Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంతో రహస్య భేటీ
- 'డీల్' ఓకే...కారెక్కడమే తరువాయి
- ఆరుకు పడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య
- అసెంబ్లీలో కోల్పోనున్న ప్రతిపక్ష హోదా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ ఎమ్మెల్యేల జంపింగ్లు మళ్లీ మొదలయ్యాయి. ఇప్పటికే కొంతమంది గులాబీ కండువా కప్పుకోగా మరో ముగ్గురు కారెక్కేందుకు సిద్ధమయ్యారు. పోడెం వీరయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, జగ్గారెడ్డి ఆ వరుసలో నిలబడ్డారు. ఇప్పటికే ఆ ముగ్గురు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్తో భేటీ అయినట్టు ప్రగతిభవన్ వర్గాలు అంటున్నాయి. పార్టీ మారేందుకు కావాల్సిన సరంజామాను ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది. సీఎం కేసీఆర్తో వారికి డీల్ కుదిరిందని, కారెక్కడమే తరువాయి అని తెలుస్తోంది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరనుండటంతో కాంగ్రెస్ సంఖ్య ఆరుకు పడిపోయింది. దీంతో ప్రతిపక్షహోదా కాంగ్రెస్ పార్టీకి కోల్పోనుంది. ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, హరిప్రియనాయక్, ఆత్రం సక్కు, రేగా కాంతారావు, సురేందర్, చిరుమర్తి లింగయ్య, కందాల ఉపేందర్రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, హర్షవర్థన్రెడ్డి కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్కు జై కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి సైతం పార్టీని వీడుతున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
గతంలో పార్టీని వీడేది లేదని చెబుతున్నా...చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిని బలహీన పరిచేందుకు రోహిత్రెడ్డిని తమ వైపు తిప్పుకునేందుకు టీఆర్ఎస్ అధిష్టానం విశ్వప్రయత్నాలు చేస్తోంది. భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య పార్టీ మారేందుకు మొదటి వరసలోనే ఉన్నా...మావోయిస్టులు బెదిరించడం వల్లే కొన్నాళ్లూ ఆగినట్టు తెలిసింది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆయన పార్టీ వీడేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భార్య గండ్ర జ్యోతి ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొనసాగుతున్నారు. ఆమెకు కీలకమైన జెడ్పీ చైర్పర్సన్ పదవి ఇస్తామని అధికార పార్టీ నుంచి సంకేతాలిచ్చినట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఎప్పుడు సీఎం కేసీఆర్పై ఒంటికాలిమీద లేచే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇటీవలకాలంలో మెత్తబడ్డారు. ప్రతి విషయంలోనూ సీఎంను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరోవైపు సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే స్పీకర్కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ నుంచి వలసలు ఆగడం లేదు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు భూముల క్రమబద్దీకరణ, కాంట్రాక్టులు, కేసుల ఎత్తివేతతోపాటు టీఆర్ఎస్ పలు ఆశలు కల్పిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.