Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
''జీతాలిస్తున్నాం... వాళ్లు పాఠాలు చెబుతున్నారు. టీచర్లకు ఇంకేం సమస్యలుం టాయి' అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ వెంటనే టీచర్లకు క్షమాపణ చెప్పాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా
రవి డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో సందర్శిస్తే సమస్యలు అర్థమవుతాయని సీఎంకు సూచించారు. ఓవైపు టీచర్ల కొరత, మరోవైపు కనీస సౌకర్యాలు లేకుండా పాఠశాలలను నడిపించడం ఎలా అని ప్రశ్నించారు. 2012 నుంచి టీఆర్టీ పోస్టులను భర్తీ చేయలేదన్నారు. రెండు నెలల పాటు ఇద్దరు మంత్రులతో పాలన నడిపినట్టు, టీచర్లు లేకుండా పాఠశాలలను నడపడం సాధ్యం కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో ఉపాధ్యాయులు పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల వద్ద శనివారం టీచర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్లోని తార్నాకలోని సెయింట్ ఆన్స్ పాఠశాల స్పాట్ కేంద్రం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో చావారవి మాట్లాడుతూ...ఉపాధ్యాయులకు ఐఆర్, పీఆర్సీ, తదితర హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 23వేలకు పైగా ఉన్న ఖాళీ టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, టీఆర్టీలో సెలెక్ట్ అయిన 8972 అభ్యర్థులకు వెంటనే టీచర్ పోస్టులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేజీ టూ పీజీ విద్యను గాలికొదిలేసి కులాలవారీగా గురుకులాలను పెడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందని అన్నారు. స్క్రిప్టు వాల్యుయేషన్కు రూ.15 ఇవ్వాలని, స్పాట్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, టీచర్లు సమ్మె చేస్తే ఎన్టీఆర్ ప్రభుత్వం ప్రజల్లో విస్తృతంగా అసత్య ప్రచారం చేసిందని, 1989 ఎన్నికల్లో ఎన్టీఆర్ ఘోరంగా ఓడిపోయారని గుర్తుచేశారు. ఉద్యోగులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదని హెచ్చరించారు. ఏపీలో ఐఆర్ ద్వారా టీచర్లు 20 శాతం అదనంగా వేతనం తీసుకుంటున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఐదేండ్లుగా ప్రమోషన్లు ఆగాయని, వెంటనే టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పండింట్, పీఈటీ అప్గ్రేడేషన్ సహా ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతు లు కల్పించాలన్నారు. కేజీబీవీ, ఎయిడెడ్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల పరిష్కారం కోసం టీచర్లంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలకు అనుకూలంగా కొన్ని పత్రికల్లో టీచర్లకు వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాస్తున్నారని, వాటిని తిప్పికొట్టి వాస్తవాలను ప్రచారంలో పెట్టాలని పిలుపునిచ్చారు. టీటీఏ రాష్ట్ర అధ్యక్షులు హరికిషన్ మాట్లాడుతూ..ఇప్పటికే సీఎం టీచర్లు, రెవెన్యూ ఉద్యోగుల పట్ల అనుచితంగా మాట్లా డారని, ప్రజల్లో ప్రభుత్వ ఉద్యోగుల పట్ల చులకన భావం కలిగించేలా రోజుకో శాఖను టార్గెట్ చేసి మాట్లాడే ప్రమా దం ఉందన్నారు. 50కిపైగా సంఘాలెందుకు అని సీఎం వ్యాఖ్యానించడం సరిగాదని, దేశంలో, రాష్ట్రంలో వేల పార్టీలుండగా మళ్లీ టీఆర్ఎస్ పార్టీ ఎందుకని ప్రశ్నించారు. డీఏల కోసం టీచర్లు పోరాటం చేయాల్సిన పరిస్థితి నేడు నెలకొందన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ..ఏపీలో ఐఆర్ ప్రకటించారని, మన రాష్ట్రంలో మాత్రం సీఎం కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపుతూ ఐఆర్, పీఆర్సీ విషయాల పై నోరుమెదపట్లేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం లో టీచర్లు కీలక పాత్ర పోషించారని, అలాంటి టీచర్ల పట్ల సీఎం వ్యాఖ్యలు సరిగాదని అన్నారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య ఏమైందని సీఎంను ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశా లలకు నిధులు తగ్గిస్తూ ప్రజల్లో చిన్నచూపు కలిగించేలా చేసి ప్రయివేటు వైపు మళ్లేలా పాలకులు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమం లో యూటీఎఫ్ రాష్ట్ర కార్యద ర్శులు కొండల్రావు, శారద, ఆయా సంఘాల నాయకులు రామకృష్ణ, కవిత, సంజీవరావు, సింహాచలం, రామకృష్ణ, సమ్మద్(యూటీఎఫ్), రవీందర్, రాంబాబు, గౌతమ్ నాయుడు, సీతారామశాస్త్రి (టీపీటీఎఫ్), రామకృష్ణ, వినోద్, మల్లయ్య(డీటీఎఫ్), లక్ష్మణ్(టీటీఏ), శ్రీనివాస్(టీఆర్టీ అభ్యర్థుల కమిటీ), తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండలో...
ఉద్యోగ, ఉపాధ్యాయులపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల ఐక్య పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం నల్లగొండ పట్టణంలోని పదవ తరగతి స్పాట్ వాల్యూయేషన్ సెంటర్ వద్ద నిరసన తెలిపారు.