Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీహెచ్ఎంసీ కమిషనర్కు వామపక్షాల వినతి
- కోడ్ ముగిసిన తర్వాత చర్యలు : దానకిషోర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ పంజాగుట్టలోని అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చిన స్థలంలోనే తిరిగి ఏర్పాటు చేయాలనీ, విగ్రహాన్ని కూల్చిన వారిని కఠినంగా శిక్షించాలనీ వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. కూల్చినచోటే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలకు చెందిన ప్రతినిధి బృందం గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్కు వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2019 ఏప్రిల్ 14న ప్రపంచమంతా అంబేద్కర్ 128వ జయంతిని జరుపుకుంటున్న వేళ.. పంజాగుట్ట చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 13న అర్ధరాత్రి జీహెచ్ఎంసీ అధికారులు తొలగించి చెత్త డంపింగ్ యార్డుకు తరలించారన్నారు. ఇది అంబేద్కర్ను అవమానించడమేనని అన్నారు. ట్యాంక్బండ్పై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని 2006లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ హమీ ఇచ్చారనీ, ఇప్పటికీ ఏర్పాటు చేయలేదనీ గుర్తుచేశారు. పైగా పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని అనుమతి లేకుండా పెట్టడంతో కూల్చివేసామని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పడం సరికాదన్నారు. దీనికి స్పందించిన జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ ఎన్నికల కోడ్ తర్వాత ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వినతి పత్రం అందజేసిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.రాములు, డీజీ నరసింహారావు, బీఎల్ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాష్రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల మల్లేశ్, ఎంసీపీఐ(యు) రాష్ట్ర నాయకులు తాండ్రకుమార్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఝాన్సీ, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకీరాములు ఉన్నారు.