Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖర్చుకు వెనకాడొద్దు...
- మెదక్, చేవెళ్ల, మల్కాజ్గిరి ప్రతిష్టాత్మకం
- ఆరు నూరైనా ఆ మూడింటిలో విజయం సాధించాలి : ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఆదేశాలు
- నియోజకవర్గ సమావేశాల్లో చర్చ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'నోటు గురించి కాదు.. ఓటు గురించే ఆలోచించండి.. ఖర్చుకు వెనకాడొద్దు.. ఎంతైనా ఫరవాలేదు.. మనం గెలిచి తీరాలి...' అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలను ఆదేశించారు. ప్రతి పార్లమెంటు నియోజకర్గ పరిధిలోకి వచ్చే శాసనసభ్యులందరూ విధిగా ఎంపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు శాయశక్తులా కృషి చేయాలని దిశా, నిర్దేశం చేశారు. ఎంపీలను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేదేనంటూ ఆయన ఆదేశించినట్టు తెలిసింది. సీఎం సూచన మేరకు శనివారం వివిధ జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయి సమావే శాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కిందిస్థాయి క్యాడర్కు పలు సూచనలు చేశారు. సీఎం తమకిచ్చిన ఆదేశాలను వారు వివరించారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ పని చేయాలని కోరారు. 'చేవెళ్ల, మల్కాజ్గిరి, మేడ్చెల్ టీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకం.. ఆ మూడు స్థానాల్లో ఎలాగైనా గెలిచి తీరాలి.. అవసరమైతే ఒక్కో నియోజకవర్గానికి రూ.100 కోట్లు ఖర్చైనా ఫరవాలేదు.. మనం విజయం సాధించాలి.. ఇది సీఎం ఆదేశం దీన్ని అందరూ గమనించి గట్టిగా కృషి చేయండి...' అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు నొక్కి చెప్పినట్టు సమాచారం. ఇదే సమయంలో వివిధ నియోజకవర్గాల్లో ఉన్న అసంతృప్తులను బుజ్జగించాలని, మాట వినకపోతే కొనేయాలంటూ చెప్పినట్టు సమాచారం. మరోవైపు ఒక్కో ఎమ్మెల్యే తన వంతుగా రూ.10 కోట్లు ఇవ్వాలి, పార్టీ వైపు నుంచి రూ.25 కోట్లు అందజేస్తాం.. మిగతా డబ్బును కూడా ఎమ్మెల్యేలే సర్దుబాటు చేయాలంటూ కోరినట్టు తెలిసింది. ఈ మొత్తంలోంచి ఒక్కో మండటానికి రూ.3 నుంచి రూ.5 కోట్లు ఖర్చు చేయాలని టీఆర్ఎస్ పెద్దలు ఆదేశించినట్టు సమాచారం. ఇలాంటి అంశాలన్నింటినీ నియోజకవర్గ సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కిందిస్థాయి క్యాడర్ చెవిలో వేశారు. వీటన్నింటినీ తప్ప కుండా పాటించాలని.. తేడా వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరికలు జారీ చేశారు. పెద్ద నాయకుల ఆదేశాలను విన్న జిల్లా, మండల, గ్రామ స్థాయి కార్యకర్తలు వాటిని అమలు చేసేందుకు శాయ శక్తులా కృషి చేస్తామంటూ చెప్పినట్టు తెలిసింది.