Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2016 నవంబర్లో రిటైర్డ్
- అప్పటి నుంచి మరో జడ్జిని నియమించని వైనం
- రాజకీయ ఒత్తిల్లే కారణం !
- అటకెక్కిన ప్రయోగాత్మకం
నవతెలంగాణ- కరీంనగర్ ప్రతినిధి
జాతీయ ఉపాధి హామీ చట్టం అమలులో జరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ మొబైల్ కోర్టు అటకెక్కింది. దేశంలోనే ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో ఈ కోర్టు ఏర్పాటైంది. దాని ద్వారా చాలా కేసులు పరిష్కారమై, అవినీతి సొమ్మును రికవరీ కూడా చేశారు. ఆ తర్వాత కోర్టు జడ్జి స్థానం దాదాపు రెండున్నరేండ్ల నుంచి ఖాళీగా ఉంది. రాజకీయ ఒత్తిళ్ల వల్లే కొత్త జడ్జి నియామకానికి ప్రభుత్వం హైకోర్టుకు ప్రతిపాదనలు పంపడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఉపాధి హామీ చట్ట ప్రకారం ప్రతి కుటుంబానికి ఏడాదిలో 100 రోజుల పని తప్పనిసరిగా కల్పించాలి. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే పని చూపించాలి. లేనిపక్షంలో నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంది. ఇంత పకడ్బందీగా వచ్చిన చట్టంతో గ్రామాల్లో కూలీలకు పట్టెడన్నం దొరికింది. అదే సమయంలో కొందరు ఉద్యోగులు.. మరికొందరు రాజకీయ నాయకులకు 'ఉపాధి'గానూ మారింది. ఈ క్రమంలో సామాజిక తనిఖీల ద్వారా అవినీతి బట్టబయలైంది. బాధ్యులపై చట్ట ప్రకారం కేసులు కూడా నమోదు చేశారు. అయినప్పటికీ సాధారణ కోర్టుల్లో వేసిన కేసులు ఏండ్ల తరబడి నానుతుండటంతో కేంద్రం ప్రత్యేక కోర్టు కోసం ఆలోచించింది. దేశంలోనే ప్రయోగాత్మకంగా 2012 ఫిబ్రవరిలో సంగారెడ్డి కేంద్రంగా ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాలకు స్పెషల్ మొబైల్ కోర్టు ఏర్పాటు చేసింది. అప్పుడు ఏపీ ప్రమోషన్ ఆఫ్ ఆడిట్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కరెప్టు ప్రాక్టిసెస్ యాక్టు 3/2012 ప్రకారం ముందుగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. చట్టంగా 2011 ఆగస్టు 18 నుంచి అమలులోకి రాగానే ఈ ప్రయోగత్మక కోర్టును ఏర్పాటు చేశారు. దాని ఫలితాలను బట్టి దేశవ్యాప్తంగా మరిన్ని కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
రెండు జిల్లాలకు చెందిన మొబైల్ కోర్టు కావడంతో నెలలో 15 రోజులు ఒక జిల్లాలో, మరో పదిహేను రోజులు మరో జిల్లాలో ఆ కోర్టు పని చేసింది. ఏ గ్రామంలో అవినీతి జరిగిందో అక్కడే విచారించి శిక్షలు వేసింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇంత వరకు సిబ్బంది, సర్పంచ్లు, సబ్పోస్టుమాస్టర్లపై సహా 2 వేల 218 అభియోగాలు ఉన్నాయి. రూ.కోటీ 6 లక్షల 75,288 అవినీతి జరిగినట్టు లెక్క తేల్చింది. అందులో రూ.68 లక్షలా 65,510 రికవరీ చేసింది. ప్రస్తుత భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో రూ.3 కోట్లకు పైగా అవినీతి జరిగినట్టు తేలింది. అప్పటి కరీంనగర్ జిల్లాలోని వంగర కట్కూర్ సర్పంచ్లకు శిక్షలూ పడ్డాయి. అప్పటి హుస్నాబాద్ జెడ్పీటీసీ, అంగన్వాడీ కార్యకర్తగా ఉన్న ఆయన భార్యకు, ముగ్గురు ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇద్దరు కమ్యూనిటీ సర్వీస్ ప్రొవైడర్లకు శిక్షలు వేశారు. భీమదేవరపల్లి మండలం కట్కూర్ సర్పంచ్ రూ.లక్షా 65,300 ఉపాధి సొమ్ము కాజేసినట్టు నిరూపణ కాగా, దాంతో పాటు మరో రూ.లక్ష జరిమానా, ఆర్నెళ్లు జైలు శిక్ష విధించారు. ట్రాక్టర్ పనులకు రూ.250 చెల్లించాల్సి ఉండగా వంగర సర్పంచ్ రూ.100 మాత్రమే చెల్లించి రూ.60 వేలు అవినీతికి పాల్పడినట్టు తేలింది. ఆ మొత్తంతో పాటు రూ.లక్ష జరిమానా విధించారు. సాధారణంగా పలు శిక్షల్లో జరిమానాగానీ లేదా జైలు శిక్షగానీ ఉంటాయి.
ఈ చట్టంలో మాత్రం జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంది. అయితే, 2012లో నియమితులైన జడ్జి 2016 నవంబర్లో ఉద్యోగ విరమణ చేశారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగానే ఉంది. కరీంనగర్, మెదక్ జిల్లాలకు సంబంధించిన కేసులు 180 మేరకు ట్రయల్లో ఉన్నాయి. ఇందులో 50 కేసులు తీర్పునకు సిద్ధంగా ఉన్నాయి. రెగ్యులర్ కోర్టులో కేసు వేస్తే ఏండ్ల కొద్ది సమయం తీసుకుంటుంది. ఇప్పుడు ఈ రెండు జిల్లాల్లో ప్రత్యేక కోర్టు ఉన్నందున రెగ్యులర్ కోర్టులో కేసు వేసే అవకాశం కూడా లేదు. అయితే, ఇప్పటికే శిక్షలు పడిన వారిలో అనేక మంది సర్పంచ్లు ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెరిగినట్టు తెలుస్తోంది. అందువల్ల కొత్త జడ్జి నియమాకానికి ప్రభుత్వం హైకోర్టుకు ప్రతిపాదనలు పంపడం లేదనే సమాచారం.