Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదుపులోకి నలుగురు ఐఎస్ అనుమానితులు
- ప్రశ్నిస్తున్న అధికారులు
- పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ స్వాధీనం
నవ తెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి/ రాజేంద్రనగర్
హైదరాబాద్లో మరోసారి కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదుల కదలికలు బయటపడ్డాయి. ఈ మారు కూడా అత్యంత రహస్యంగా సమాచారాన్ని సేకరించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నగర శివార్లలలో శనివారం మూడు ప్రాంతాలలో మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున సెల్ఫోన్లు, సిమ్ కార్డులతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ బయటపడ్డాయి. నలుగురు ఐఎస్ అనుమానితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎన్ఐఏ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 2016 లో ఢిల్లీలో మారణకాండకు కుట్ర పన్నిన ఐఎస్ ఉగ్రవాదుల కేసు దర్యాప్తును సాగిస్తున్న ఎన్ఐఏకు తాజాగా మరి కొన్ని ఆధారాలతో పాటు , ఐఎస్ ఉగ్రవాద శక్తుల కదలికలపై కీలక సమాచారం అందింది. అబుదాబీ మాడ్యుల్లో ఈ ఉగ్రవాదులు మరో విధ్వంసానికి కుట్ర పన్నుతున్నట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఈ మేరకు అందిన సమాచారంతో హైదరాబాద్ శివార్లలోని మైలార్దేవ్ పల్లి, కింగ్స్ కాలనీ మొదలైన ప్రాంతాలలో తెల్లవారు జామునుంచే ఎన్ఐఏ అధికారులు స్థానిక సైబరాబాద్ పోలీసుల సహాయంతో దాడులు ప్రారంభించారు. మొత్తం పదికి పైగా అనుమానిత ఇండ్లపై వీరి సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆ ఏరియాను పూర్తిగా కార్టన్ చేసిన అధికారులు తాము దాడులు కొనసాగినంత సేపు ఎవ్వరినీ లోనికి అనుమతించలేదు. ఈ దాడులలో అనుమానిత ఇండ్ల నుంచి 13 మొబైల్ ఫోన్లు,11 సిమ్ కార్డులు, 1 ఐ ప్యాడ్, 2 ల్యాబ్టాప్లు, 1 హార్డ్ డిస్క్, 6 పెన్ డ్రైవ్లు, 6 ఎస్బీ కార్డులు, 3 వాకీటాకీలను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను కూడా స్వాధీన పరుచుకున్నారు. అలాగే ఈ ఇండ్లలో ఉన్న నలుగురు అనుమానిత ఐఎస్ తో సంబంధాలు ఉన్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గత రెండేండ్ల కిందట హైదరాబాద్ పాతబస్తీ నుంచి 12 మందికి పైగా ఐఎస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న మైలార్దేవ్పల్లి పరిసరాలలో ఐఎస్ కార్యకలాపాలు సాగుతున్నాయనీ తాజా ఎన్ఐఏ దాడుల్లో బహిర్గతం కావడం కలకలం రేపింది. కాగా ప్రస్తుతం పట్టుబడ్డ నలుగురు అనుమానితులు గతంలో అరెస్టయన రహమాన్కు అత్యంత సన్నిహితులుగా అనుమానిస్తున్నారు. దీనిపై విచారణ కొనసాగుతున్నదనీ ఈ సందర్భంగా ఎన్ఐఏ అధికారులు తెలిపారు. హైదరాబాద్ తో పాటు వార్ధ లో సైతం ఐఎస్ ఉగ్రవాదుల కోసం దాడులు సాగించినట్టు తెలిపారు.