Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పలువురి నివాళి
- దళితుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం : తలసాని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు ఆదివారం హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ప్రభుత్వం ఈ వేడుకలను నిర్వహించింది. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పలువురు రాజకీయ, ప్రజాసంఘాలు నాయకులు, అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళితుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ఇందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని వివరించారు. సామాజిక, ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాలంటే రాజ్యాంగ బద్ధమైన పద్ధతులను అనుసరించాలన్నారు. ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ మంచి సమాజానికి నాంది పలకాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ భూక్యా తదితర ప్రముఖులు అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు.
బీజేపీని ఓడించడమే అంబేద్కర్కు నివాళి:సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి వెంకట్
రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, లౌకిక స్ఫూర్తికి విఘాతం కలిగించే బీజేప ీని, మతోన్మాద శక్తులను పార్లమెంటు ఎన్నికల్లో ఓడించడమే డాక్టర్ బిఆర్ అంబే ద్కర్కు అందించే నిజమైన నివాళి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి వెంకట్ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లోని ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బి వెంక ట్ మాట్లాడుతూ ప్రపంచ మేధావుల్లో అంబేద్కర్ ఒకరని చెప్పారు. సామాజిక న్యాయం కోసం, సమాజంలో ఉన్న అసమానతలు పోగొట్టాలని ఎంతో తపిం చారని అన్నారు. అణగారిన ప్రజల సేవకు అంబేద్కర్ జీవితాన్ని అంకితం చేశారని వివరించారు. రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రజాస్వామ్యం, లౌకిక పునాదులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తోందన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. సామాజిక న్యాయం వర్గదోపిడీని అంతమొందించడానికి అంబేద్కరిస్టులు, కమ్యూనిస్టులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ఉమ్మడి పోరు సాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జె వెంకటేశ్, పాలడుగు భాస్కర్, నాయకులు కోట రమేష్, ఆర్ఎల్ మూర్తి పాల్గొన్నారు.
అంబేద్కర్ స్ఫూర్తితో మనువాదంపై పోరాటం: డీఎస్ఎంఎం జాతీయ కన్వీనర్ వి శ్రీనివాసరావు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో మనువాదం, పెట్టుబడి దారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని దళిత్ శోషణ్ ముక్తి మంచ్ (డీఎస్ఎంఎం) జాతీయ కన్వీనర్ వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఆదివారం అంబేద్కర్ 128వ జయం తి సందర్భంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గోల్కొండ చౌరస్తా నుంచి ట్యాంక్బండ్ వరకు బైక్ర్యాలీ జరిగిం ది. అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా వి శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశంలో కులవ్యవస్థ మనుషుల మధ్య సామాజిక అసమానతలు, అణచివేత, అవమానాలను సృష్టించిందని చెప్పా రు. పెట్టుబడిదారీ విధానం మనుషుల మధ్య ఆర్థిక వ్యత్యాసాలను సృష్టించిందని అన్నారు. బొంబాయిలో నూలుమిల్లు కార్మికుల పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న అంబేద్కర్ మనువాదం, పెట్టుబడిదారీ విధానం అంతం కావడమే ప్రజల కర్తవ్యం కావాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. అందుకే పెట్టుబడిదారీ విధానం, బ్రాహ్మనిజం అంబేద్కర్కు శత్రువులని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ జెండాల రంగుల్లోనే తేడా తప్ప విధానాల్లో కాదన్నారు. ప్రజల అభివృద్ధి జరగాలంటే ప్రత్యామ్నాయ రాజకీయ విధానం కావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి టి స్కైలాబ్బాబు, గ్రేటర్ హైదరాబాద్ నగర కార్యదర్శి ఎం దశరథ్, పీఎన్ఎం నగర కార్యదర్శి ఆర్ సైదులు, నాయకులు ఎం విజయకుమార్, జి రాములు, జి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
బహుజనులకు అధికారం కోసం ఉద్యమిద్దాం: టీమాస్ రాష్ట్ర కన్వీనర్ జాన్వెస్లీ
అంబేద్కర్ స్ఫూర్తితో బహుజనులకు అధికారం సాధించడానికి ఐక్యంగా ఉద్యమిద్దామని తెలంగాణ సామాజిక ప్రజాసంఘాల ఐక్యవేదిక (టీమాస్) రాష్ట్ర కన్వీనర్ జాన్వెస్లీ అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. ప్రయివేటు రంగాన్ని సంపూర్ణంగా ప్రోత్సహిస్తోందని చెప్పారు. రిజర్వేషన్ల అమలును నీరుగార్చిందని అన్నారు. రిజర్వేషన్ల వ్యవస్థనే ఎత్తివేసి రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసేందుకు ప్రయత్నించిందని చెప్పారు. ఎస్సీ,ఎస్టీ సబ్ప్లాన్ చట్టాన్ని ఎత్తివేసేందుకు సుప్రీం కోర్టు ద్వారా కుట్ర పన్నిందన్నారు. న్యాయవ్యవస్థ, సీబీఐ, ఆర్బీఐ, విశ్వవిద్యాలయల్లాంటి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను హిందూ మతోన్మాద స్థావరాలుగా వాడుకుందని విమర్శించారు. ప్రశ్నించే వారిని, ప్రజాస్వామికవాదులు, అభ్యుదయ వాదులు, జర్నలిస్టులపై దాడుల చేసి, కొందరిని హత్య చేసిందన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అంబేద్కర్ జపం చేస్తూ ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తోందని విమర్శించారు. ఎస్సీ,ఎస్టీ సబ్ప్లాన్ చట్టం అమలు చేయకుండా దళితులకు రావాల్సిన లక్షల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడిందన్నారు. ఐదేండ్లలో 32 కులదురంహకార హత్యలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం వాటిపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. వీడీసీల పేరుతో దళితులను గ్రామబహిష్కరణలు చేస్తుంటే ప్రభుత్వం వాటిని ఎందుకు నిషేధించడం లేదని అడిగారు. ఎస్సీ,ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయకుండా తాత్సారం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీమాస్ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆర్ శ్రీరాంనాయక్, శ్రీనివాస్ బహదూర్, ఎంవి రమణ, పైళ్ల ఆశయ్య, లెల్లెల బాలకృష్ణ, ఎం ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు.