Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేడికి తట్టుకోలేక మృత్యువాత
-9 42 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు
- పౌల్ట్రీఫామ్ల్లో వేలల్లో చనిపోతున్న కోళ్లు
- బాయిలర్ కోళ్లకు గడ్డుకాలమే..
- యజమానులు, రైతులకు కోట్లాది రూపాయల నష్టం
నవతెలంగాణ- మహబూబ్నగర్ ప్రతినిధి
మండుతున్న ఎండలకు మనుషులే కాదు.. మూగజీవాలూ బతకడం కష్టంగా మారింది. భూమ్మీద గ్రాసం ఏమోగానీ కనీసం తాగునీరు కూడా దొరక్క, పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. ఉమ్మడి పాలమూరులో పగటి ఉష్ణోగ్రతలు 42డిగ్రీలకు చేరాయి. పౌల్ట్రీపామ్ల పరిస్థితి మరీ దారుణం. వేలల్లో కోళ్లు చనిపోతున్నాయి. గద్వాల జిల్లాలో మేతకు తీసుకెళ్లిన 150 గొర్రెలు ఒకేరోజు మృత్యువాతపడ్డాయి.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 10లక్షల 25వేల ఆవులు, పశువులు, కోడెలున్నాయి. 5లక్షల పైగా గేదెలున్నాయి. 45లక్షల గొర్రెలు, 5లక్షల మేకలు, 10లక్షల బాయిలర్ కోళ్లున్నాయి. నాగర్కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్, గద్వాల, నారాయణపేట జిల్లాల పరిధిలో సోమవారం ఉష్ణోగ్రత 42 డిగ్రీలు నమోదైంది. వేడికి తట్టుకోలేక పశువులు మృత్యువాతపడుతున్నాయి. ప్రతిరోజూ కోళ్లఫారాల్లో కోళ్లు చనిపోతూనే ఉన్నాయి. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైతే బాయిలర్ కోళ్లు బతకడం కష్టం. ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోతే ఫారంలో కోళ్లన్నీ చనిపోతాయి. రోజు 10నుంచి 50కి పైగా కోళ్లు చనిపోతుండటంతో యజమానులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఫారాల్లో చల్లటి వాతావరణం కోసం చేయాల్సిన ఏర్పాట్ల ఖర్చు కన్నా వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుందని కొందరు వేసవిలో కోళ్ల పెంపకమే మానేస్తున్నారు. ప్రత్యేక జాగ్రత్తలు ఎంత తీసుకున్నా పెరుగుతున్న ఉష్ణ్గోగ్రతల వల్ల కోళ్లు, పశువులు బతకడం కష్టమని పశువైద్య అదికారులే చెబుతున్నారు. వీటన్నింటి నేపథ్యంలోనే వేసవిలో తక్కువ ధర ఉండాల్సిన చికెన్ రూ.200 దాటింది.
పౌల్ట్రీ రైతుల ఆందోళన
బిజనపల్లి మండలం పాలెంలో రైతు మోహన్రెడ్డి బాయిలర్ ఫామ్లో 2017లో మార్చి చివరలో ఎండ తీవ్రతకు 30 వేల కోళ్లు చనిపోయాయి. 2018 ఏప్రిల్లో 18వేల కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఇప్పుడూ అదే పరిస్థితి ఏర్పడింది. 2019 మార్చి చివరలో పాలెం గ్రామానికి చెందిన కుర్వ నర్సింహా ఫామ్లో 10 వేల కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఒక్కసారిగా వాతావరణం వేడెక్కడంతో కోళ్లు చనిపోయినట్టు రైతులు చెబుతున్నారు. మోహన్రెడ్డికి ఈ రెండేండ్ల కాలంలో రూ.కోటి24 లక్షల నష్టం వాటిల్లింది. కుర్వ నర్సింహాకు రూ.50 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. జైపాల్ అనే రైతు కోళ్లఫారంలో రోజూ 20 కోళ్ల వరకు చనిపోతున్నాయి.
గొల్లుమంటున్న కాపరులు
గద్వాల జిల్లా ధరూర్ మండలం మర్లబీడుకు చెందిన కురువ నర్సింహులు, కురువ రంగన్న, కురువ చిన్న నర్సింహులు, పరుశరాములు, వీరేష్ గొర్ల కాపరులు. గ్రామ శివారులో మేకలను మేత కోసం తీసుకెళ్లారు. ఈ క్రమంలో సోమవారం నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు వడదెబ్బ తగిలి 150 జీవాలు మృత్యువాతపడ్డాయి. సుమారు రూ.5లక్షల వరకు నష్టం వాటిల్లింది. బాధితులు లబోదిబోమన్నారు.
కోళ్లను బతికించుకోలేకపోతున్నాం
సంవత్సరాల నుంచి కోళ్లఫారాలను నడుపుతున్నాను. ఈ మూడేండ్లలో వచ్చిన నష్టం ఎప్పుడూ రాలేదు. ఈ కాలంలో రూ.2.48 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. వేసవితో పాటు పక్కనే రోడ్డు ఉండటం వల్ల పొల్యూషన్తో కూడా కోళ్లు చనిపోతున్నాయి. అధిక మొత్తంలో చనిపోయిన పౌల్ట్రీలకు సర్కార్ బీమా సౌకర్యం కల్పించాలి.
-మోహన్రెడ్డి, పాలెం
10 వేల కోళ్లు చనిపోయాయి
ఐదేండ్ల నుంచి కోళ్ల ఫారాలను నిర్వహిస్తున్నాను. ఈ ఏడాది ఉన్నంత ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేవు. నెల రోజుల్లో వేడికి తట్టుకోలేక 10వేల కోళ్లు చనిపోయాయి. అప్పులు చేసి పెట్టుబడులు పెడుతున్నాం. ఈ ఉష్ణోగ్రతలకు ఉన్న కోళ్లు కూడా గట్టెక్కుతాయో లేదోనని ఆందోళనగా ఉంది.
-కుర్వ నర్సింహా, పాలెం
చల్లటి వాతావరణం ఉండాలి
బాయిలర్, లేయర్, పశువుల కోసం ఫామ్హౌస్లో చల్లటి వాతావరణం కల్పించాలి. ముఖ్యంగా రేకులపై గడ్డి వేసి స్ప్రింక్లర్ల ద్వారా నీటిని పట్టించాలి. కోళ్ల ఫారాలను తూర్పు, పడమర వేసి ఉత్తర, దక్షిణం గాలి వచ్చేలా చూసుకోవాలి. షెడ్లకు ముందు వెనుకా చెట్లను పెంచాలి. నీళ్లలో, దాణాలో చల్లగా ఉండేందుకు కొన్ని మందులను కలిపిపెట్టాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వేసవిలో మూగ జీవాలను కాపాడుకోవచ్చు.
-అంజిలప్ప, పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి, నాగర్కర్నూల్