Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల దౌర్జన్యాలు మానుకోవాలి :
- తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు
- పోలీసు పహారా మధ్య ఇంద్రవెల్లి సంస్మరణ దినం
- గిరిజన వీరులకు ఘన నివాళి
- బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
- ఈ బతుకులు చిగురించేదెన్నడు?
నవతెలంగాల-ఇంద్రవెల్లి
పులుల సంరక్షణ పేరిట టైగర్జోన్ ప్రాంతంలో ఆదివాసులను ప్రభుత్వం అడవి నుంచి తరలిస్తే తిరగబడతామని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు అన్నారు. ఆదివాసులపై అధికారులు దౌర్జన్యం చేయడం మానుకోవాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అమరవీరుల శనివారం గిరిజనులు ఘనంగా నివాళులర్పించారు. పోలీసు పహారా మధ్య ఇంద్రవెల్లి సమీపంలోని అమరవీరుల స్తూపం వద్ద సంప్రదాయ పూజలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి ఆదివాసులు తరలివచ్చారు. గిరిజన వాయిద్యాలైన తుడుం, కాలికోం, సన్నాయిలను వహిస్తూ తెల్లటి వస్త్రానికి, జెండాకు ఎరుపు రంగును పూసి ఆవిష్కరించారు. 1981లో కాల్పులకు బలైన వారి కుటుంబాలతో పాటు గాయాలపాలైన మడావి జంగుబాయి, భీంరావు గిరిజనులతో కలిసి స్తూపం వద్దకు చేరుకున్నారు. కొబ్బరికాయ, కుంకుమ, బియ్యాన్ని సమర్పించి సంప్రదాయ పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు వినియోగించారని విమర్శించారు. 1981 ఏప్రిల్ 20న ఆదివాసులు భూమి కోసం, భుక్తి కోసం శాంతియుతంగా సమావేశం నిర్వహిస్తే మావోయిసులంటూ అప్పటి ప్రభుత్వం కాల్చి చంపిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో సైతం అమరవీరుల సంస్మరణ సభకు ఆంక్షలు విధించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికీ ఆదివాసీ గూడేల్లో తాగునీరు, తిండి లేక మరణిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులు, గిరిజనేతరులపై ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు దౌర్జన్యం చేస్తే తిరగబడతారని హెచ్చరించారు. ఆదివాసుల ఉద్యమం ఆగదని, ఎన్నికల కోడ్ ఉన్నందున కొంత విరామం ఇచ్చామని తెలిపారు. తాను ఎంపీగా గెలవడం ఖాయమని, వచ్చే ఏడాది లక్ష మందితో సంస్మరణ సభ జరుపుకుందామని అన్నారు.
15 మందికి ఆర్థిక సాయం
1981లో అమరులైన కుటుంబాలకు, గాయపడిన వారికి స్తూపం వద్ద సోయం బాపురావు ఆర్థిక సాయం అందజేశారు. ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున 15 మందికి అందజేశారు. కార్యక్రమంలో కుమ్రంభీం మనుమడు కుమ్రం సోనే రావు, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు జలైజాకు, సిడాం భీంరావు, వెడ్మ బొజ్జు, మాన వ హక్కు వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆత్రం భుజంగ్రావు, గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నేతవాత్ రాందాస్, ఐటీడీఏ చైర్మన్ కనకే లక్కేరావు పాల్గొన్నారు.