Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 శాతం పెంచాలంటూ ప్రతిపాదన
- నివేదిక సిద్ధం చేసిన ఆర్టీసీ యాజమాన్యం
- ఎన్నికల కోడ్ ముగిసాక సీఎం వద్దకు ఫైలు
- ''ఓకే'' అంటే ప్రయాణీకులపై రూ.550 కోట్ల భారం ?
- 2016లో 10 శాతం పెంచిన సర్కారు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఏరు దాటేదాక ఓడ మల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నట్టుగా ఉంది ఇటు ప్రభుత్వం, అటు ఆర్టీసీ ఉన్నతాధికారుల పరిస్థితి. ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. ఈనెలాఖరుకు ఎన్నికల కోడ్ సైతం పూర్తవుతుంది. ప్రజలతో ప్రభుత్వానికి పని ఉండదు. ఇప్పటికే సంక్షేమ పథకాల అమలు ఎనిమిది నెలల నుంచి సరిగా అమలుకావడం లేదు. దీంతో ఆయా పథకాల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఒకవైపు పడుతుండగా, మరోవైపు ప్రభుత్వం ఆర్టీసీ రూపంలో ప్రయాణీకులపై చార్జీల వడ్డనకు ఏర్పాట్లు చేస్తున్నది. ఎన్నికల కోడ్ ముగిసిందే ఆలస్యం రాష్ట్ర ప్రజలపై చార్జీల భారాన్ని మోపాలని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తున్నది. ఆర్టీసీ నష్టాల్లో ఉందంటూ, దానిని కాపాడుకునే పేర ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఆ సంస్థ అధికారులే ముందుకు తెచ్చేలా పావులు కదిపింది. నష్టాలు సాకు చూపి ప్రయాణీకులపై మోపే ఆర్థిక భారం విషయంలో తన ప్రమేయమేమి లేదన్నట్టుగా ఉండాలనే యోచనతో ఉంది.
''ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోతున్నది. రోజుకు రూ.9.50 కోట్ల ఆదాయం వస్తుంటే..ఖర్చు మాత్రం ఏకంగా రూ.11.50 కోట్లవుతున్నది అంటే రోజుకు రూ.2 కోట్ల భారం సంస్థపై పడుతున్నది. ఇప్పటికే రూ.3,250 కోట్ల నష్టాల్లో సంస్థ ఉండగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.750 కోట్ల నష్టం వచ్చింది. ఇలాగే వదిలేస్తే బస్సు చక్రాలు ఆగిపోయే పరిస్థితి రావొచ్చు. ఇప్పుడున్న పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే కనీసం ప్రస్తుత చార్జీల కన్నా అదనంగా 30 శాతం పెంచాలి. ఒకవేళ అదీ సాధ్యం కాకపోతే కనీసం 15 శాతమైనా చార్జీలను అధికం చేయాలి'' అంటూ చార్జీల పెంపుకు సంబంధించి ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనల రూపేణే ప్రత్యేక నివేదికను రూపొందించినట్టు తెలిసింది. ఎన్నికల కోడ్ ముగియగానే సర్కారు ముందుకు ఆ ఫైలు వెళ్లనున్నట్టు సమాచారం. దీనికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపితే ప్రయాణికులపై దాదాపు రూ.550 కోట్ల భారం పడనుంది. మూడేండ్ల క్రితం ఆర్టీసీ చార్జీలు పెంచిన విషయం తెలిసిందే.
పెంపు తప్పదు
నష్టాల నుంచి ఆర్టీసీ బయటపడాలంటే పెంపు తప్పదని యాజమాన్యం భావిస్తున్నది. ఇప్పటికే రూ.3,250 కోట్ల నష్టాల్లో ఉన్న సంస్థ, ఇకనుంచి ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు.. ఉద్యోగులకు వేతనాల పెంపులో భాగంగా ఐఆర్ చెల్లించాల్సి వస్తున్న కారణంగా, కనీసం సంస్థ అంతర్గత పనులను కూడా చేసుకోలేని దుస్థితిలో ఉందని యాజమాన్యం చెబుతున్నది. కొన్ని పనులకు నిధుల్లేక సిబ్బంది నుంచి చందాలు వసూలు చేసుకోవాల్సిన దుస్థితిలో ఉన్నామని, ఇలా అయితే బస్సులను నడపటం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే టికెట్ చార్జీల
పెంపు అనివార్యమంటూ ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్శర్మ ముందు ప్రతిపాదనలు ఉంచారు.
ముందుగా 30 శాతమే..
సంస్థ నష్టాల నుంచి బయటపడాలంటే 30 శాతానికి తగ్గకుండా చార్జీలు పెంచాలని అధికారులు అంటున్నారు. 2016 నుంచి ఇప్పటి వరకు డీజిల్ భారం 37 శాతం పెరిగినందున, బస్సుఛార్జీలను కూడా 30 శాతం పెంచితేనే సంస్థ గట్టెక్కుతుందని అభిప్రాయపడుతున్నారు. ఆర్టీసీ సంస్థ ఏడాదికి రూ.700 కోట్లకు పైగా నష్టాల్లో కూరుకుపోతున్నదని, దీనికి తోడు ఉద్యోగుల వేతనాలు సవరించాల్సి ఉండటం, వేతన సవరణ బకాయిలు చెల్లించాల్సిన నేపథ్యంలో 30 శాతానికి పెంచాలని కోరుతున్నారు. ఒకేసారి ఇంత పెద్దమొత్తంలో పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఎండీ సలహా ఇవ్వడంతో కనీసం 15 శాతమైనా పెంచాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. దీనికి సునీల్ శర్మ ఆమోదం తెలిపి కోడ్ ముగియగానే సీఎం ముందు ఫైలు పెడదామని చెప్పినట్టు సమాచారం. 15 శాతం చార్జీలు పెంచినా ప్రయాణికులపై ఏటా రూ.550 కోట్ల భారం పడుతుంది.
ఇప్పటికీ వెయ్యి గ్రామాలకు బస్సుల్లేవ్
కొత్త బస్సులు కొనుగోలుచేసేందుకు నిధుల్లేక ఇప్పటికీ 1000 గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించలేదని ఆర్టీసీ తన నివేదికలో పొందుపర్చింది. బస్సుల కొరతతో కాలం చెల్లిన 2,200 బస్సులను నడపుతున్నామని అందులో పేర్కొంది. 2016లో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం 10 శాతం ధరలు పెంచడంతో, ప్రయాణికులపైనా రూ.286 కోట్ల భారం పడిన సంగతి తెలిసిందే.
రిటైర్డ్ అధికారితోనే నష్టాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడేండ్ల పాటు రిటైర్డ్ అధికారి ఎండీగా ఉండటం, ఆ తర్వాత ఇన్చార్జీలతో నెట్టుకురావడంతోనే నష్టాలు పెరిగాయని అధికారులు అంటున్నారు.