Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ మీటర్ రీడర్ల ఆవేదన
- ఇప్పటికైనా నేరుగా జీతాలివ్వాలంటూ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం.. కాంట్రాక్టర్ల మధ్య తాము బలిపశువులమవుతున్నామని విద్యుత్ మీటర్ రీడింగులు తీసే ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత 18 యేండ్ల నుంచి తమకు పీఎఫ్, ఈఎస్ఐ తదితర సౌకర్యాలేవీ కల్పించకుండా గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారని వారు తెలిపారు. ఈ క్రమంలో గత్యంతరం లేక ఈనెల ఐదో తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లామని చెప్పారు. ఇప్పటికైనా తమకు పీస్ రేటు కాకుండా నేరుగా జీతాలివ్వాలని ఆపరేటర్లు డిమాండ్ చేశారు. లేదంటే సమ్మెను ఇదే విధంగా కొనసాగిస్తామని హెచ్చరించారు. గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్ ప్రకాశం హాల్లో విద్యుత్ మీటర్ రీడింగు ఆపరేటర్లు రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆపరేటర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దోమకొండ సునీల్ కుమార్ మాట్లాడుతూ... పీస్ రేటు వల్ల తమకు తీరని అన్యాయం జరుగుతు న్నదని అన్నారు. ఈ విధానంలో పనిచేసే వారితో తమకు సంబంధం లేదంటూ విద్యుత్ సంస్థలు, కాంట్రాక్టర్లు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కే.శేఖర్ మాట్లా డుతూ... తక్షణం కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తద్వారా విద్యుత్ సంస్థలే నేరుగా వేతనాలివ్వాలని కోరారు. తమ సమస్యలు, డిమాండ్లపై పలుమార్లు యాజమాన్యాలకు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సమ్మెలోకి వెళ్లామని తెలిపారు. సమావేశంలో ఆపరేటర్ల యూనియన్ ప్రధాన కార్యదర్శి గుమ్మడి వెంకటేశ్వర్లు, నేతలు చిరంజీవి, శ్రీనివాస్, వెంకటరమణ కుమార్, రవి, హుస్సేన్ తదితరులు ప్రసంగించారు.