Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీఏ మిత్రపక్షాలను చీల్చే పనిలో కేసీఆర్
- బెంగాల్లో హింసకు తృణమూల్, బీజేపీలే బాధ్యత:సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపైనా ఉందన్నారు. గురువారం హైదరాబాద్లోని మఖ్దూంభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకీ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్పష్టమైన మెజార్టీ రాకపోవచ్చని అన్నారు. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసినా బీజేపీ, కాంగ్రెస్ సహకారం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, లౌకిక వాదాన్ని కాపాడుకోవడం కోసం బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఐదేండ్ల కాలంలో బీజేపీతో అంటకాగిన కేసీఆర్ ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అని తిరిగితే ఎవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు. బీజేపీకి మద్దతిచ్చే పార్టీలను ఆయన కలవడం లేదన్నారు. యూపీఏ మిత్రపక్షాలను చీల్చే పనిలో కేసీఆర్ ఉన్నారని చెప్పారు. పశ్చిమబెంగాల్లో హింసాత్మక సంఘటనలను ఆయన ఖండించారు. ఈ హింసకు తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలే బాధ్యత వహించాలని అన్నారు. విద్యాసాగర్ విగ్రహం పగలగొట్టడం బెంగాల్ సంస్కృతిని అవమానించడమేనని చెప్పారు. హింసను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల కమిషన్ బెంగాల్లో ప్రచారాన్ని రద్దు చేయడం సరైంది కాదన్నారు. మోడీ, అమిత్షా ప్రచార కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత ఇతర పార్టీల నాయకుల రోడ్షోలు, సభలను రద్దు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. బీజేపీ కనుసన్నల్లో ఈసీ పనిచేస్తోందనడానికి ఇది నిదర్శనమని అన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ వివిధ కేసులకు సంబంధించి కేసీఆర్, చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్లు బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగపడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో నయీం, డ్రగ్స్ మాఫియా వంటి అంశాల్లో సిట్లు వేసినా ఎలాంటి చర్యల్లేవని అన్నారు. ఈవీఎంలపై అనేక అభ్యంతరాలున్నా ఈసీ, న్యాయ వ్యవస్థ పట్టించుకోవడం లేదన్నారు. మోడీ కనుసన్నల్లోనే ఈసీ పనిచేస్తోందని చెప్పారు. ఎన్నికల విధానంలో మార్పులు రావాలని, దామాషా పద్ధతిలో నిర్వహించాలని సూచించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చే వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు. ఇంటర్ బోర్డు విషయంలోనూ విద్యార్థులకు న్యాయం చేయాలని కోర్టు చెప్పిందన్నారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కి వేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్పాషా పాల్గొన్నారు.