Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ హైకోర్టు శతాబ్ది ఉత్సవాల్లో జస్టిస్ ఎన్వీ రమణ
- న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలి : జస్టిస్ సుభాష్రెడ్డి
నవతెలంగాణ - హైదరాబాద్, సిటీబ్యూరో
న్యాయవ్యవస్థను సంక్షోభంలోకి నెట్టేప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని, ఇలాంటివేమీ కొత్తకాదని, వీటికి ఫలితాలు ఉండవని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తేల్చి చెప్పారు. పెత్తనం చేసేందుకు జరుగుతున్న యత్నాలన్నింటినీ తిప్పికొట్టడమే కాకుండా ఇలాంటి సంక్షోభాల్లే అవకాశాలుగా చేసుకుని న్యాయవ్యవస్థ మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. తెలంగాణ హైకోర్టు శతాబ్ది ఉత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. గంభీరమైన హైకోర్టు భవనాలు విద్యుత్కాంతుల వెలుగుల్లో మరింత అందాన్ని సంతరించుకున్నాయి. హైకోర్టు ప్రధాన ద్వారం వద్ద శనివారం ఏర్పాటు జరిగిన ఉత్సవ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి, జస్టిస్ లావు నాగేశ్వర్రావులు హాజరయ్యారు. జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, విమర్శలకు, ఆరోపణలకు న్యాయవ్యవస్థ భయపడేదే లేదని తేల్చి చెప్పారు. కలిసికట్టుగా ఇలాంటి వాటిని తిప్పికొట్టి మరింత బలోపేతం అయ్యేలా చేస్తామనే ధీమాను వ్యక్తం చేశారు. న్యాయం జరిగితేనే ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తి నెరవేరుతుందన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి ప్రయత్నిస్తామని జస్టిస్ రమణ చెప్పారు. పోస్టుల భర్తీకి పేర్లను సిఫార్సు చేయాలని హైకోర్టులను సుప్రీంకోర్టు కోరిందన్నారు. ఖాళీల భర్తీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సైతం సంప్రదిస్తానన్నారు. పెండింగ్ కేసుల కారణంగా ఎంతోమందికి సకాలంలో న్యాయం అందక విచారణ ఖైదీలు జైళ్లల్లోనే ఉండిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ హైకోర్టుతో తనకు 30 ఏండ్లకుపైగా అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. న్యాయవాదిగా, న్యాయాధికారిగా, న్యాయమూర్తిగా తనకున్న అనుబంధాన్ని తెలిపారు. నేడు ఎంతో ఉద్వేగపూరితమైన దినమని, తన జీవితంలో సగానికిపైగా ఇదే హైకోర్టు భవనంలో గడిచిందని, ఇక్కడికి వస్తే సొంత ఇంటికి వచ్చినట్లు అనిపిస్తుందంటూ ఉద్వేగభరితంగా జస్టిస్ రమణ మాట్లాడారు. న్యాయకోవిదుల్ని అందించిన ఈ భవనం వందేళ్లు పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషదాయకమన్నారు. ఇక్కడ పనిచేసిన న్యాయమూర్తుల్లో 16 మంది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అయ్యారని, 14 మంది దేశ అత్యున్నత న్యాయస్థానంలో సేవలందించారని జస్టిస్ రమణ వివరించారు.
పెండింగ్ కేసుల మహమ్మారిని రూపుమాపాలంటే న్యాయమూర్తుల సంఖ్యను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ హైకోర్టు జడ్జీల సంఖ్య 42కు పెంచాలన్నారు. ఏపీలో కూడా ఖాళీగా ఉన్న జడ్జీల పోస్టుల్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. తీర్పుల్లో నాణ్యత ఉన్నప్పుడే ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం చేసినట్లు అవుతుందన్నారు. ఈ హైకోర్టు భవనంలో ప్రాక్టీస్ చేసిన ఫలితంగా ఎంతోమంది పెద్దలు పరిచయం ఏర్పడి సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థాయికి ఎదిగానని జస్టిస్ లావు నాగేశ్వర్రావు చెప్పారు. తెలంగాణ హైకోర్టులో 11మంది మాత్రమే జడ్జీలు ఉన్నారని, న్యాయమూర్తులపై పని భారం పడుతోందని తాత్కాలిక సీజే జస్టిస్ ఆర్ చౌహాన్ చెప్పారు. న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ ముగింపు ప్రసంగం చేశారు. ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్కుమార్, ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ హాజరైన ఈ కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, హైకోర్టు లాయర్ల సంఘం అధ్యక్షుడు దామోదర్రెడ్డి మాట్లాడారు.