Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీఆర్ఏల రాష్ట్ర కమిటీ పిలుపు
- విలీన ఆలోచనను విరమించుకోవాలి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రెవెన్యూ వ్యవస్థ రక్షణ కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని వీఆర్ఏల రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. రెవెన్యూ వ్యవస్థను పంచాయతీ, వ్యవసాయ శాఖలో విలీనం చేసి రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్లోని తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కార్యాలయంలో సిహెచ్ రాజయ్య అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థ పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు వ్యాఖ్యలు ఆ శాఖ ఉద్యోగులకు అభద్రత, ఆందోళనకు గురిచేస్తున్నాయని తెలిపారు. వీఆర్ఏలు.. పంచాయతీ శాఖకు, ఆర్ఐ, తహశీల్దార్లను వ్యవసాయ శాఖకు బదిలీ చేసి, రెవెన్యూ శాఖను రద్దు చేసి ఆ బాధ్యతలను ప్రయివేటు సంస్థలకు అప్పగించాలన్న ఆలోచనలో సర్కారు ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి రెవెన్యూకు అత్యున్నత అధికారి, ప్రధాన భూ పరిపాలన అధికారి (సీసీఎల్ఏ)ను రెవెన్యూ మంత్రిని లేకుండా చేసిందని, పెంచిన జిల్లాలు రెవెన్యూ డివిజన్లు, మండలాలకు తగిన సిబ్బందిని నియమించకుండా ఆ శాఖలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే, ఆధార్, ఆసరా, పింఛన్లు, ఒంటరి మహిళలు, ఇందిరమ్మ ఇండ్లు, భూ ప్రక్షాళన, కళ్యాణ లక్ష్మి లాంటి అనేక సర్వేలు, సంక్షేమ పథకాల అమలులో రెవెన్యూ ఉద్యోగుల ఎంతో కష్టపడ్డారంటూ వారికి ప్రోత్సహకరంగా ఒక నెల వేతనం అదనంగా చెల్లించి, ఇప్పుడు రెవెన్యూ ఉద్యోగులను లంచగొండులు అని అనడం శోచనీయమన్నారు. ఎవరైనా అవినీతి పరులు ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలే కాని, వ్యవస్థను మొత్తం అవినీతి పరులు అనడం సమంజసం కాదన్నారు. కొత్త చట్టం పేరుతో ఉన్న ఉద్యోగులను తగ్గించినా, ఇతర శాఖలకు బదిలీ చేసినా పోరాటాలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీ రాజ్లో కొత్త చట్టం తెచ్చినా కార్మికుల సమస్యలు పరిష్కారం కాదని విమర్శించారు. ఈ సమావేశంలో నర్సింహారావు, ఎం రామయ్య, బోశయ్య గంగరాము తదితరులు పాల్గొన్నారు.
కమిటీ తీర్మానాలు
- రెవెన్యూ వ్యవస్థలో మార్పులు చేయాలనుకుంటే ముందుగా రెవెన్యూ సంఘాలతో సంయుక్త సమావేశాలు ఏర్పాటు చేసి వాటిపై చర్చించాలి
- ప్రభుత్వం వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు010 పద్దు కింద ప్రతి నెల 1వ తేదీన వేతనాలు, సొంత గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు, వీఆర్ఓ, అటెండర్, వాచ్మెన్, ప్రమోషన్ల కోసం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి
- రెవెన్యూ ఉద్యోగులు లంచగొండులు, అవినీతి పరులని వ్యవస్థను రద్దు చేస్తాం. ఇతర శాఖలో విలీనం చేస్తాం అంటూ ఉద్యోగుల ఉనికే ప్రమాదం ఏర్పడుతున్నందున ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి.