Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కైవసం చేసుకోవడమే లక్ష్యం
- ఒక్కో చోట నలుగురు పోటీ
- మహిళా రిజర్వేషన్ల సీట్లలో నేతల భార్యలు
- పార్టీ గుర్తులతో ఎన్నికలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మండల, జిల్లా పరిషత్లలో తమ పార్టీల జెండాలను ఎగురవేయాడానికి ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రదేశిక ఎన్నికల వాతావరణం వేడిక్కింది. ఇప్పటికే మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్మెన్ల కోసం ఆశావాహులు తమ మద్దతుదారులతో పార్టీ కార్యాలయాల వద్ద తిష్ట వేశారు. జెడ్పీ చైర్మెన్గిరి కోసం రూ. కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ముట్టజెప్పెందుకు నేతలు సిద్ధమయ్యారు. ప్రాదేశిక బరిలో నిలవాలనుకున్న ఆశావాహులు ఇప్పటికే తమకున్న విలువైన భూములను విక్రయాలకు పెట్టడం గమనార్హం.
టీఆర్ఎస్ ముందస్తు వ్యూహం
మండల, జిల్లా పరిషత్ అధ్యక్ష స్థానాలన్నిటినీ కైవసం చేసుకోవడానికి అధికార టీఆర్ఎస్ ముందస్తు వ్యూహాన్ని రచించింది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన విధంగానే ఇతర పార్టీల కన్నా ముందే అభ్యర్థులను ముందుగానే ఖరారు చేసినట్టు తెలిసింది. రెండు మూడు రోజుల్లో వారిని అధికారికంగా ప్రకటించి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసుకునేలా కార్యాచరణ రూపొందించింది. దాంతోపాటే మండల, జిల్లా పరిషత్ చైర్మెన్ల పేర్లను కూడా వెల్లడించనుంది. మహిళా రిజర్వుడు స్థానాల్లో ఆయా మండల, జిల్లా పరిధిలో పేరున్న నేతల భార్యలను పోటీలో నిలబెట్టనుంది. వారి గెలుపు బాధ్యతను జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించారు. దీనికి సంబంధించి టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ విస్తత స్థాయి సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. ఆయన ఆదేశాల ప్రకారం మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాల్లో తిష్టవేసి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు.
గెలుపే లక్ష్యంగా.. కాంగ్రెస్
స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధ్యమైనన్ని సీట్లు గెలవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఇప్పటికే జిల్లా నేతలు ప్రాదేశిక ఎన్నికలపై వ్యూహాన్ని రచించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటినట్టే మండల, జిల్లా పరిషత్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయించాలన్న ఆలోచనలో నేతలు ఉన్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగుతున్నందున ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం లేనందున ఎక్కువ సీట్లు గెలుస్తామన్న ధీమాలో ఆ పార్టీ ఉంది. టీఆర్ఎస్ బలంగా ఉన్న చోట కూడా అత్యధిక స్థానాలు గెలిచి టీఆర్ఎస్ ఆశలను గండి కొట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.
చడీ చప్పుడు లేని బీజేపీ
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పరిస్థితులు భిన్నంగా ఉండటంతో ప్రాదేశికంపై బీజేపీ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలు కావడం, లోక్సభ ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం లేకపోవడంతో స్థానికంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పార్టీ బలంగా ఉన్న మండలాల్లోనే అభ్యర్థులను నిలబెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
టికెట్ల కోసం తీవ్ర పోటీ
మండలాలు, జిల్లా పునర్విభజన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.మొత్తం 32 జిల్లాల్లో 535 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ టికెట్ల కోసం ఆయా పార్టీల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఒక్కో స్థానానికి ముగ్గురు, నలుగురు చొప్పున పోటీ పడుతున్నట్టు సమాచారం.