Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మసకబారుతున్న ప్రతిష్ట
- అభ్యర్థుల జీవితాలతో చెలగాటం
- కోర్టులే నిర్ణయిస్తున్న భవితవ్యం
- 8 నెలల నుంచి నోటిఫికేషన్ల బంద్
- కొలిక్కిరాని గ్రూప్-2
- పూర్తికాని ఉపాధ్యాయ నియామకాలు
- గ్రూప్-1లోనూ అభాసుపాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రతిష్ట మసకబారుతున్నది. పారదర్శకతకు మారుపేరుగా నిలవాల్సిన ఆ సంస్థ ఈ ఐదేండ్లలో పలు వివాదాలకు నిలయంగా మారింది. గ్రూప్-2 నియామకాలు చేపట్టలేదు. గురుకులాల పోస్టుల భర్తీపై అభ్యర్థులు కోర్టుకు ఆశ్రయించారు. టీఆర్టీ కేసు కూడా కోర్టు పరిధిలో ఉన్నది. నోటిఫికేషన్ ఏదైనా కోర్టును ఆశ్రయించడం పరిపాటిగా మారింది. అభ్యర్థుల భవితవ్యాన్ని కోర్టులే నిర్ణయించే పరిస్థితి నెలకొంది. వివిధ నోటిఫికేషన్లపై 631 కేసులుండడంతో టీఎస్పీఎస్సీ పనితీరుపై మేధావులు పెదవి విరుస్తున్నారు. స్టే లేదా రద్దు చేసిన దాఖలాలు లేకపోవడం ఉపశమనం కలిగించినా అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడిం దన్న అపవాదును టీఎస్పీఎస్సీ మూటగట్టుకుంది. దీంతో విజయాలకంటే వైఫల్యాలే ఎక్కువ ఉండటం గమనార్హం.
గ్రూప్-1 పోస్టుల భర్తీ విషయంలోనూ గందరగోళం నెలకొంది. నోటిఫికేషన్ మొదలుకొని దరఖాస్తుల స్వీకరణ, రాతపరీక్ష, ఫలితాల విడుదల, అభ్యర్థుల ఎంపిక వరకు బాధ్యత తీసుకోవాల్సిన టీఎస్పీఎస్సీ గ్రూప్-1 విషయంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) సాంకేతిక తప్పుల వల్లే పొరపాటు జరిగిందని ప్రకటించడం విమర్శలకు దారితీసింది. ఆ సమయంలో టీఎస్పీఎస్సీ అభాసుపాలైంది. అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లకు, ఎంపిక చేసిన పోస్టులకు సంబంధం లేకపోవడంతో ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత సరిదిద్దినా తొలిసారి ప్రకటించిన జాబితాలో ఎంపికైన కొందరు అభ్యర్థులు రెండోసారి ప్రకటించిన వాటిలో ఉద్యోగాలు కోల్పోయారు. గురుకులాల్లో ప్రకటించిన పోస్టుల భర్తీ విషయంలో సరైన చర్యలు తీసుకోలేదన్న విమర్శలను ఎదుర్కొంది.
8 నెలల నుంచి నోటిఫికేషన్ లేదు
తెలంగాణ 2014, జూన్ 2 ఏర్పడితే, టీఎస్పీఎస్సీ 2014, ఆగస్టు 8న ఆవిర్భవించింది. 2014,డిసెంబర్ 17న దానికి ఛైర్మన్, సభ్యులను ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత పరీక్షా విధానం, సిలబస్ రూపకల్పనపై హరగోపాల్ నేతృత్వంలో నిపుణుల కమిటీ టీఎస్పీఎస్సీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదికను 2015, ఫిబ్రవరి 5న రాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్పీఎస్సీ సమర్పించింది. 2015, ఏప్రిల్ 11న టీఎస్పీఎస్సీ వెబ్సైట్, లోగోను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆవిష్కరించారు. వన్టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)ను ప్రవేశపెట్టి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది ఈ సంస్థ. ఆన్లైన్ పరీక్షల నిర్వహణలోనూ ప్రశంసలు వచ్చాయి. 2015, ఆగస్టు 20న 770 అసిస్టెట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి తొలి నోటిఫికేషన్ విడుదలైంది. టీఎస్పీఎస్సీకి 38,059 పోస్టుల భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు 36,182 పోస్టుల భర్తీకి 101 నోటిఫికేషన్లు జారీ చేసింది. వివిధ శాఖల నుంచి సమగ్ర సమాచారం రానందున 1,877 పోస్టులకు నోటిఫికేషన్లు రావాల్సి ఉంది. నోటిఫికేషన్లు జారీ చేసిన 36,182 పోస్టుల్లో 15,922 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను టీఎస్పీఎస్సీ పూర్తి చేసింది. గ్రూప్-1 పోస్టులతో కలిపితే ఈ సంఖ్య 16,050 ఉద్యోగాలను భర్తీ చేసింది. చివరి నోటిఫికేషన్ ములుగు అటవీ కాలేజీలో 24 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి 2018, సెప్టెంబర్ 10న విడుదలైంది. అంటే ఎనిమిది నెలల నుంచి టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్ జారీ కాలేదు.
నియామక సంస్థలోనే ఉద్యోగుల్లేరు
టీఎస్పీఎస్సీ సమర్థవంతంగా పనిచేయాలంటే 400 మంది ఉద్యోగులు కావాలి. కానీ కేవలం 165 పోస్టులు మంజూరయ్యాయి. కానీ ప్రస్తుతం 91 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో ఉద్యోగ నియామకాలు చేపట్టే సంస్థలోనే సరిపోను ఉద్యోగుల్లేని పరిస్థితి. 95 పోస్టులు మంజూరు చేయాలని కోరినా ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు.
ప్రభుత్వం ఉదాసీనత : మానవతారారు, నిరుద్యోగ జేఏసీ చైర్మెన్
ఉద్యోగ నియామకాల ప్రక్రియలో టీఎస్పీఎస్సీ విఫలమైంది. ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. గ్రూప్-2 రాతపరీక్షను సక్రమంగా నిర్వహించలేకపోయింది. గ్రూప్-1లో మార్కులను తారుమారు చేసింది. రాతపరీక్షలను సక్రమంగా నిర్వహించలేని టీఎస్పీఎస్సీ అవసరమా?. రాజకీయాలతో సంబంధం ఉన్న వారిని టీఎస్పీఎస్సీ చైర్మెన్, సభ్యులుగా నియమించడం సరైంది కాదు. ప్రభుత్వం వెంటనే ప్రక్షాళన చేయాలి.
టీఎస్పీఎస్సీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన పోస్టులు, భర్తీ వివరాలు
ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఉద్యోగాలు 38,059
నోటిఫికేషన్ల ద్వారా ప్రకటించిన పోస్టులు 36,310
ఇప్పటి వరకు భర్తీ చేసిన ఉద్యోగాలు 16,050
ఫలితాలు ప్రకటించిన ఉద్యోగాలు 14,488
వివిధ దశల్లో ఉన్న ఉద్యోగాలు 5,772
వన్టైం రిజిస్ట్రేషన్ దరఖాస్తు 24,54,715
ఇప్పటి వరకు వివిధ పోస్టులకు దరఖాస్తులు 48.34 లక్షలు
రాతపరీక్షలకు హాజరైన అభ్యర్థులు 33.78 లక్షలు
టీఎస్పీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్లు, పోస్టుల వివరాలు
సంవత్సరం నోటిఫికేషన్లు పోస్టుల సంఖ్య
2015 13 3,425
2016 12 2,379
2017 51 26,444
2018 25 3,934
మొత్తం 101 36 182
గ్రూప్- 1కలిపి 128
మొత్తం 36,310