Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలి: కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్బాబు
నవతెలంగాణ-గజ్వేల్
ఓవైపు అనాథగా, మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో మూగవృద్ధురాలైన నానమ్మ రక్షణలో ఉంటున్న దళిత బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్బాబు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వ సాయమందించాలన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం రాయవరం గ్రామంలో ఈనెల 16న లైంగిక దాడికి గురైన దళిత బాలిక చికిత్స నిమిత్తం గజ్వేల్కు వచ్చిన సందర్భంగా ప్రభుత్వాస్పత్రిలో దళిత, ప్రజా సంఘాల నాయకులు పరామర్శించారు. స్కైలాబ్బాబు మాట్లాడుతూ.. నిందితులపై ఎస్సీ, ఎస్టీ చట్టం, 2018 నిర్భయ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలన్నారు. బాధితురాలికి జీవో 29 ప్రకారం మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇల్లు, ఉచితంగా ఉన్నత విద్య, ఉపాధి చూపించాలన్నారు. స్వయానా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ ఘటన జరగడం దారుణమన్నారు. డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏగోండ స్వామి, మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రాంప్రసాద్, సీపీఐ(ఎం)జిల్లా కమిటీ సభ్యులు ఎల్లయ్య మాట్లాడుతూ.. దళితులకు రక్షణ లేకుండా పోతోందన్నారు. బాలికపై లైంగికదాడి ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. నిందితులు ఎంతటి వారైనా శిక్షించాలనీ న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామనీ హెచ్చరించారు. అనంతరం గజ్వేల్ ఆర్డీవో విజయేందర్రెడ్డి, ఏపీసీ నారాయణ కలిసి ఘటన పుర్వాపరాలు వివరించారు.