్పని స్థితిలో ప్రయివేటు వైద్యశాలలకు వెళ్తున్నారు. అయితే అక్కడికి వెళ్లిన రోగులకు వైద్యశాలలు చుక్కలు చూపిస్తున్నాయి. గుండె, ఊపిరితిత్తుల వ్యాధి కూడా ఉందని ఐసీయూలో చేర్చాలని భయపెడుతున్నాయి. అంతా పూర్తయ్యాక ఈ సేవలు ఆరోగ్యశ్రీ కిందకి రావని చెప్పటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో డబ్బు చెల్లించి రోగులను చేరుస్తున్నారు. పూటకి, గంటకి రూ. 50 వేలు డిపాజిట్ చెయ్యాలంటూ ఒత్తిడి తెస్తున్నారని రోగులు ఆవేదన చెందుతున్నారు. డబ్బు కోసం పరుగులు పెట్టాల్సిన వస్తున్నదని అన్నారు. మిగిలిన వైద్య సేవలకూ ప్రభుత్వం డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
డయాలసిస్ రోగుల ఇక్కట్లు...
ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రయివేటు వైద్యశాలల్లో డయాలసిస్ చేయించుకుంటున్న రోగుల వద్ద కూడా కార్పొరేట్ వైద్య శాలలు భారీగా డబ్బు గుంజుతున్నారు. డయాలసిస్ కోసం ప్రభుత్వం సరఫరా చేసే డయలైజర్లు, ట్యూబ్లు రోగులే కొనుగోలు చేయాలంటున్నారు. డయాలిసిన్ రోగులు తరచూ ఇన్ఫెక్షన్ల బారీ పడటంతో వారికి ఇచ్చే ఖరీదైనా యాంటిబయోటిక్ ఇంజెక్షన్లను కూడా వారిచేతే కొనుగోలు చేయిస్తున్నారు. వీటితో పాటు వారానికి ఒక సారి ఇచ్చే ఐరన్, హిమోగ్లోబిన్ ఇంజెక్షన్లను కూడా తెచ్చుకోమంటున్నారు. ప్రభుత్వం నాసిరకం మందులను ఇస్తున్నదంటూ ఖరీదైన మందులు తమ మందుల దుకాణంలో కొనుగోలు చేయిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు పంపినా అది ఆమోదించలేదంటూ మధ్య మధ్యలో డయాలసిస్లకు కూడా రుసుములు తీసుకుంటున్నారు. అత్యవసర రోగుల వద్ద నుంచి రూ. ఐదు నుంచి ఎనిమిది లక్షలు బిల్లులు తీసుకుంటుండగా డయాలసిస్ రోగులకు పరోక్షంగా వారానికి రూ. 20 వేలు ఖర్చు పెట్టిన్నారు. డయాలసిస్ రోగులకు చేతిలో వేసే గొట్టం (ఫిస్టులా) ఆపరేషన్కు రూ. 25 వేలు, కిడ్నీ బయాప్సీకి రూ. 25 వేలు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ దందాపై ఫిర్యాదు చేసినా వైద్య ఆరోగ్య శాఖలో ఎవరూ పట్టించుకోవటం లేదని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ వైద్యశాలల్లో జరుగుతున్న ప్రయివేటు దోపిడీపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కూడా పట్టించుకోక పోవటం విశేషం..
ప్రభుత్వ వైద్య శాలల్లోనూ ఇదే తీరు...
ప్రభుత్వ రంగంలో నడుస్తున్న నిమ్స్తో పాటు ఉస్మానియా, గాంధీ వైద్య శాలల్లో కూడా కిడ్నీ రోగులకు ఇక్కట్లు తప్పటం లేదు. ఇక్కడ కూడా కొన్ని సేవలకు రుసుములు వసూలు చేయటంతో అక్కడ అంతా ఉచితంగానే జరుగుతుందని భ్రమ పడిన రోగులు ఆ తర్వాత ఇక్కట్లు పడుతున్నారు. నాసిరకం మందులు వినియోగించటం, డయలైజర్లను ఎప్పటికప్పుడు స్టెరిలైజ్ చేయకపోవటం, అత్యవసర రోగులను పట్టించుకోక పోవటం ఈ వైద్యశాలల్లో సర్వసాధారణమై పోయిందని రోగులు ఆరోపిస్తున్నారు.