Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాద కారకులైన డ్రైవర్లను తొలగిస్తాం :రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రమాద రహిత డ్రైవర్లకు ప్రోత్సాహాకాలు అందజేస్తామని, అదే సమయంలో ప్రమాదాలకు కారకులయ్యే డ్రైవర్లను రిమూవల్ చేస్తామని రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బస్సు నడుపుతున్న సమయంలో సెల్ఫోన్ మాట్లాడటం, పాన్, గుట్కాలు వాడటం వంటి విషయాలను చాలా సీరియస్గా తీసుకోవాలని సూచించారు. ప్రమాదాలకు కారకులైన అద్దె బస్సు డ్రైవర్లతో పాటు బస్సు ఓనర్లను కూడా బాధ్యుల్ని చేస్తూ చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఇటీవల జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదాలపై రవాణా, శాసన సభా వ్యవహారాలు, హౌజింగ్ శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం సాయంత్రం సచివాలయంలో సంస్థ ఉన్నతాధికారులతో సమీక్షించారు. టీఎస్ ఆర్టీసీ వీసీ అండ్ ఎమ్డి, ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఈడీ (రెవెన్యూ, ఐటి) పురుషోత్తం నాయక్, ఈడీ(ఎ) టి.వి.రావు, ఈడీ (ఒ) అజోరు కుమార్, ఈడీ (గ్రేటర్ హైదరాబాద్ జోన్) వినోద్, సీటీఏం రాజేంద్రప్రసాద్, సీఎంఈ వెంకటేశ్వర్లు, ఓఎస్డీ కష్ణకాంత్ సమీక్షలో పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు.
అద్దె బస్సుల డ్రైవర్లు సరియైన డ్రైవింగ్ పద్దతుల్ని పాటించకపోవడం ద్వారానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తన దష్టికి వచ్చిందని, ఇలాంటి ప్రమాదాల ఘటనలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అద్దె బస్సు ఓనర్లు తక్కువ వేతనాలు ఇస్తూ డ్రైవర్లను నియమించడం కాకుండా వారికి మెరుగైన వేతనాలు ఇచ్చే విధంగా అగ్రిమెంట్లో నిబంధనల్ని పెట్టాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించకూడదని సూచించారు. ఈ క్రమంలో అద్దె బస్సు డ్రైవర్లకు సంస్థ తీసుకుబోయే డ్రైవర్ల నియామకంలో కొన్ని మార్కులు వెయిటేజీని ఇస్తే వారు బాధ్యతగా వ్యవహరించడమే కాక జాగ్రత్తల్ని పాటించగల్గుతారని సంస్థ అధికారులు మంత్రి దష్టికి తీసుకు వచ్చారు. రోడ్డు భద్రత విషయంపై తప్పిదాలు జరగకుండా చూసేందుకు తగిన చర్యలు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ దిశగా కూడా అధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చెప్పారు. అదేవిధంగా బస్సు జీవిత కాల పరిమితులను అడిగి తెలుసుకున్నారు. 13.50లక్షల కిలోమీటర్లు లేదా 15 ఏండ్లు పూర్తి అయిన బస్సులను స్క్రాప్గా పరిగణిస్తున్నట్టు అధికారులు మంత్రికి వివరించారు. సాధ్యమైనంత వరకు కండీషన్ బస్సులను నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.