Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఎన్నికల సంఘానికి మహాకూటమి నేతల వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
జెడ్పీచైర్మెన్ల ఎంపికకు ఎక్కువ సమయం ఇవ్వకుండా ఫలితాలొచ్చిన మూడు రోజుల్లోనే చేపట్టాలని మహాకూటమి నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఫలితాలకు, జెడ్పీచైర్మెన్ల ఎంపికకు మధ్య 40 రోజుల సమయం ఇవ్వడం వల్ల ప్రలోభాలకు అవకాశం కల్పించినట్టు అవుతుందని పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర కార్యాలయంలో కమిషనర్ నాగిరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. టీపీసీసీ అధ్యక్షులు ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి, టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్, ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ నేత షబ్బీర్ అలీ, జనసేన నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్మెన్లు, మండల పరిషత్ అధ్యక్షుల ఎంపిక విషయంలో ఎక్కువ సమయం ఇవ్వకూడదని కోరారు. ఫలితాలకు, జెడ్పీ చైర్మెన్ల ఎంపికకు మధ్య 40 రోజుల సమయం ఇవ్వడం వల్ల జెడ్పీటీసీ, ఎంపీటీసీలను అధికార టీఆర్ఎస్ ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితాలు వచ్చిన మూడు రోజుల్లోనే చైర్మెన్ల ఎంపిక జరిగేలా చూడాలన్నారు. అధికార దుర్వినియోగం, బ్లాక్మనీ ఉపయోగించి ఇతర పార్టీలను టీఆర్ఎస్లో చేర్చుకున్నారని ఆరోపించారు. మే 27న ఫలితాలిచ్చి మూడు రోజుల్లో చైర్మెన్ల ఎంపిక చేసి జులై 5న బాధ్యతలు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ మాట్లాడుతూ చట్టాల పట్ల కేసీఆర్కు గౌరవం లేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, చైర్మెన్ల ఎంపిక పారదర్శకంగా ఎన్నికయ్యేలా చూడాలన్నారు. జెడ్పీచైర్మెన్ల ఎన్నికకు ఎక్కువ సమయం ఇవ్వడం వల్ల 538 ఎంపీపీలు, 28 జెడ్పీ చైర్మెన్లను అధికార టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.