Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో అఫిడవిట్ల సేకరణ
- పార్లమెంటు ఫలితాలపై అప్రమత్తం
- ఎంపీ అభ్యర్థులు, డీసీసీల సమావేశంలో చర్చ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రాదేశిక ఎన్నికలు ముగియడంతో ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి అన్ని విధాల సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సిట్టింగ్ స్థానం కాబట్టి దాన్ని మళ్లీ కైవసం చేసుకునేందుకు అన్ని విధాల ప్రయత్నం చేయాలని భావిస్తోంది. దీంతోపాటు పార్లమెంటు ఎన్నికల ఫలితాల విషయంలోనూ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం గాంధీభవన్లో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో సమావేశం జరిగింది. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఏఐసీసీ ఇచ్చిన నిబంధనల ప్రకారం...పార్లమెంట్ ఎన్నికల ఫలితాల సమయంలో పూర్తిగా జాగ్రత్తలు పాటించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. పోలింగ్, కౌంటింగ్, వీవీప్యాట్ల లెక్కింపుల విషయంలో పార్టీ ఏజెంట్లకు అవగాహన కల్పించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అభ్యర్థులకు సూచించింది. కాంగ్రెస్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నుంచి అఫిడవిట్టు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షులను పార్టీ ఆదేశించింది. గెలిచిన తర్వాత పార్టీ మారబోమని ప్రజలకు హామీ ఇచ్చేలా అఫిడవిట్లో పొందుపర్చాలని సూచించింది. దీంతో క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధుల వలసలు నివారించవచ్చనే భావిస్తున్నది. సమావేశానంతరం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్రెడ్డి, జెట్టి సుకుమకుమార్, సీనియర్ నేత షబ్బీర్ అలీ, ఓబీసీ సెల్ చైర్మెన్ కత్తి వెంకటస్వామి, ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి ఉత్తమ్కుమార్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. మే 21న రాజీవ్ గాంధీ వర్థంతిని ప్రతినియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున నిర్వహించాలని పిలుపు ఇచ్చారు. లోక్సభ ఎన్నికల కౌంటింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీసీసీలు, పార్లమెంట్ అభ్యర్థులకు తగు సూచనలు చేశామన్నారు. ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మెన్ ఎన్నికను జులై 5 తర్వాత చేయాలనే నిర్ణయం సరికాదన్నారు. ఫలితాలు వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం చేయించి వాళ్ళతోనే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో ఓట్లు వేయించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలని కోరారు. ఇది ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేయడమేనన్నారు.
ఈ నిర్ణయం వల్ల బేరసారాలకు అవకాశం కల్పించినట్టేనన్నారు. ఫలితాలు వెల్లడైన మరుసటిరోజే, ఎంపీపీ, జెడ్పీటీసీ చైర్మెన్ల ఎన్నికను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎన్నికల సంఘాన్ని కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు.
నర్సారెడ్డి దీక్ష విరమణ నిమ్మరసం ఇచ్చిన ఉత్తమ్
మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ సిద్ధిపేట డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మె ల్యే తూంకుంట నర్సారెడ్డి నాలుగు రోజులుగా నిరాహారదీక్ష చేపట్టారు. రెండు రోజుల క్రితం ఆయన దీక్షను పోలీసులు భగం చేసి, హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆయన దీక్ష కొనసాగించారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు జెట్టికుసుమకుమార్, కత్తివెంకటస్వామి, కొమరయ్య, తదితరులు ఆయనకు నిమ్మరసం ఇచ్చిన దీక్షను విరమింపచేశారు.
ఆ నివేదికను కోర్టుకు ఎందుకు సమర్పించలేదు? : వినోద్రెడ్డి
ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలపై కమిటీ ఇచ్చిన నివేదికను కోర్టుకు ఎందుకు సమర్పించలేదని టీపీసీసీ ప్రధానకార్యదర్శి వినోద్రెడ్డి ప్రశ్నించారు. జవాబు పత్రాలను ఆన్లైన్లో పెట్టాలని కోర్టు తీర్పు ఇవ్వడాన్ని ఆయన స్వాగతించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం, ఇంటర్ బోర్డు కార్యదర్శి అని తేల్చినా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. గురువారం గాంధీభవన్లో లీగల్ సెల్చైర్మెన్ దామోదరరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంటర్ ఫలితాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గ్లోబరీనా యాజమాన్యంపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.