Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణహత్య
- ఆలస్యంగా వెలుగులోకి...
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
టీసీఎస్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ లావణ్య(25) దారుణహత్యకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. లావణ్యతో పాటు టీసీఎస్ కంపెనీలో సునీల్కుమార్ కూడా పనిచేస్తున్నాడు. వారిద్దరు ప్రేమించుకున్న నేపథ్యంలో పెండ్లి చేసుకోవాలని లావణ్య అడిగినట్టు తెలుస్తోంది. శుక్రవారం పెండ్లి చేసుకుంటానని చెప్పి శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద ఓ హోటల్కు తీసుకెళ్లాడు. అక్కడే లావణ్యను హతమార్చి మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్లో కుక్కి దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలోని సూరారం కాలనీ రెండో ఓం జెండా సమీపంలోని కృషి స్కూల్ పక్కన మురుగు కాలువలో పడేశాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఆర్సీపురానికి చెందిన లావణ్యగా గుర్తించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో మృతురాలిని అతి కిరాతకంగా హతమార్చి ట్రావెల్ బ్యాగ్లో కుక్కి ఇక్కడ పడవేశారని తేలింది. అంతకుముందే బీహెచ్ఈఎల్ రామచంద్రాపురం పోలీసు స్టేషన్లో లావణ్య మిస్సింగ్ కేసు నమోదైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పలుకోణాల్లో దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.