Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంట నష్టం అంచనా వేసి పరిహారం చెల్లించాలి : తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వడగండ్ల వర్షాల వల్ల పిడుగులు పడి మరణించిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేవి వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 20 వరకు ప్రతి రోజు ఎక్కడో ఒక ప్రాంతంలో వర్షం పడుతూనే ఉన్నదని తెలిపారు.పిడుగులు పడి పశువులు, మనుషులు చనిపోయారని తెలిపారు. నిజామాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, పెద్దపల్లి, వరంగల్, జగిత్యాల జిల్లాల్లో పెద్ద ఎత్తున పంటనష్టం జరిగిందని పేర్కొన్నారు.నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 116 గ్రామాలకు చెందిన 10,654 మంది రైతులు 13 వేల ఎకరాల్లో మొక్కజొన్న, ఆవాలు, వరి, జొన్న, మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. యాచారం మండలంలో రూ. 50 వేల విలువగల పాడి ఆవులు మరణించాయని పేర్కొన్నారు. వ్యవసాయశాఖ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పంట నష్టం అంచనా వేసి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 14వ ఫైనాన్స్ కమిషన్ విపత్తుల నిర్వహణ శాఖకు జిల్లాల వారీగా నిధులు కేటాయించిన్పటికీ బాధిత కుంటుబాలకు ఇప్పటి వరకు చేరలేదని తెలిపారు. సహజంగానే ఏటా 300 మండలాల్లో కరువు నెలకొంటున్నదని, పెట్టిన పెట్టుబడులు రాక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, రైతులు ఆగ్రహానికి గురికాకముందే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.