Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈదురుగాలులతో కూడిన భారీ రాళ్ల వర్షం
- నేలరాలిన వరి, మామిడి, ఇతర పంటలు
- పలుచోట్ల విరిగిన విద్యుత్ స్తంభాలు, చెట్లు
- కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయిన ధాన్యం
నవతెలంగాణ-యంత్రాంగం
రెండ్రోజులుగా పలుజిల్లాల్లో కురిసిన వడగండ్ల వాన అన్నదాతలను తీవ్రంగా నష్టపరిచింది. గురువారం రాత్రి, శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన రాళ్ల వర్షం పడటంతో వరి, మొక్కజొన్న, మామిడి తోటలతో పాటు ఇతర పంటలు ధ్వంసమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల బలమైన గాలులు వీయడంతో విద్యుత్స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. కల్లాల్లో, మార్కెట్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడ్రోజులుగా ఈదురు గాలులు, వడగండ్ల వాన పడటంతో రైతులు లక్షల రూపాయలు నష్టపోయారు. 153 ఎకరాల మామిడి తోటలు, వరి 2వేల ఎకరాల్లో ధ్వంసమైంది. నష్టం అంచనా సుమారు రూ.8 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. 40 కరెంట్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో 250 ఎకరాల్లో వరి, 5 ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. కోదాడ, వెంకట్రాంపురం ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడడంతో రాకపోకలు స్తంభించాయి.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో భారీ సైజులో ఉన్న రాళ్లు పడటంతో మామిడి తోటలు, వరి, మొక్కజొన్న, తదితర పంటలు ధ్వంసమయ్యాయి. దాదాపు 700 ఎకరాల్లో వరి, 100 ఎకరాల్లో మామిడి, 200 ఎకరాల్లో మొక్కజొన్నతో పాటు 60 ఎకరాల్లో కూరగాయాల తోటలు ధ్వంసమయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రూరల్, రుద్రంగిలో స్వల్పంగా వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలంలోని కొండాపూర్, వల్లంపెల్లి, దమ్మన్నపేట్, లింగంపేట్, కాచారం, కల్వకోట,మన్నెగూడెం, మేడిపెల్లి గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వండగండ్లు బీభత్సం సృష్టించాయి. వరి, పుసుపు, నువ్వులు, మామిడి, పంటలు, వండగండ్ల దెబ్బకు నేలరాలాయి. సుమారు వందెకరాల్లో వరి నష్టపోయిందని అంచనా వేసినట్టు మండల వ్యవసాయాధికారిణి త్రివేదిక తెలిపారు.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నాగరాజుపల్లి, నంగునూరు, సిద్ధన్నపేట, జెర్రిపోతుల తాండ గ్రా మాల్లో సుమారు 350 ఎకరాల వరి పంట, 150 ఎకరాల మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. జేపీ తండాలో పిలుగుపాటుకు పాడి ఆవు మృత్యువాత పడింది. కొమురవెల్లి మండలం గౌరాయిపల్లి, కొమురవెల్లి, లెనిన్నగర్, రసులాబాద్, అయినాపూర్ గ్రామాల్లో వరి పైర్లు, బెజ్జంకిలో మామిడికాయలు, వరిపంటలు నేలకొరిగాయి. గజ్వేల్ మండలం దామరకుంట గ్రామంలో 10 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. జిల్లాలో లక్షా 371.04 హెక్టార్లలో మామిడి పంట, 93.6 హెక్టార్లలో కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. మొత్తంగా జిల్లాలో 1,464,64 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు.
హైదరాబాద్లో..
నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి, శుక్రవారం సాయంత్రం వర్షం కురిసింది. శుక్రవారం తెల్లవారుజామున నగరంలోని పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. కొన్ని చోట్ల వడగండ్లు పడ్డాయి. నారాయణగుడ, బంజారాహిల్స్ రోడ్డు నెం.10, మెహిదీపట్నంలోని నవోదయకాలనీ, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్లో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, కిస్మత్పురాలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అయితే శుక్రవారం సాయంత్రం వరకూ వాతావరణం పూర్తిగా చల్లబడటంతో వేసవితాపం నుంచి ప్రజలు ఉపశమనం పొందారు.