Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్యపోరాటాలతోనే హక్కులు
- ఆధార్తో ముడిపెట్టడం సరికాదు: ఎం.సాయిబాబు
- ప్రయివేటీకరిస్తే ఊరుకోబోం : పి.జయలక్ష్మి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో అంగన్వాడీల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడిందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు అన్నారు. తమ హక్కుల కోసం అంగన్వాడీలు ఐక్య ఉద్యమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్(టీచర్స్)అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. అందులో సాయిబాబు మాట్లాడుతూ...అంగన్వాడీ సెంటర్లకు వచ్చే చిన్నపిల్లలకు ఆధార్ కార్డు ఆధారంగా బాలామృతం వంటివి అందజేస్తామని చెప్పడం దారుణమని, నాలుగైదు నెలల చిన్నారులకు ఆధార్ కార్డు తీసుకోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అంగన్వాడీ కేంద్రాలను నడుపుతూనే రేషన్ షాపునకు వెళ్లి క్వింటాళ్ల బియ్యం ఎలా తెచ్చుకుంటారని నిలదీశారు. అంగన్వాడీ కేంద్రాల వద్దకు వెళ్లి బియ్యం తెచ్చుకోవాలని ఆదేశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇండియన్ లేబర్ కమిషన్, ఐఎల్ఓ తీర్మానాలలో ఒక్కదానిని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయట్లేదని విమర్శించారు. మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన కార్మిక నేత కేఎల్. కర్మార్ను మూడేండ్ల పాటు స్థానికంగా ఉండొద్దని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడం దారుణమన్నారు. అక్కడ ఉండి కార్మికల సమస్యలపై పోరాడుతూ కార్పొరేట్ యాజమాన్యాలకు కొరకరాని కొయ్యగా..కార్మికపక్షపాతిగా ఉండటం వల్లనే సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నదన్నారు. 130 దేశాలలో చేపట్టిన వరల్డ్ హెల్త్ సర్వేలో 105వ స్థానంలో నిలబడం దారుణమన్నారు. దేశంలో ముగ్గురు చిన్నారులు ఆకలితో చనిపోయారని, జార్ఖండ్లో రేషన్ అందక తల్లీకొడుకు చనిపోయారని గుర్తుచేశారు. రక్తహీనతతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పేద మహిళలకు, పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఎంతో కొంత పౌష్టికాహారం అందుతున్నదని, ఐసీడీఎస్ రద్దు చేస్తే అది కూడా అందని అన్నారు. ఐసీడీఎస్ రద్దు చేసే కుట్ర నేడు జరుగుతున్నదని, దీనివల్ల అంగన్వాడీలు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. రాష్ట్ర సర్కారుకు అనుకూలంగా ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయనే ధోరణితో కొన్ని కార్మిక సంఘాలు రావడం బాధాకరమన్నారు. పాలకులతో తెగించి కొట్టాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. అంగన్వాడీలకు పెండింగ్లో ఉన్న ఆరునెలల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యరర్శి పి.జయలక్ష్మి మాట్లాడుతూ..ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు అంగన్వాడీలతో ఖర్చుపెట్టించడం సిగ్గుచేటన్నారు. ఆయా కార్యక్రమాలకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల యూనిఫామ్లు, ఇన్చార్జీల అలవెన్స్లు, ఇంక్రిమెంట్లు, స్టేషనరీ డబ్బులు ఐదేండ్ల నుంచి చెల్లించకుండా 18 కోట్ల రూపాయలను మింగడం దారుణమన్నారు. వెంటనే ఆ బడ్జెట్ను విడుదల చేయాలని కోరారు. రెండు,మూడు నెలలుగా నాణ్యమైన ఆహారం అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా కావడం లేదని, దీంతో పోషకారలోపం తగ్గకపోగా మరింత పెరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణను ప్రయివేటుకు అప్పగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అంగన్వాడీలందరూ హక్కుల కోసం రానున్న కాలంలో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్(టీచర్స్) అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.పద్మ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రాష్ట్ర నాయకులు రాజమణి, వెంకటమ్మ, వనజ, జ్యోతి, సునీత, శైలజ, బాబాయి, విమలమ్మ, పార్వతి, ఏకలక్ష్మి, వాణి, కవిత, నర్సమ్మ, కవిత, తదితరులు పాల్గొన్నారు.