Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మా పోరాటాలతోనే ఎజెండాగా 'ఉపాధి' :ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి విజయరాఘవన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తేనే వ్యవసాయ కార్మిక సంఘం బలోపేతమవుతుందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ విజయరాఘవన్ అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం పోరాటాలతోనే నేడు ఉపాధి హామీ చట్టం కింద పని కల్పన అన్ని పార్టీల ముందూ ఒక ఎజెండా అయిందని వివరించారు. వ్యవసాయ కార్మికులు తమ సమస్యలపై జరిగే పోరాటాల్లో కలిసి వస్తున్నారని, కానీ, వారిలో రాజకీయ చైతన్యం తక్కువై ఎన్నికల సమయంలో తమను మోసం చేస్తున్న బూర్జువా పార్టీలకే మళ్లీ ఓట్లు వేస్తున్నారని వివరించారు. వ్యవసాయ కార్మికుల్లో రాజకీయ చైతన్యం కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమి టీకి సూచించారు. హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా వచ్చిన విజయరాఘ వన్ ప్రారంభోపాన్యాసం చేశారు. పార్లమెంట్లో వామపక్షాల సంఖ్య తగ్గొచ్చుగానీ ప్రజల్లో నేటికీ బలముందని అన్నారు. విచ్చలవిడి డబ్బుల పంపిణీ మధ్య కూడా వామపక్షాల వైపు కొందరు నిలుస్తున్నారని, వామపక్షాల అభ్యర్థులకు ఓటు వేస్తున్నవారంతా పైసా ఆశించకుండా వేస్తున్నవారేనని, వారితో కలుపుకుని ప్రజా పోరాటాలు నిర్వహించాలని సూచించారు.కేరళలో లెఫ్ట్ అభ్యర్థిపై రాహుల్ గాంధీ పోటీ చేసిన స్థానంలో బీజేపీ తన ఓట్లన్నింటినీ రాహుల్కు క్రాస్ చేయించిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐఏడబ్ల్యూయూ ఉపాధ్యక్షులు బి.వెంకట్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బుర్రి ప్రసాద్, ఆర్.వెంకట్రాములు, రాష్ట్ర నాయకులు పద్మ, నారి అయిలయ్య, నర్సింహ, వేదగిరి శ్రీనివాసరావు, ములకలపల్లి రాములు, జగన్, తదితరులు పాల్గొన్నారు.