Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గల్ఫ్ నుంచీ సమాచారాన్ని సేకరిస్తున్న అధికారులు
నవ తెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి
దేశంలోనే గాక విదేశాలలో అధిక వడ్డీ ఆశచూపించి డిపాజిటర్లకు వేల కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెట్టిన హీరాగోల్డ్ సంస్థ ముగ్గురు ప్రధాన నిందితులను ఈడీ అధికారులు క్షుణ్ణంగా విచారిస్తున్నారు. ఏడు రోజుల పాటు తమ కస్డడీకి కంపెనీ చైర్మెన్ నౌహీ రాషేక్, ఎండీ థామస్, మరో పీఏ మౌని థామస్లను సీనియర్ అధికారులతో కూడిన ఈడీ బృందం అన్ని కోణాల నుంచి విచారిస్తున్నట్టు తెలిసింది. బుధవారం జైలు నుంచి తమ అదుపులోకి తీసుకున్న సమయంలో స్పృహకోల్పోయిన షేక్ తాను అనారోగ్యంగా ఉన్నానని పలు మార్లు విచారణలో చెబుతూ అనేక ప్రశ్నలను దాట వేస్తున్నట్టు తెలిసింది. బిజ్జు థామస్, మౌనిథామస్లు సైతం తమ బాస్ అడుగు జాడలోనే అవసరమైన మేరకు స్పందిస్తున్నారని సమాచారం. అయితే గతంలో నగర సీసీఎస్ పోలీసులు జరిపిన విచారణాంశాలు, సేకరించిన ఆధారాలే గాక తాము కొత్తగా సేకరించిన అంశాలను క్రోడీకరిస్తూ ఈడీ దర్యాప్తు సాగుతున్నట్టు తెలిసింది. ప్రధానంగా తెలంగాణతో పాటు ముంబయి, గుజరాత్, ఏపీ, తమిళనాడు, కోల్కతా, కర్నాటక మొదలైన రాష్ట్రాలలో వీరు సాగించిన మోసాలు, సేకరించిన కోట్ల రూపాయల డిపాజిట్ల గురిచి మరోసారి ఆరా తీస్తున్నారని తెలిసింది. ఈ రాస్ట్రాలో కొత్తగా ఏదేని ఫిర్యాదులు వీరి గురించి వచ్చిన పక్షంలో వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారని సమాచారం. ముఖ్యంగా విదేశాల నుంచి మనీ లాండరింగ్ ద్వారా డబ్బులను ఏ విధంగా ఎవరి ద్వారా ఎక్కడ సేకరించారు. వాటిని ఎక్కడ డిపాజిట్ చేశారనే కోణంపైనా ఈడీ ప్రధానంగా దృష్టిని నిలిపినట్టు తెలుస్తోంది. దుబాయ్, జిద్దా, మస్కట్తో పాటు మరి కొన్ని గల్ఫ్ దేశాలలో వీరి నెట్వర్క్ పని తీరును ఆరా తీస్తున్నారు. ప్రధానంగా ఆన్లైన్లో డిపాజిటర్లను ఆకర్షించి బుట్టలో వేసుకోవడంలో ఆరి తేరిన థామస్ ద్వయం, తయారు చేసిఏన సాఫ్ట్వేర్ను కూడా ఈడీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఈ ఏడు రోజుల పాటు సాగే విచారణలో కొత్తగా తేలిన అంశాలను బట్టి దర్యాప్తును ముందుకు సాగించే వీలుందని ఈడీ వర్గాలు తెలిపాయి. ఇపపటికే మూడు వేల కోట్ల మేర స్కాంకు పాల్పడ్డ ఈ నేరగాళ్ల ఖాతాలో ఇంకా ఎన్ని కోట్లు వివరాలు బయటకు రావచ్చో వేచి చూడాలని గతంలో దర్యాప్తు జరిపిన నేరవిభాగ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో గల్ప్ దేశాలకు చెందిన పోలీసు విభాగాలతోను ఈడీ స్పందింపులు జరుపుతు తగిన సహాయానిన తీసుకోనున్నట్టు తెలిసింది.