Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ బీసీ కమిషన్కు నేతల విజ్ఞప్తి
- ఉపాధ్యాయ నియామకాలపై 27న కమిషన్ సమావేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని బీసీ సంఘాల నేతలు జాతీయ బీసీ కమిషన్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జకృష్ణ నేతృత్వంలో బీసీ సంఘాల నేతలు జాతీయ కమిషన్ కార్యదర్శి అజరుకుమార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం గుజ్జకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోఒక బీసీ రెసిడెన్షియల్ పాఠశాల, వసతి గృహం మంజూరు చేసేలా బీసీ కమిషన్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధంగా సంక్రమించే అధికారాలను పూర్తిస్థాయిలో వినియోగించి అన్ని రాష్ట్రాల్లో బీసీల విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్లు బీసీ రిజర్వేషన్ల అమలులో అక్రమాలకు పాల్పడుతున్నారని, మెరిట్లో వచ్చిన వారిని రిజర్వేషన్లలో చూపిస్తున్నారని, దీనిని అరికట్టడానికి బీసీ కమిషన్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల జరిపిన ఉపాధ్యాయ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరిగిందని, దీనిపై విచారణ జరిపించాలన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలులో సంక్షేమ పథకాల పర్యవేక్షణలో ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల అమలుపై జాతీయ కమిషన్ చొరవ చూపాలని కోరారు. ప్రధానంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్ట్మెంట్, బ్యాంకింగ్ రంగాల్లో రిజర్వేషన్లు సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
27న కమిషన్ సమావేశం
ఉపాధ్యాయ నియామకాల్లో అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై ఈ నెల 27న జాతీయ బీసీ కమిషన్ సమావేశం కానుందని బీసీ కమిషన్ కార్యదర్శి అజరుకుమార్ తెలిపారు.