Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చివరిదాకా ' సెక్యులర్ 'గా నిలిచేదెవరు..?
- ప్రధాని పదవి కోసం పేచీ పడ్తారా..?
- లౌక్యంగా ఐక్యత నిలుపుకుంటారా..?
- ఈ నెల 23న ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రత్యేక కథనం
న్యూఢిల్లీ:ఏడు విడతలుగా పోలింగ్ జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ మరో ఐదు రోజుల్లో(ఈ నెల 23న) మొదలు కానున్నది. ఈసారి ప్రతి అసెంబ్లీ స్థానం పరిధిలో 5 పోలింగ్ బూతుల వీవీప్యాట్ చీటీలను కూడా లెక్కిస్తున్నందున పూర్తి ఫలితాలు అధికారికంగా విడుదల కావడానికి రెండు,మూడు రోజుల సమయం పట్టనున్నది. అయితే, మొదటిరోజే ట్రెండ్ అర్థమయ్యే అవకాశాలున్నాయి. దీంతో, రాజధాని రాజకీయాలపై అందరి దృష్టీ పడింది. బీజేపీకి 200కన్నా తక్కువ సీట్లే వస్తాయన్న అంచనాలతో ప్రతిపక్షాలు తమ ప్రధాని అభ్యర్థి ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి.
ప్రతిపక్షాల్లో కాంగ్రెస్ది ఈసారి నిర్ణయాత్మక పాత్ర కానున్నట్టు అంచనా. ఆ పార్టీకి ఈసారి 120 సీట్లకుపైగానే వస్తాయని అనుకుంటున్నారు. అయితే, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీని ప్రధాని అభ్యర్థిగా బలంగా ముందుకు తేవాలంటే కనీసం 150 మార్క్ దాటాలి. అది కాంగ్రెస్కు సాధ్యమేనా అన్నది డౌటే..! దీంతో, అందరి చూపులూ ప్రాంతీయ పార్టీలపై పడ్డాయి. ప్రాంతీయ పార్టీల నుంచి అందరికీ ఆమోదయోగ్యమైన నేతను ఎంపిక చేయడం అంత సులభమేమీ కాదు. మరోవైపు బీజేపీకి ప్రత్యామ్నాయం గురించి గట్టిగా మాట్లాడుతున్న పార్టీలు అంతే నిబద్ధతను మున్ముందు ఏమేరకు నిలబెట్టుకుంటాయి..? అన్నది చూడాలి.
మరోవైపు కాంగ్రెస్కూ, బీజేపీకి సమాన దూరమని చెబుతున్న టీఆర్ఎస్,వైఎస్ఆర్సీపీ, బీజేడీలు హంగ్ ఏర్పడినపుడు ఏవిధమైన నిర్ణయం తీసుకుంటాయన్నదానిపై స్పష్టత లేదు. ఏపీలో టీడీపీ,వైసీపీలో ఏ పార్టీ అధికారం చేపట్టినా, ఈ రెండింటికి వచ్చే లోక్సభ సీట్ల సంఖ్యలో పెద్దగా తేడా ఉండదన్న అంచనాలున్నాయి. సీబీఐ కేసుల విషయంలో ప్రధాని మోడీ, బీజేపీ తనకు అండగా నిలిచారాన్న సానుకూల ధోరణితో వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఉన్నట్టు రాజకీయ పరిశీలకుల్లో ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. దాంతో, ఆయన కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలోకి వచ్చే అవకాశాలే లేవని వారంటున్నారు. ఓ సందర్భంలో కేసీఆర్తో కలిసి సమాఖ్య కూటమి గురించి ప్రస్తావించిన జగన్, అది ఆచరణలో సాధ్యం కాదని తేలిన తాజా పరిణామాల్లో ఎటు మొగ్గు చూపుతారన్నది తేలాలి. కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ విషయంలో కాస్త మెత్తబడినట్టుగా చెబుతున్నారు. స్థానికంగా తనకు కాంగ్రెస్ను ప్రధాన ప్రత్యర్థిగా భావించినా, జాతీయస్థాయిలో గుంపులో గోవిందగా బీజేపీ వ్యతిరేక కూటమిలో కలిసిపోయేందుకు ఆలోచిస్తున్నట్టుగా భావిస్తున్నారు. అదీగాక తనకు ఎంఐఎంను నమ్మకమైన మిత్రపక్షంగా భావిస్తున్న కేసీఆర్ సూత్రరీత్యా లౌకిక కూటమివైపే వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే బీజేపీతో లోపాయికారి సంబంధాలున్నాయన్న విమర్శలకు కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు సమాధానాలు చెప్పుకోలేక ఇరుకున పడుతున్నారు. దాంతో, టీఆర్ఎస్ ఓ స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్లాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక ఒడిషాలోని బీజేడీ, దాని అధినేత నవీన్ పట్నాయక్ కూడా అటో ఇటో తేల్చుకోవాల్సిన తప్పని పరిస్థితి. తనది లౌకిక పార్టీగా చెప్పుకునే నవీన్ పట్నాయక్ ఈసారి బీజేపీకి మద్దతు ఇస్తే ఆయన్నీ, ఆయన పార్టీనీ మైనారిటీలు నమ్మే పరిస్థితి ఉండదు. ఓ దశాబ్దం క్రితం ఒడిషాలోని కాంధమాల్ ప్రాంతంలో క్రిస్టియన్లపై సంఫ్ుపరివార్ దాడులకు నిరసనగా ఎన్డీఏ నుంచి బీజేడీ బయటకొచ్చింది. ఆ తర్వాత నేరుగా బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు బీజేడీ వెనకాడుతోంది. అంశాలవారీగా మోడీ సర్కార్కు మద్దతు ప్రకటిస్తూ వచ్చింది.
ప్రాంతీయ పార్టీల్లో బీజేపీ పట్ల ఇప్పటివరకూ స్పష్టమైన వ్యతిరేకత ప్రకటిస్తూ వచ్చినవాటిలో టీడీపీ, ఆర్జేడీ, ఎస్పీ,ఎన్సీపీ, ఆమ్ఆద్మీపార్టీ, టీఎంసీ, జేడీ(ఎస్), డీఎంకే ఉన్నాయి. ఇంకా కొన్ని చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్,సీపీఐ,సీపీఐ(ఎం), బీఎస్పీలు బీజేపీని గట్టిగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీని వ్యతిరేకించే ఈ పార్టీల నుంచి ప్రధాని అభ్యర్థిగా ఎవరిని ఎంచుకోవాలన్నదే ఇప్పుడు వీరందరి ముందూ ఉన్న ప్రశ్న. బీజేపీని అధికారం నుంచి తొలగించడమే తమ ప్రధాన లక్ష్యమని చెబుతున్న కాంగ్రెస్, ప్రధాని పదవి తమకే ఇవ్వాలని పట్టు పట్టబోమని చెబుతోంది. అన్ని పార్టీలు కలిసి తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆ పార్టీ సీనియర్ నేత గులాంనబీఆజాద్ స్పష్టం చేశారు. ప్రధాని పదవి విషయంలో మనలో మనం పేచీ పెట్టుకోవడం మంచిది కాదన్న అభిప్రాయం ఆయన మాటల్లో వ్యక్తమైంది.