Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమంగా చొరబడి శాశ్వత నివాసం ఏర్పాటు
నవతెలంగాణ-పటాన్ చెర్వు
కలకత్తా సరిహద్దుల గుండా దేశంలోకి అక్రమంగా బంగ్లాదేశీయులు చొరబడ్డారు. అస్సాం మహిళలను పెండ్లాడి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఫేక్ అడ్రస్లతో ఆధార్, పాన్కార్డు, ఓటర్కార్డులు పొందారు. ఆల్కబీర్ పరిశ్రమలో కార్మికులుగా చేరారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. పటాన్చెరు సీఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం..బంగ్లాదేశ్కు చెందిన సలీం, ఇస్లాం అనే ఇద్దరు మెటీరియల్ కాంట్రాక్టర్లు. వీరు కొంతమందిని బంగ్లాదేశ్ నుంచి కలకత్తా మీదుగా అనుమతి లేకుండా తీసుకొచ్చారు. వారిలో ఎండీి.బాబు (22), ఎండీ. రిపోన్(25), గులాం హుస్సేన్(40), సైఫుల్ ఇస్లాం(24), ఎండీ సైదులు ఖురేశ్(29) ఉన్నారు. 2012లో మండలంలోని రుద్రారం గ్రామ శివారులోని ఆల్ కబీర్ ఎక్స్పోర్టు లిమిటెడ్ కంపెనీలో కాంట్రాక్టు కార్మికులుగా చేర్పించారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో అద్దె ఇల్లు తీసుకున్నారు. ఐదుగురిలో ఏ1గా ఉన్న ఎండి.బాబు అస్సాంకు చెందిన ఇద్దరు పిల్లల తల్లి (విడో) మునిని పెండ్లి చేసుకున్నాడు. ఏ2గా ఉన్న ఎండి. రిపోన్ కూడా అస్సాంకు చెందిన మహిళను పెండ్లి చేసుకోగా, ఎండీ సైదులు ఖురేశ్ సోలాపూర్కు చెందిన తులసిని వివాహ మాడారు. గులాం హుస్సేన్, సైఫుల్ ఇస్లాం బ్యాచిలర్స్గా ఉన్నారు. ఎండీ. బాబు, ఎండీ. రిపోన్, ఎండీ సైదులు ఖురేశ్ పరిశ్రమ పక్కనే ఉన్న ఇప్పకుంటతండాలో నివాసం ఉంటున్నారు. బ్యాచిలర్ అయిన మిగతా ఇద్దరు పరిశ్రమ క్వార్టర్స్లో నివాసం ఉంటున్నారు. ఏ1గా ఉన్న ఎండి. బాబు వీళ్లతో పాటు బంగ్లాదేశ్ నుంచి మరికొందరిని రప్పించి పరిశ్రమలో పని చేయించినట్టుగా తెలిసింది. బంగ్లాదేశ్ పౌరులైన వీరంతా పాస్పోర్టు లేకుండా అక్రమంగా వలసొచ్చి ఇక్కడి మహిళలనే పెండ్లి చేసుకుని ఫేక్ అడ్రస్లతో దర్జాగా భారత ధ్రువపత్రాలను పొందారు. సమాచారమందుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అడ్రస్, ఆధార్, పాన్ కార్డు, ఓటర్ కార్డు, ఇతర ధ్రువపత్రాలను ఎలా పొందారనే దానిపై ఆరా తీస్తున్నారు.