Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రవిప్రకాశ్,శివాజీల నుంచి మెయిల్
- దర్యాప్తును ముందుకు సాగిస్తున్న సైబర్క్రైమ్
- వారి పిటిషన్లపై ఎన్సీఎల్టీలో విచారణపై అప్పిలేట్అధారిటీ స్టే
నవ తెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి
టీవీ9 ఫోర్జరీ కేసులో విచారణకు హాజరుకావడానికి తమకు పది రోజులు సమయం ఇవ్వాలంటూ సదరు ఛానల్ మాజీ సీఈఓ రవిప్రకాశ్, సినీనటుడు శివాజీలు సైబర్క్రైమ్ అధికారులకు మెయిల్ పంపించారని తెలిసింది. అయితే ఈ మెయిల్ను పట్టించుకోని అధికారులు తమ దర్యాప్తును ముందుకు సాగిస్తున్నారు. అదే సమయంలో కొత్త యాజమాన్యానికి వ్యతిరేకంగా ఎన్సీఎల్టీ ట్రిబ్యునల్లో ఈ ఇద్దరు వేసిన పిటిషన్పై విచారణ జరపకుండా ఢిల్లీలోని అప్పిలేట్ అధారిటీ స్టే విధించింది. కాగా సీఆర్పీసీలోని సెక్షన్ 41 క్రింద ఇచ్చిన నోటీసును సైతం బేఖాతరు చేస్తూ రవిప్రకాశ్,నటుడు శివాజీలు విచారణకు హాజరుకాక పోవడం పట్ల సైబర్క్రైమ్ అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ మేరకు తదుపరి చర్య కోసం సైబరాబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్తో సైబర్క్రైమ్ డీసీపీ రోహిణి గురువారం సమావేశమై చర్చించారని తెలిసింది. దీంతో న్యాయనిపుణులతో సంప్రదిస్తున్న అధికారులు రవిప్రకాశ్, శివాజీలపై కోర్టు నుంచి ఆదేశాలు తీసుకుని ముందుకు సాగాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే తమ ఆరోగ్యం బాగాలేదనీ , విచారణకు హాజరుకాలేమనీ, అందుకు పది రోజులు గడువు ఇవ్వాలంటూ ఈ కేసులో ప్రధాన నిందితుడు రవిప్రకాశ్, మరో నిందితుడు, సినీనటుడు శివాజీల నుంచి వచ్చిన మెయిల్స్ని ఉన్నతాధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ కేసు ప్రారంభంలోనే విచారణకు హాజరయ్యే విషయంలో తమ లాయర్ ద్వారా సమాచారానిన పంపించి గడువు కోరేందుకు ఇరువురు ప్రయత్నించారనీ, ఇప్పుడు సాకు చూపిస్తున్నారని దర్యాప్తు అధికారులు సీరియస్ గా ఉన్నారని సమాచారం. కాగా వచ్చిన మెయిల్స్ విజయవాడ నుంచి అని సైబర్క్రైమ్ అధికారులు గుర్తించారని తెలిసింది.
ఇదిలా ఉంటే నటుడు శివాజీకి 40 వేల షేర్లను విక్రయించిన వ్యవహారంలోనూ అక్రమాలు చోటు చేసుకున్నట్టు సైబర్క్రైమ్ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ముఖ్యంగా 2018 ఫిబ్రవరి 20వ తేదీన శివాజీకి ఈ షేర్లను విక్రయించినట్టు చూపించారని నిజానికి దీనికి సంబంధించిన వ్యవహారమంతా ఈ ఏడాది ఏప్రిల్ లోనే జరిగినట్టు సైబర్ నిపుణులు గుర్తించినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన వ్యవహారాన్ని మెయిల్స్ ద్వారానే సంబంధితులకు రవిప్రకాశ్ అతని సహచరులు పంపించినట్టుగా ఆధారాలను సైబర్క్రైమ్ ఇభాగం సేకరించిందని తెలిసింది.
ఈ వివరాలను మరింత లోతుగా విశ్లేషిస్తు మరో సారి టీవీ9 కార్యాలయం, రవిప్రకాశ్, శివాజీల నివాసాల నుంచి సోదాల సందర్భంలో సేకరించిన కంప్యూటర్ హార్డ్ డిస్క్లలోని సమాచారాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే కంపెనీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేశారనే ఆధారాలను సేకరించిన సైబర్క్రైమ్ అధికారులు షేర్ల విక్రయాలలోను చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించి మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే టీవీ9 యాజమాన్య మార్పుపై తనకు సమాచారం లేదని తాను ఖరీదు చేసిన షేర్ల ఇంకా తనకు మార్పిడి జరగలేదనీ, తనకు న్యాయం చేయమంటూ నటుడు శివాజీ ఎన్సీఎల్టీ లో పిటిషన్ వేయగా, టీవీ9ను అలందా మీడియా కంపెనీ టేక్ఓవర్ చేయకుండా నిలుపుదల చేయాలంటు రవిప్రకాశ్ కూడా పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఎన్సీఎల్టీ తమకు జారీ చేసిన నోటీసులపై అలందా మీడియా ఢిల్లీలోని ఎన్సీఎల్టీ అప్పిటేట్ అధారిటిలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన అప్పిలేట్ అధారిటీ తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి విచారణ జరపకుండా స్టేను విధించి విచారణను జులైకి వాయిదా వేసింది. ఈ మేరకు హైదరాబాద్లోని ఎన్సీఎల్టీ తాము జరుపుతున్న విచారణను నిలిపివేస్తూ జులై 9కి వాయిదా వేసింది.