Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుంటూరు జిల్లాలో సీపీఐ(ఎం) నిర్మాణంలో కీలక పాత్ర
- నేడు తిరుమలగిరి శ్మశాన వాటికలో అంత్యక్రియలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, విశ్రాంత ఉపాధ్యాయులు దావులూరు వెంకట్రావు(97) అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్లోని ఏఎస్ రావు నగర్ పరిధిలోని సాయినాథపురంలో గల జనాభ్యుదయ సంఘం వృద్ధుల ఆశ్రమంలో గురువారం సాయంత్రం చనిపోయారు. ఆయన 1922 జులై 21న గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రులో జన్మించారు. పాలేర్ల సమ్మెను బలపరుస్తూ పచ్చలతాడిమర్రు నుంచి యువకులను పెద్దఎత్తున జూపూడికి తీసుకెళ్లారు. అక్కడ జరిగిన పోలీసుల కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. 1939లో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. 1945 వరకు నాటకాలు వేశారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉన్న సమయంలో బళ్లారి, ఒంగోలు, బాపట్ల, పొన్నూరు, నర్సరావుపేట, గురజాల, గుంటూరు సబ్ జైళ్లలో రెండేండ్ల పాటు జైలు జీవితం, మరో రెండేండ్ల పాటు తెనాలిలో రహస్య జీవితాన్ని గడిపారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నట్టు జైలు రికార్డుల్లో ఉన్నప్పటికీ...ఆయన ప్రభుత్వ ఇచ్చిన ఏ ఒక్క సౌకర్యాన్ని కూడా స్వీకరించలేదు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో ఉండగా శ్రీరాములు, ఎం. నాగేశ్వరావులతో కలిసి పచ్చలతాడిపర్రులో ఒకేసారి పది మంది కార్యకర్తలకు ఆదర్శ వివాహాలు జరిపించారు. ఆ తర్వాత క్రమంలో ఆ గ్రామంలో వందకుపైగా ఆదర్శ వివాహాలు జరిగాయి. పచ్చలతాడిపర్రులోని వేద పాఠశాలలో ఆనాడే అన్ని కులాల వారికి వేద విద్య నేర్పించేలా కృషి చేశారు. పార్టీ విభజన సమయంలో ఆయన సీపీఐ(ఎం) వైపు వచ్చారు. కార్మిక, కర్షక గ్రంథాలయాలను స్థాపించారు. 1955 నుంచి 1977 వరకు టీచర్గా కొనసాగుతూనే సీపీఐ(ఎం) విస్తరణలో కృషి చేశారు. 2008 సంవత్సరంలో 'యాన్ ఎక్స్పర్మెంట్ విత్ మై పెన్' అనే ఆంగ్ల పుస్తకాన్ని రచించారు. ఆయన సహచరణి కమలమ్మ కూడా టీచర్గా పనిచేస్తూ భర్తకు అన్ని సందర్భాల్లోనూ అండగా నిలిచేది. వృద్ధాశ్రమంలో ఆయన వెంటనే ఉంటున్నది. ఆయనకు ఇద్దరు కుమారులుండగా..వారిద్దరూ చనిపోయారు. వెంకట్రావు అంత్యక్రియలు శుక్రవారం ఉదయం 11 గంటలకు తిరుమలగిరి స్వర్గపురి శ్మశాన వాటికలో జరుగనున్నాయి. ఉదయం 9:30 గంటలకు ఆశ్రమం నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.