Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎడారిని తలపిస్తున్న 'జీవనది'
- సరస్వతి క్షేత్రం సహా గొంతెండుతోన్న గ్రామాలు
- మత్స్యకారుల ఉపాధికి తీరని దెబ్బ
- శంకుస్థాపన దశలోనే చెక్డ్యాం నిర్మాణం
నవతెలంగాణ- బాసర
బాసర సరస్వతి క్షేత్రంలో నిత్యం నీటితో కళకళలాడే గోదారమ్మ ఇప్పుడు చుక్కనీరు లేక వెలవెలబోతోంది. కనుచూపుమేర అంతా ఇసుకమేటతో ఏడారిని తలపిస్తోంది. ముదురుతున్న ఎండలకు నది సహా భూగర్భజలమూ అడుగంటుతోంది. దీంతో బాసర సహా 9 గ్రామాల ప్రజలు దాహంతో అల్లాడుతున్నారు. నదిపై ఆధారపడ్డ 200 మంది మత్య్సకార కుటుంబాలకు ఉపాధి కరువైంది. నీటి సమస్యకు 'చెక్' పెట్టేందుకు నిర్మిస్తామన్న డ్యాం పనులు శంకుస్థాపన దశలోనే ఆగిపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
నాసిక్లో పుట్టిన ఈ గోదావరి నది మహారాష్ట్రలోని నాందేడ్ మీదుగా రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు నుంచి ప్రవేశిస్తోంది. ఈ నది ఇన్నేండ్లలో బాసర సరస్వతి క్షేత్రంలో ఏదో ఒకచోట చిన్నపాయగానైనా ప్రవహించేది. ఇప్పుడు ఆ నీటి జాడ కనిపించడం లేదు. ప్రస్తుతం ముదురుతున్న ఎండలకు నది అంతా ఎడారిని తలపిస్తోంది. తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటకలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చే యాత్రికులకు నీటి గోస ఎదరవుతోంది. యాత్రికుల ఇబ్బందులను దృష్టిలోపెట్టుకుని ఆలయాధికారులు ప్రత్యామ్నాయంగా గోదావరి మధ్యలో రూ.10లక్షల వ్యయంతో సుమారు 100మీటర్ల లోతులో బోరుబావి తవ్వించారు. పైప్లైన్ ద్వారా నది ఒడ్డున జల్లుస్నానాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడది యాత్రికులకు అవసరమైన నీటినీ అందించలేకపోతోంది.
ట్రిపుల్ఐటీలోనూ నీటి ఎద్దడి
సరస్వతీ క్షేత్రం సహా సమీపంలోని బిద్రెల్లి, కిర్గుల్(కె), మైలాపూర్, శారదనగర్, ఓని, కౌఠ, సాలాపూర్, బాసర, సావర్గాం (9గ్రామాలు) గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తింది. వారంతా సమీపంలోని వ్యవసాయక్షేత్రాలు, చేతిపంపులు ఆధారంగా నీటి అవసరాలుతీర్చుకుంటున్నారు. బాసర ట్రిపుల్ఐటీలోనూ నీటి ఎద్దడి నెలకొంది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని రెండేండ్ల క్రితం ట్రిపుల్ఐటీ సమీపంలో చెరువును తవ్వించినా ప్రస్తుతం అందులో చుక్కనీరు లేదు. ఎగువప్రాంతంలోని మహారాష్ట్రలో సరైన వర్షాలు లేకపోవడమే ఈ పరిస్థితులకు కారణమైంది. గతేడాది జూన్ చివరిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తిన సమయంలో కొంత నీరు వచ్చింది. అదిప్పుడు ఎండ తీవ్రతకు మచ్చుకైనా కనిపించడంలేదు. ఎల్లప్పుడూ నీటితో బాసర క్షేత్రం కళకళలాడే విధంగా చెక్డ్యాం నిర్మించాలని ప్రభుత్వం భావించి రూ.85కోట్లూ మంజూరు చేసింది. ఏడాది క్రితం అప్పటి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో గోదావరిలో బురద ఉండటంతో ఉన్నఫలంగా పనులు నిలిపేశారు. ఇప్పుడా నిర్మాణ పనుల ఊసే ఎత్తడం లేదు.
మత్స్యకారులకు ఉపాధి కరువు
బాసర, లోకేశ్వరం, నర్సాపూర్, దిలావర్పూర్, నిర్మల్, సోన్ మండలాల పరిధిలో సుమారు 200 మత్స్యకార కుటుంబాలు గోదావరినదిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఏప్రిల్లోనే నది అడుగంటిపోవడంతో మత్స్యకారులకు ఉపాధి కరువైంది. దీంతో వేరే ప్రదేశాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఎదురవుతోంది. అదే గోదావరిలో నీరుంటే చేపలు పట్టి విక్రయించేవారు. వారి కుటుంబ సభ్యులు సైతం గోదావరిలో తెప్పలు విక్రయిస్తూ ఉపాధి పొందేవారు. ఇప్పుడా పరిస్థితి లేకుండాపోయింది.
ఉపాధి కోల్పోయాం : డప్పు నరేష్, మత్స్యకారుడు
గోదావరిలో నీళ్లు లేక ఉపాధి కరువైంది. మూండేండ్లుగా వర్షాలు లేక నదిలో నీళ్లు అడుగంటుతూ వచ్చాయి. ఇప్పుడు మా ఉపాధికే పెద్దదెబ్బ ఎదురైంది.
ఇలాగే ఉంటే నీటిముప్పే : శ్యామ్పటేల్, బాసర గ్రామస్థుడు
ఈసారి గోదావరి నది తొందరగానే ఎండిపోయింది. బాసర సహా చుట్టుపక్కల ఊళ్లలో నీళ్లు దొరకడం లేదు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గం చూపకపోతే నీటి ముప్పు తప్పదు.
ప్రత్యామ్నాయం చూస్తున్నాం : గంగా శ్రీనివాస్, బాసర ఆలయ ఏఇఓ
గోదావరి నది ఏప్రిల్లోనే ఎడారిలా మారింది. బాసరకొచ్చే యాత్రికులకు నీటి సమస్య ఎదురవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే నది ఒడ్డున షెవర్లు ఏర్పాటు చేశాం. తాగునీటి వసతి కల్పిస్తున్నాం.