Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనుగోళ్లలో తీవ్ర జాప్యం
- రెండు వారాలుగా రైతుల పడిగాపులు
- రవాణాకు లారీలూ లేవ్..
- అకాల వర్షానికి తడిసిన ధాన్యం
నవతెలంగాణ-ఖమ్మం ప్రతినిధి
ఓ వైపు తీవ్ర ఎండలు.. మరోవైపు అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతులు.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ అవస్థలు పడుతున్నారు. రోజుల తరబడి రాత్రింబవళ్లు ధాన్యం వద్ద కాపలా కాయాల్సి వస్తోంది. ధాన్యంలో తేమ, గన్నీ సంచుల కొరత, రవాణాకు లారీలు లేకపోవడం తదితర కారణాలతో కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కొనుగోళ్లు జరగక వేలాది మంది రైతులు కొనుగోలు కేంద్రాల్లో పగలూ, రాత్రి జాగారం చేస్తున్నారు. కనీస సౌకర్యాల్లేకపోవడంతో గురువారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం రాసులు నీటిపాలయ్యాయి.
రబీలో ధాన్యం కొనుగోలుకు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ప్రభుత్వం ఐకేపీ, స్థానిక సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఖమ్మం జిల్లాలో 1.60లక్షల మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాలో సుమారు 80వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు లక్ష్యంగా నిర్ధారించారు. ఇందుకుగాను ఖమ్మం జిల్లాలో 23ప్రాంతాల్లో డీఆర్డీఏ, సెర్ప్ ద్వారా మహిళా సంఘాలు కొనుగోలు చేస్తుండగా, 72ప్రాంతాల్లో సహకార సంఘాలు కొనుగోలు చేస్తున్నాయి. భద్రాద్రి జిల్లాలో 69చోట్ల సహకార సంఘాలు, 24ప్రాంతాల్లో ఇందిరాక్రాంతిపథం సభ్యులు (స్వయం సహాయక సంఘాలు) ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరి ధాన్యం 'ఏ' గ్రేడ్ రకానికి ప్రభుత్వం ఖరారు చేసినట్టుగా రూ.1770, సాధారణ రకానికి రూ.1750లు చెల్లించాల్సి ఉంది.
అయితే, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఆయా ప్రభుత్వ శాఖలు నిర్వహణలో మాత్రం చేతులెత్తేశాయి. ధాన్యాన్ని కాంటా వేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. భూస్వాములు, వ్యాపారులు తెచ్చే పంటను వెంటనే కాంటాలు వేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు పదిహేను రోజుల నుంచి కొనుగోలు చేయక కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. రాత్రివేళ కనీసం కరెంటు కూడా లేకపోవడంతో పాములు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగునీరు, టెంట్లు కూడా ఏర్పాటు చేయలేదు.
గన్నీ సంచుల్లేవ్.. లారీల్లేవ్
ప్రస్తుతం రెండు జిల్లాల్లోనూ సుమారు 40లక్షలకు పైగా గన్నీ సంచుల కొరత ఉంది. ధాన్యం కాంటాలు వేసినా తరలించేందుకు లారీల్లేక నిల్వలు పెరిగిపోతున్నాయి. దీంతో రోజుల తరబడి మార్కెట్లో ఉండలేక తామే రవాణా ఖర్చులు భరించి మిల్లర్లకు చేరవేస్తామని చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. నాలుగు రోజుల కిందట, తిరిగి గురువారం రాత్రి భద్రాద్రి జిల్లాలో పలుచోట్ల కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయినా అధికారుల్లో మార్పురాలేదు.
కొనుగోలు కేంద్రాలతో ఒరిగిందేమీలేదు
ఐదెకరాలు వరి సాగు చేశాను. 120 బస్తాల ధాన్యం మార్కెట్కు తెచ్చాను. 15రోజులు దాటినా కొనుగోలు చేయలేదు. ఎప్పుడు అడిగినా పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. రాత్రివేళ పాములు వస్తున్నాయి. కనీసం రైతు గోడు వినేవారేలేరు. ఈ కేంద్రాల వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదు.
-జుబ్బారి వెంకటేశ్వర్లు.
ములకలపల్లి మండలం
300బస్తాలు తెచ్చి రెండు వారాలైంది
14 ఎకరాల్లో వరి సాగుచేశాను. ఇప్పటికే 300బస్తాలు కొనుగోలు కేంద్రానికి తెచ్చాను. బస్తాల్లేవని కొన్నిరోజులు, రవాణా చేయడానికి లారీల్లేవని కొన్ని రోజులు చెప్పారు. దీంతో రైతులంతా కేంద్రాల్లోనే పంట వద్ద కాపలా ఉండాల్సి వస్తోంది.
- పుట్టా సత్యనారాయణ-నేలకొండపల్లి
గన్నీసంచుల కొరత వాస్తవమే..
ఖమ్మం జిల్లాలో గన్నీసంచుల కొరత ఉన్నమాట వాస్తవమే. లారీలు ఏర్పాటు చేస్తున్నం. కొనుగోళ్లలో వేగం పెంచి కేంద్రాల్లోని సరుకంతా తరలిస్తాం. రైతులు ఆందోళన చెందొద్దు. రెండు మూడు రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తాం.
సంధ్యారాణి-డీఎస్ఓ-ఖమ్మం
17రోజులుగా ఇక్కడే ఉన్నా
50బస్తాల ధాన్యం తెచ్చి 17రోజులు దాటింది. కాంటా వేయకుండా నేడు రేపూ అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కొనుగోలు చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు. కొనుగోలు కేంద్రం ఏర్పాటుచ ేసినా ఏమాత్రం ఉపయోగం లేదు.
- చిరగా కృష్ణయ్య
రామచంద్రాపురం- భద్రాద్రి జిల్లా