Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖాళీ అవుతున్న కోరుట్ల ఎన్టీఆర్కాలనీ
- చందాలేసుకున్నా తీరని సమస్య
- వారం వ్యవధిలోనే 20 కుటుంబాలు వలస
నవతెలంగాణ - కోరుట్ల టౌన్
జగిత్యాల జిల్లా కోరుట్ట పట్టణం.. ఇప్పుడా ఆ ప్రాంతంలో నీటి కోసం నీరసించిన జనం పట్టణం నుంచి నిష్క్రమిస్తున్నారు. కనీస నీటి అవసరాలూ తీర్చుకోలేక పల్లెలకు పయనమవుతున్నారు. వారం వ్యవధిలోనే అయ్యప్పగుట్టపైనున్న ఎన్టీఆర్కాలనీలో 20 కుటుంబాలు వలసెళ్లిపోయాయంటే అక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. మిగిలి ఉన్న కాలనీ జనం డ్రమ్మునీటికి రూ.50 చెల్లించి రోజువారీ అవస రాలు తీర్చుకుంటున్నారు. కోరుట్ల పట్టణం 24వ వార్డులోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో 1500 జనాభా ఉంది. శివారు ప్రాంతం కావడంతో అక్కడ కనీస మౌలిక సదుపాయాలూ కరువే. కాలనీకి 13 ఏండ్ల క్రితమే వాటర్ట్యాంక్ నిర్మించినా పైప్లైన్ కనెక్షను ఇవ్వలేదు. ప్రస్తు తం ఆ ట్యాంకు కూడా శిథిలావస్థలో నిరుపయోగంగా ఉంది. కాలనీ వాసులంతా చందాలేసుకుని కాలనీలో ఐదు బోరుబావులు తవ్విస్తే అందులో రెండింటిలో నీళ్లు పడ్డాయి. ఇప్పుడవీ సరిపడా నీళ్లు అందించడం లేదు. వేసవి ప్రారంభంలోనే మొదలైన నీటి ఎద్దడి ప్రస్తు తం కాలకృత్యాలు తీర్చుకోలేని స్థితికి చేరుకుంది.విధిలేక డ్రమ్మునీటిని రూ.50చెల్లించి తమ అవసరాలు తీర్చుకుంటు న్నారు. ఆ ఖర్చు భరించలేని జనం కాలనీ వదిలి తమ ఊళ్లకు పయనమవుతున్నారు. 500 కుటుంబాలు ఉండే ఈ ఎన్టీఆర్ కాలనీలో వేసవి ప్రారంభం నుంచే ఇండ్లు ఖాళీ చేస్తున్నారు. ఈ వారం వ్యవధిలోనే 20 కుటుం బాలు తమ ఇండ్లకు తాళలేసి వెళ్లిపోయాయి. ఇంకొందరైతే నీటి ఎద్ద డిని తట్టుకోలేక తమ ఇండ్లు అమ్ముకుని వేరే చోటకు వెళ్లిపోతున్నారు. మరికొందరు అదే పట్టణంలో నీళు లభించే చోట రూ.వేలల్లో చెల్లిస్తూ అద్దెకుంటున్నారు.
పట్టించుకున్న నాథుడే లేడు : సతర్ల సరిత, ఎన్టీఆర్కాలనీ
చాలా దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నం. పైసలుపెట్టి నీళ్లు కొనుకుంటున్నం. మున్సిపల్ వాళ్లకు చెప్పినా పట్టించుకున్న నాథుడే లేడు.
నీళ్ళు కొంటున్నం : దాసరి పూజిత, ఎన్టీఆర్కాలనీ
కాలనీలో అంతా డబ్బులు ఇచ్చి నీళ్లు కొంటున్నం. డ్రమ్మునీటికి రూ.50 తీసుకుంటున్నరు. ఇలా అయితే సంపాదన నీళ్లకే పోతారు.
ఇంటిని అమ్మకానికి పెట్టా : సింగం శ్రీహరి, ఎన్టీఆర్కాలనీ
లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్న. గిప్పుడు నీళ్ల గోస పడలేక అమ్మకానికే పెట్టిన. ఇల్లు ఖాళీ చేసి వేరేకాడ కిరాయికుంటున్న.