Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు విడతల్లో పోలింగ్
- మే 6, 10, 14న ఎన్నికలు మే 27న ఫలితాల వెల్లడి
- తొలిసారి ఆన్లైన్లో నామినేషన్ల స్వీకరణ
- నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ కమిషనర్ నాగిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మే 6, 10, 14 తేదీల్లో మూడు విడతలుగా జరుగుతాయని నాగిరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో తొలిసారి అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో నామినేషన్లను స్వీకరించబోతున్నట్టు తెలిపారు. ప్రింట్ కాఫీలను రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 539 జెడ్పీటీసీలుండగా...కోర్టు కేసు కారణంగా మంగపేట మినహాయించి మిగతా 538 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. 5857 ఎంపీటీసీ స్థానాలుండగా...కోర్టు కేసులు, పదవీకాలం ముగియని నేపథ్యంలో ప్రస్తుతం 40 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని తెలిపారు. తొలి విడతలో 2166, రెండో విడతలో 1913, మూడో విడతలో 1738 స్థానాలకు ఎన్నికలు జరుపుతామని అన్నారు. తొలి విడతకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఈ నెల 22న ప్రారంభమవుతుందని, ఆ రోజు నుంచి మూడు రోజుల వరకు నామినేషన్లను స్వీకరిస్తారని, నామినేషన్ల పత్రాల పరిశీలన, ఉపసంహరణ అనంతరం మే 6వ తేదీన ఎన్నిక నిర్వహిస్తామని చెప్పారు. రెండో విడత ఎన్నికల ప్రక్రియ ఈ నెల 26న ప్రారంభమవుతుందని, 28వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, నామినేషన్ల పత్రాల పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థుల ప్రకటన అనంతరం 10వ తేదీన ఎన్నిక జరుపుతారన్నారు. మూడో దశ ఎన్నికల ప్రక్రియ ఈ నెల 30న ప్రారంభమై మే 2 వ తేదీన వరకు నామినేషన్లు వేసే గడువు ఉంటుందని, మే 14న ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. జడ్పీటీసీ స్థానాలకు కూడా ఇదే పద్ధతిలో మూడు దశల్లో నిర్వహిస్తారు. జనరల్ కేటగిరీలో పోటీచేసే జెడ్పీటీసీ అభ్యర్థులు రూ.5వేలు, ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్థులు రూ. 2,500 దరావత్ చెల్లించాలన్నారు. జనరల్ కేటగిరీ ఎంపీటీసీ అభ్యర్థులు 2,500, ఎస్సీ,ఎస్టీ, బీసీ అభ్యర్థులు 1250 దరావత్ కట్టాలన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థులు రూ.4 లక్షల వరకు, ఎంపీటీసీలు లక్షన్నర వరకు ఖర్చుపెట్టుకునే అవకాశాన్ని కల్పించామన్నారు. ఖర్చులవివరాలను ఆధారాలతో సహా కచ్చితంగా అధికారులకు అందజేయాలని, లేనిచో నిర్ణీత సమయం తర్వాత వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తామని అన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, బూర్గంపాడు ఎంపీపీల పదవీకాలం ఇంకా ఉండటంతో అక్కడ ఎన్నికలు నిర్వహించట్లేదన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహిస్తామన్నారు. ఒక్కో దశలో ఎన్నికల నిర్వహణకు సుమారు 50 వేల మంది సిబ్బందిని ఉపయోగించుకుంటామని, 26వేల మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని చెప్పారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఒకే విడతలో, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్నగర్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో రెండు విడతలలో, మిగతా జిల్లాల్లో మూడు విడతలలో ఎన్నికలు జరుగుతాయన్నారు. మొత్తం 1,56,11,474 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.