Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-విలేకరుల యంత్రాంగం
వడదెబ్బతో శనివారం ఆరుగురు మృతిచెందారు. అందులో ఒకరు ఉపాధి కూలీ ఉన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో రాగుల రాజేందర్ (26) ఉపాధిహామీ పనులకు వెళ్లాడు. ఎండదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు గురై ఇంటికి వచ్చి మృతిచెందాడు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లి గ్రామానికి చెందిన మస్కం కొమురయ్య(35) వ్యవసాయ పని నిమిత్తం పొలానికి వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. కుటుంబీకులు ధర్మారంలోని ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇంటికి తీసుకొచ్చారు. కొమురయ్య పరిస్థితి విషమించడంతో అంబులెన్స్లో కరీంనగర్ తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపోయాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మార్కెట్పల్లెకు చెందిన రేగుల నర్సయ్య తంగళ్లపల్లిలో నివాసముండే కూతురును చూడటానికి వెళ్లాడు. తిరిగి మానేరు నది గుండా సిరిసిల్లకు వస్తుండగా ఎండతీవ్రతకు వడదెబ్బకు గురై నర్సయ్య (70) మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని కొత్తూరులో తొడిషం పోశక్క (40) శుక్రవారం ఉదయం తునికాకు సేకరణకు అడవికి వెళ్లింది. రాత్రి అయినా ఇంటికి రాలేదు. మరుసటి ఉదయం అడవిలోకి వెళ్లిన మరికొంతమంది కూలీలు పోశక్క మృతదేహాన్ని గమనించారు. తాగునీరు లేక, ఎండదెబ్బ తగిలి చనిపోయిందని గ్రామస్తులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ కారోబార్ పారుపల్లి నరసింహ(50) వడదెబ్బకు గురై మృతిచెందారు. ఖమ్మంజిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన నల్లబెల్లి సుశీల(40) కూలీ పనులు చేసుకుంటుంది. ఎండ తీవ్రతకు తాళలేక తీవ్ర అస్వస్థతకు గురైంది. పరిస్థితి విషమించడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందింది.