Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వట్టెం నిర్వాసితులకు సీపీఐ(ఎం), వ్యకాస మద్దతు
- దీక్షా శిబిరాన్ని సందర్శించిన జాన్వెస్లీ, వెంకట్రాములు
నవతెలంగాణ-నాగర్కర్నూల్/తిమ్మాజిపేట
నాగర్కర్నూల్ జిల్లా వట్టెం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయి రోడ్డునపడ్డ గిరిజనులకు న్యాయంగా రావాల్సిన పరిహారాన్ని చెల్లించకపోతే ప్రజా, గిరిజన సంఘాలను కూడగట్టుకుని ప్రగతిభవన్ను ముట్టడిస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్వెస్లీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 12 రోజులుగా వట్టెం రిజర్వాయర్ వద్ద ఆందోళన చేస్తున్న నిర్వాసితుల శిబిరాన్ని సీపీఐ(ఎం) బృందం సందర్శించింది. జాన్వెస్లీ, వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మానాయక్, బీఎల్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మన్నార్ నాగరాజు, తెలంగాణ అంబేద్కర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ బహదూర్ సందర్శించారు. జాన్వెస్లీ మాట్లాడుతూ.. భూసేకరణ చట్టాల ప్రకారం ప్రాజెక్టుల నిర్మాణంలో తండాలు, గ్రామాలు ముంపునకు గురైతే ప్రభుత్వం ఇతరచోట్ల ఇండ్లు కట్టి గ్రామాలను నిర్మించాలన్నారు. పునరావాసం కింద ఒకేసారి నష్టపరిహారం చెల్లించాలన్నారు. గజ్వేల్, సిద్దిపేట వంటి ప్రాంతాల్లో ముంపు వాసులకు రూ.12 నుంచి 13 లక్షలు ఒకేసారి చెల్లిస్తున్న ప్రభుత్వం వెనుకబడిన మహబూబ్నగర్ జిల్లాలో మాత్రం పలురకాల రేట్లు నిర్ణయించి ఇవ్వడం దారుణమన్నారు. భూములు, ఇండ్లు కోల్పోయిన గిరిజనులను ఆదుకోవడంలో విఫలమైన నాగర్కర్నూల్ ఎమ్మెలే మర్రి జనార్థన్రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సమస్యల పరిష్కారం కోసం రిజర్వాయర్ వద్ద దీక్షలు చేస్తుంటే ఎమ్మెల్యే విదేశాలకు పారిపోయాడన్నారు. శిబిరాన్ని కిల్లెగోపాల్, సవర్దం పర్వతాలు, ఆర్.శ్రీనివాస్లు సందర్శించారు.
నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామ శివారులోని కంపెనీ ఎదుట వట్టెం భూ నిర్వాసితుల రెండో శిబిరాన్ని సందర్శించి వెంకట్రాములు మాట్లాడుతూ.. 2013 చట్టం ప్రకారం భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలన్నారు. భూనిర్వాసితులకు మార్కెట్ రేటుకంటే మూడురెట్లు ఎక్కువ ఇవ్వాలన్నారు. ఈ రిజర్వాయర్లో పెద్దఎత్తున దగా జరుగుతోందన్నారు. కాంట్రాక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసే మోసం చేస్తున్నారని వాపోయారు.