Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
ప్రజల మధ్య విధ్వేషాలు రగిల్చి రెచ్చగొట్టే బీజేపీని ఓడించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ జిల్లా నకిరేకల్లోని నర్రా రాఘవరెడ్డి భవనంలో పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందన్నారు. ప్రజాస్వామ్య సంస్థలను ఆధీనంలోకి తెచ్చుకునేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు. రిజర్వ్ బ్యాంకు లాంటి ముఖ్య సంస్థల్లో తమ అనుచరులను పెట్టుకొని దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల ఆర్థిక విధానాల్లో తేడా లేదన్నారు. వీటికి ప్రత్యామ్నాయ ఆలోచన విధానంతో సీపీఐ(ఎం) ముందుకు పోతోందని చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. ఐదేండ్ల బీజేపీ పాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. దళితులు, మేధావులు, మైనార్టీలు, జర్నలిస్టులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అంగడిలో వస్తువులా కేసీఆర్ కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రజాసమస్యలపై నికరంగా ఉద్యమాలు నడిపే పార్టీలను ఆదరించాలని కోరారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, పన్నాల ప్రమీల పాల్గొన్నారు.