Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేలుళ్లతో వణుకుతున్న మల్లన్నసాగర్
- ముంపు గ్రామాలు
- పచ్చని పల్లెల్లో అలుముకుంటున్న దుమ్ము ధూళి
- జేసీబీల చప్పుడుతో కునుకు లేని రాత్రులు
- రోడ్లకిరువైపులా గుంటలు
- ట్రక్కుల రాకపోకలతో బిక్కు బిక్కుమంటున్న ప్రజలు
కొండూరి రమేశ్బాబు
ప్రకృతి వడిలో పచ్చని చెట్లు పంట పొలాల మధ్య నిన్న మొన్నటి వరకూ ప్రశాంత జీవితం గడిపిన ఆ గ్రామాల ప్రజలు ఇప్పుడు పేలుళ్ల ధాటికి బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. పల్లెల చుట్టూ అలుముకుంటున్న పొగ, దుమ్ము ధూళితో అనారోగ్యం పాలవుతున్నారు. జేసీబీల చప్పుళ్ల మధ్య నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పునరావాసం కోసం నిర్మించే ఇండ్లు పూర్తి కాకపోవటం, ఇండ్ల స్ఠలాలు చూపించకపోవటంతో ఉన్న గ్రామాలు విడిచి వెళ్లలేక భయంతో కాలం గడుపుతున్నారు. భూసేకరణ పూర్తి కావటం, పునరావాస చెక్కులు పలువురికి పంచటంతో ముంపు బాధితులు వారంతట వారే వెళ్లిపోతారని అధికారులు భావిస్తున్నారు. పనుల పేరుతో పర్యావరణ విధ్వంసం సృష్టించటం ద్వారా ప్రభుత్వమే పొమ్మన కుండా పొగపెడుతున్నదని బాధితులు వాపోతున్నారు. ఇది మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో నెలకొన్న వింత పరిస్థితి..
మల్లన్నసాగర్ పునరావాస చెల్లింపులు, పనుల నత్తనడకపై ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయటంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా జూలు విదిల్చింది. ఒకవైపు పునరావాస చెక్కుల పంపిణీ జరుగుతుంటే మరో పక్క రిజర్వాయర్ కట్ట పనులను వేగవంతం చేసింది. పెద్ద సంఖ్యలో జేసీబీలు, ట్రక్కులను పంపించిన కాంట్రాక్టు సంస్థ పనులను వేగవంతం చేసింది. పళ్లెం ఆకారంలో నిర్మించే మల్లన్నసాగర్ కట్ట పనులు, కాల్వల వద్ద పెద్ద ఎత్తున పేలుళ్లకు పాల్పడతున్నది. మల్లన్నసాగర్ పనులు గత సంవత్సరమే ప్రారంభమైనా ఎర్రవెల్లి ప్రాంతంలోని ఏడు కిలోమీటర్ల కట్ట పనులు మాత్రమే ఇప్పటి వరకూ పూర్తయ్యాయి. మరో 15 కిలోమీటర్ల కట్ట పనులను ఇప్పుడు వేగవంతం చేశారు. ఏక కాలంలో వివిధ గ్రామాల వద్ద పనులను ప్రారంభించటంతో ఆ ప్రాంత మంతా రాత్రింబవళ్లు యంత్రాల చప్పుడు వినిపిస్తోందని ముంపు బాధితులు అంటున్నారు. తొగుట, ఏటిగడ్డ కిష్టాపూర్, తుక్కాపూర్, వేములఘాట్, పల్లెపహాడ్, తిప్పారం, సింగారం, ఎర్రవల్లి, మంగోల్, కోయినాపల్లి గ్రామాల చుట్టూ ఇప్పుడు జేసీబీలు, టిప్పర్లు తిరుగుతున్నాయి. 22 కిలోమీటర్ల పొడవు, 19,395 చదరపు కిలోమీటర్ల పరిధిలో నిర్మిస్తున్న కట్ట, లైనింగ్ పనుల కోసం భారీగా మట్టి, రాళ్లు తరలిస్తున్నారు. భూసేకరణ పూర్తి కావటంతో ఆ భూముల్లో మట్టిని భారీగా తవ్వేస్తున్నారు. పనులన్నీ గ్రామాల చుట్టూ జరగతంతో ఆ ప్రాంతమంతా దుమ్మూ, ధూళి వ్యాపిస్తున్నది. పేలుళ్లతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
విద్యార్థి మృతితో ముంపు గ్రామాల్లో భయం..
రంగనాయక్ సాగర్ నుంచి మల్లన్నసాగర్ వరకూ తవ్వుతున్న కాల్వ పనుల కోసం చేసిన బ్లాస్టింగ్లో రాళ్లు ఎగిరిపడి సురేశ్ అనే విద్యార్థి శుక్రవారం మృతి చెందటంతో ముంపు గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పేలుళ్లు జరుపుతున్న ప్రాంతంలో సరైన హెచ్చరికలు లేక పోవటంతో అటువైపు తిరిగే పశువుల కాపర్లు, పిల్లలకు ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. గ్రామాల చుట్టూ జరుగుతున్న పేలుళ్లు, మట్టి తవ్వకాలు, టిప్పర్ల కదలికలతో గ్రామాలన్నీ దుమ్ముతో నిండిపోయాయని ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తులు తెలిపారు. పనులు ఆపేది లేదని హైకోర్టు స్పష్టం చేయటంతో ప్రభుత్వమే ప్రజలపై అప్రకటిత యుద్ధం చేస్తున్నదని వారంటున్నారు. గ్రామాల మధ్యలో రహదారుల్లో తిరుగుతున్న టిప్పర్లతో ఎప్పుడు ప్రమాదాలు జరుగుతాయోనని వారు భయపడుతున్నారు. భూసేకరణ పూర్తయినా గ్రామాల తరలింపునకు ఇంకా సమయం ఉందని అధికారులు చెప్పటంతో రాబోయే ఖరీఫ్లో భూములు సాగుచేసుకోవచ్చని ఆశ పడ్డామని ఇప్పుడు మట్టి తవ్వకాలతో ఆ అవకాశం కూడా లేకుండా చేస్తున్నారని వేములఘాట్ గ్రామస్తులు వాపోతున్నారు. ముంపు బాధితుల కోసం గజ్వేల్ సమీపంలోని మట్రాజుపల్లి వద్ద నిర్మిస్తున్న కాలనీలు పూర్తి కాలేదని, ఇండ్లు కట్టుకునే వారి కోసం అవసరమైన భూమిని కూడా ఇంకా చూపించలేదని వారంటున్నారు. మరో వైపు జూన్లో పాఠశాలలు తెరిస్తే తమ పిల్లలు ఎక్కడ చదవాల్లో అర్థం కావటం లేదని కలత చెందుతున్నారు. జేసీబీలు, ట్రక్కుల కదలికల మధ్య పిల్లలను బడికి ఎలా పంపాలో ఆర్థం కావటం లేదన్నారు.