Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమీక్షా సమావేశంలో సీఎం వెల్లడి
- జూన్ 10 లోగా పంప్హౌస్లు పూర్తి
- వచ్చే ఏడాది నుంచి 6,100 మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనా
- ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని హామీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
ఈ ఏడాది జులై నుంచే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరందింస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. లక్ష్యం సాధించటం కోసం జూన్ 10 లోగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంప్హౌస్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా తదితర అంశాలపై ముఖ్యమంత్రి గురువారం ప్రగతి భవన్లో అధికారులతో సమీక్షించారు. ఈ ఏడాది నుంచి రోజుకు 2 టీఎంసీలు వచ్చే ఏడాది నుంచి 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయటానికి నిర్ణయించినట్టు తెలిపారు. గోదావరిలో నీటి ప్రవాహం ఉంటే ఆరు నెలల పాటు నిర్విరామంగా 24 గంటలు నీటిని ఎత్తిపోసి 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయటానికి 3,800 మెగావాట్లు, వచ్చే ఏడాది నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని తరలించటానికి 6,100 మెగావాట్లు విద్యుత్ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎత్తిపోతల పథకాలకు వినియోగించే విద్యుత్ కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తి కావచ్చాయని, పంప్ల ట్రయల్ రన్లు కూడా విజయవంతమయ్యాయని సీఎం తెలిపారు. మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉడటంతో గోదావరిలో తెలంగాణ
వాటాను పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. జూన్, నవంబర్ మాసాల్లో రోజుకు 2 టీఎంసీలు, జులై నుంచి అక్టోబర్ వరకూ 3 టీఎంసీలు తరలించవచ్చని, డిసెంబర్లో కూడా ఒక పంప్ నడిపి కొంత నీరు తీసుకోవచ్చని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఏ నెలలో ఎంత నీరు తీసుకోవాలో దీనికి ఎంత కరెంట్ అవసరమో శాస్త్రీయంగా అంచనా వేయాలని ఆయన ఆదేశించారు.
954 టీఎంసీల నీటి వాటా..
గోదావరిలో తెలంగాణకు 954 టీఎంసీల నీటి వాటా ఉన్నదని సీఎం పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని 85 శాతం భూభాగంలో వ్యవసాయానికి, తాగునీటికి, పరిశ్రమలకు ఈ నీటినే వినియోగించుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వీలైనంత ఎక్కువ మొత్తంలో నీటిని ఎత్తిపోయాలని అన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి, అక్కడి నుంచి మిడ్మానేరుకు ఈ ఏడాది రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోయాలని కేసీఆర్ అన్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా ఒక టీఎంసీని శ్రీరాంసాగర్కు, మరో టీఎంసీని మల్లన్నసాగర్కు తరలించాలన్నారు. వచ్చే ఏడాది నుంచి ఎల్లంపల్లి వరకూ 3 టీఎంసీలు, కొండపోచమ్మసాగర్ వరకూ 2 టీఎంసీలు ఎత్తిపోసి రిజర్వాయర్లను, చెరువులను నింపాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, నిర్వహణ భారంపై కొందరు వెలిబుచ్చే అభిప్రాయాలు పూర్తిగా అవగాహనారాహిత్యంతో కూడుకున్నవని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏడాదికి 90 లక్షల ఎకరాల్లో పంట పండుతుందని, ప్రాజెక్టు నిర్మాణానికి పెట్టే ఖర్చుకు సమానమైన ఆదాయం పంట రూపంలో రెండేండ్లలోనే అందుతుందని తెలిపారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టులకు మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని దీనికయ్యే ఖర్చు కూడా సబ్సిడీ రూపంలో విద్యుత్ సంస్థలకు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.
17 వేల మెగావాట్లకు సిద్ధం.. ట్రాన్స్కో సీఎండీ ప్రభాకరరావు
ఇతర రంగాలకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తూనే కాళేశ్వరంతో పాటూ ఇతర ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్ను నిరాటంకంగా సరఫరా చేస్తామని ట్రాన్స్కో సీఎండీ ప్రభాకరరావు సీఎంకు చెప్పారు. రాష్ట్ర విద్యుచ్ఛక్తి పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. 11 వేల మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ వచ్చినప్పటికీ ప్రస్తుతం నిరాటంకంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఎత్తిపోతల పథకాల కోసం మరో 6 వేల మెగావాట్ల విద్యుత్ అవసరమైనా సమకూరుస్తామని ప్రభాకరరావు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16,203 మెగావాట్ల స్థాపిత విద్యుత్ అందుబాటులో ఉందన్నారు. మరి కొన్ని రోజుల్లోనే 1ఒ600 మెగవాట్లు ఎన్టీపీసీ ద్వారా అంతుందన్నారు. 4,000 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన యాదాద్రి పనులు వేదంగా జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం 28,000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్ను సరఫరా చేయటానికి కావాల్సిన వ్యవస్థలను శరవేగంగా పూర్తి చేసినందుకు విద్యుత్ సంస్థలను సీఎం కేసీఆర్ అభినందించారు. గడువు కంటే ముందే పనులు పూర్తి చేశారని ఆయన కొనియాడారు. ఈ సమావేశంలో ప్రభుత్వం ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకరరావు, ఈఎన్సీ మురళీధరరావు, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 18, 19 తేదీల్లో సీఎం పర్యటన..
విద్యుచ్ఛక్తి సరఫరా, కాళేశ్వరం పనుల పరిశీలన కోసం ఈనెల 18, 19 తేదీల్లో సీఎం రామంగుండం, కాళేశ్వరం ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 18 న రామగుండంలో ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ను ఆయన సందర్శిస్తారు. అక్కడే ఎన్టీపీసీ, జెన్కో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. 19 న ఉదయం కాళేశ్వరం చేరుకుని ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలిస్తారు.