Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెరవేరని నిరుద్యోగుల స్వప్నం
- లక్ష ఉద్యోగాలు నింపుతామని సీఎం హామీ
- ఐదేండ్లలో ఇచ్చినవి 36,194
- భర్తీపై టీఆర్ఎస్ సర్కారు విముఖత
బొల్లె జగదీశ్వర్:
''రాష్ట్రంలో నిరుద్యోగుల స్వప్నం ఇంకా నెరవేరలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేండ్లు అవుతున్నా నిరుద్యోగుల ఆకాంక్షలు సాకారం కాలేదు. దీంతో వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. కొలువుల కల్పన దిశగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో 1.07 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని సాక్షాత్తూ సీఎం కేసీఆర్ 2016, మార్చి 13న అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఈ కొలువులను రెండేండ్లలోపు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ గడువు ముగిసినా సీఎం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. అంటే మాట తప్పిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచారనడంలో సందేహంలేదు. 'రాష్ట్రంలో వివిధ శాఖల్లో 1,28,274 ఖాళీ పోస్టులను ప్రభుత్వం గుర్తించింది. వాటిలో 1,02,217 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో 87,346 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇప్పటి వరకు 33 వేల కొలువులు భర్తీ అయ్యాయి'అని మంత్రి ఈటల రాజేందర్ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించారు. లక్ష కొలువులు భర్తీ చేయలేదని ప్రభుత్వమే అంగీకరించింది. నియామకాల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం విముఖతతో ఉన్నదని అర్థమవుతున్నది. అందుకే రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది''.
రాష్ట్రంలో 1,28,274 పోస్టులు ఖాళీగా ఉంటే ఈ ఐదేండ్లలో 36,194 కొలువులు భర్తీ చేసిందీ ప్రభుత్వం. అంటే 28.22 శాతం కొలువులను టీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేసింది. ఏదైనా సబ్జెక్టులో ఓ విద్యార్థి పాస్ కావాలంటే కనీసం 36 శాతం మార్కులు రావాలి. ఉద్యోగాల కల్పనలో టీఆర్ఎస్ ప్రభుత్వం 28.22 శాతం కొలువులనే భర్తీ చేసింది. అంటే ఉద్యోగాల భర్తీలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిలైందని నిరుద్యోగ యువత వ్యాఖ్యానిస్తున్నది.
ఉద్యోగులు, నిరుద్యోగుల్లో అసంతృప్తి
ఈనెల 23న పార్లమెంటు ఎన్నికల ఫలితాలు, ఈనెల 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఆ తర్వాత ఎన్నికల కోడ్ ముగియనుంది. వచ్చేనెల 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక ప్రకటన చేస్తారని విశ్వసనీయంగా తెలిసింది. రెండోసారి అధికారంలోకి రావడంతో నిరుద్యోగుల్లో ఆశలు పెరిగిపోయాయి. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో 10 జిల్లాలను 33 జిల్లాలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు, గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి. కొత్త పోలీస్ కమిషనరేట్లు, పోలీస్ స్టేషన్లు ఆవిర్భవించాయి. కానీ కొత్త ఉద్యోగులు మాత్రం రాలేదు. ఉన్న ఉద్యోగులనే ప్రభుత్వం సర్దుబాటు చేసింది. ఉన్న ఉద్యోగులూ ఉద్యోగ విరమణ అవుతున్నారు. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులపై పనిభారం పెరుగుతున్నది. ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రజల సమస్యలు, ఫిర్యాదులు పరిష్కరించడంలో ఆలస్యమవుతున్నది. ఇంకోవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేయడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పీఆర్సీ ఇవ్వకపోయినా పరవాలేదు కానీ ఖాళీ పోస్టులు త్వరగా పరిష్కరించాలని ఉద్యోగ సంఘం నాయకుడొకరు వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతున్నది. ఇటు పనిభారంతో ఉద్యోగులు, అటు నియమాకాలు చేపట్టడంలో అలసత్వం కారణంగా నిరుద్యోగుల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉన్నది.
ఉద్యోగాల భర్తీపై ప్రణాళిక లేదు : విజయ్ కుమార్, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి
ప్రభుత్వానికి ఉద్యోగాల భర్తీపై ప్రణాళిక లేదు. లక్ష కొలువులు భర్తీ చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి మాట తప్పింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదు. నిరుద్యోగులను ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. టీఆర్టీ, గ్రూప్-2 నియామకాలు చేపట్టలేదు. తక్షణమే ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించాలి. నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చాలి.
లక్ష పోస్టుల భర్తీ ఎన్నేండ్లు కావాలి : కెఎస్ ప్రదీప్, పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి
లక్ష పోస్టులు భర్తీ చేస్తామన్నారు. అదీ నెరవేరలేదు. ఇప్పటి వరకు 30 వేల వరకు ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. లక్ష పోస్టులు భర్తీ చేయాలంటే ఎన్నేండ్లు కావాలి. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇది అమలు కావడం లేదు. రాష్ట్రంలో నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు. గ్రూప్-2 అభ్యర్థులు చనిపోతామని మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించే పరిస్థితి దాపురించింది.
నిరుద్యోగులను మోసం చేసిన టీఆర్ఎస్ : అనిల్కుమార్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నీళ్లు, నిధులు వచ్చినా నియామకాలు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో రాలేదు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. గ్రూప్-2 నిర్వహణలో అవకతవకలు జరగడంతో కోర్టులో మూలుగుతున్నది.
ఉద్యోగ జాతర ఊసేలేదు
తెలంగాణలో కొలువుల కోసమే కొట్లాట జరిగింది. నిజాం హయాంలో ముల్కీ ఉద్యమం మొదలుకొని 1969లో జరిగిన ఉద్యమమూ కొలువులే ప్రధాన ఎజెండాగా సాగింది. ఆ తర్వాత జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు అన్న లక్ష్యం కోసం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో 1969లో 369 మంది, మలిదశ ఉద్యమంలో సుమారు 1,200 మంది విద్యార్థులు, యువకులు, ఇతరులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, యువకులే ముందుండి పోరాడారు. 2014, జూన్ 2న తెలంగాణ స్వప్నం సాకారం కావడమే కాకుండా ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉద్యోగ జాతర వస్తుందని అందరూ ఆశించారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆకాంక్షలను పట్టించుకోలేదు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేయకుండానే ఎన్నికలకు వెళ్లింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. అయినా ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించలేదు. దీంతో నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ పేరుతో దాటవేత ధోరణిని ప్రభుత్వం ప్రదర్శిస్తున్నది.
రాష్ట్రంలో భర్తీ చేసిన పోస్టుల వివరాలు
సంస్థ పోస్టులు
టీఎస్పీఎస్సీ 16,050
సింగరేణి 4,500
విద్యుత్ శాఖ 2,681
పోలీసు 12,152
క్రమబద్ధీకరణ 811
మొత్తం 36,194
రాష్ట్రంలో ఖాళీలు, ఉద్యోగాల భర్తీ వివరాలు
మొత్తం ఖాళీలు : 1,28,274
ప్రభుత్వం మంజూరు చేసినవి : 1,02,217
నోటిఫికేషన్లు జారీ అయిన పోస్టులు : 87,346
భర్తీ అయిన పోస్టులు : 36,194