Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండో పాలస్తీనా సిరియా సంఘీభావ దినోత్సవంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సిరియా, పాలస్తీనాల పట్ల అమెరికా అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నదని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి దుశ్చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని వారు పిలుపునిచ్చారు. 'ఇండో అరబిక్ లీగ్, హైదరాబాద్-ది రహ్నుమా డైలీ' సంయుక్త ఆధ్వర్యాన శనివారం హైదరాబాద్లో 'ఇండో పాలస్తీనా సిరియా సంఘీభావ దినోత్సవాన్ని' నిర్వహించాయి. ఇండో అరబిక్ లీగ్ చైర్మెన్ సయ్యద్ వికారుద్దీన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నర్సింహారావు మాట్లాడుతూ... ఇజ్రాయిల్ ఆక్రమిత గోలన్ హైప్స్ ప్రాంతాన్ని సిరియాకే వదిలిపెట్టాలంటూ ఐక్యరాజ్య సమితి సూచించిందని గుర్తుచేశారు. ఇందుకు భిన్నంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు యావత్ ప్రపంచాన్నే నివ్వెరపరిచాయని చెప్పారు. హైప్స్ను తమ దేశం ఇజ్రాయెల్కు చెందిన భూభాగంగా గుర్తిస్తున్నదంటూ ఆయన చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. యూఎన్వో ఆదేశాలకు విరుద్ధంగా ఆయన చేసిన వ్యాఖ్యలను అందరూ ఖండించాలని చెప్పారు. మరోవైపు వందల ఏండ్ల నుంచి పాలస్తీనా రాజధానిగా ఉన్న జెరూసలేంను ఇజ్రాయెల్ దురాక్రమణ చేసిందని అన్నారు. ఇక్కడ అమెరికా తన ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని ప్రారంభించటం శోచనీయమన్నారు. దీంతోపాటు సిరియా అంతర్యుద్ధంలో తిరుగుబాటుదార్లను అమెరికా ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. ఇలాంటి చర్యలన్నింటినీ అన్ని దేశాలు ఖండించాలని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్రెడ్డి, సీపీఐ జాతీయ నాయకులు అజీజ్పాషా, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్డీ అబ్బాస్, గిరిజన విద్యార్థి సంఘం నాయకులు శోభన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో యెమన్, పాలస్తీనా, సిరియా, ఇరాక్ రాయబారులు కూడా పాల్గొన్నారు.