Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎగిరిపడ్డ మరో ఇద్దరిలో నెలరోజుల పసిపాప
- కన్నీరుమున్నీరైన కుటుంబసభ్యులు
- వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మరో ఐదుగురి మృతి
- పటాన్చెరులో నిద్రిస్తున్న కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్
నవతెలంగాణ-ఏటూరునాగారం/పటాన్చెరు
ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీ కొని మూడేండ్ల చిన్నారి తలపగిలి అక్కడికక్కడే మృతిచెందింది. మరో ఇద్దరు పసిపాపలు, తల్లిదండ్రులు గాయాలతో బయటపడ్డారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి సమీపంలో గల జీడివాగు ప్రదేశం వద్ద శనివారం ఈ ఘటన జరిగింది.
మంగపేట మండలం మల్లూరులో జరుగుతున్న శ్రీ లక్ష్మి నర్సింహస్వామి కల్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే సీతక్క కాన్వాయితో వెళ్తున్నారు. జీడివాగు సమీపాన కొమురంభీం గ్రామంలో నివసిస్తున్న ఇర్ప జయ తన కుమార్తెలు కల్యాణి, స్రవంతి, మరో నెలరోజుల పసిపాపతో పప్కాపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి ఆమె సోదరుడు కుర్సం అరుణ్ ద్విచక్రవాహనంపై వస్తోంది. పప్కాపురం వెళ్లే మూలమలుపు వద్ద ద్విచక్రవాహనం రోడ్డు దాటిస్తుండగా అదే సమయంలో ఎమ్మెల్యే కాన్వాయిలోని ఒక వాహనం ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దాంతో ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురు చిన్నారులతో పాటు, జయ, అరుణ్లు రోడ్డుపై పడిపోయారు. చిన్నారి స్రవంతి (3)కి బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతిచెందింది. మిగతా వారిని స్థానిక సామాజిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై జయ భర్త రమేష్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
డ్రైవర్ తప్పిదమే కారణం : సీతక్క
డ్రైవర్ తప్పిదం వల్ల చిన్నారి ప్రాణం కోల్పోయిందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పార్టీ తరపున అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
వేర్వేరుచోట్ల ఐదుగురు మృతి...
సంగారెడ్డి, మహబూబ్నగర్, జగిత్యాల జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో స్క్రాప్ దుకాణం ముందు నిద్రిస్తున్న ఇద్దరు కూలీలపై నుంచి టిప్పరు దూసుకెళ్లి ఇద్దరు మృతిచెందారు. ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రేగోడు మండలం ఖురాన్వాడ తండాకు చెందిన మెగా వత్ బొమ్యానాయక్ (55), హనుమంతు (60) స్థానికంగా కూలీ పని చేసుకుంటూ ఎల్లమ్మగుడి సమీపంలోని రోడ్డు పక్కన స్క్రాప్ దుకాణం ఎదుట నిద్రించేవారు. శుక్రవారం రాత్రి కూడా ఎప్పటిలాగే నిద్రపోగా.. పటాన్చెరు నుంచి బీడీఎల్ వైపు వెళ్తున్న టిప్పర్ వారిపైనుంచి దూసుకెళ్లింది. ఇద్దరూ అక్కడే మృతిచెందారు. వారి శరీరాలు, తలలు ఛిద్రమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు బొమ్యానాయక్ బావమరిది పుల్యనాయక్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
అదేవిధంగా పటాన్చెరు మండలంలోని రామేశ్వరం బండ వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన వెంకటేష్ (28) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మార్కెటు నుంచి బస్టాండ్ వైపు వెళ్త్తూ దర్గా మూలమలుపు వద్ద ఇనుప గేట్లను ప్రమాదవశాత్తు ఆటోతో ఢీ కొట్టాడు. తలకు గాయంకావడంతో స్థానికంగా ప్రథమ చికిత్స చేయించుకుని ఇంటికెళ్లాడు. శనివారం ఉదయం పరిస్థితి విషమించి ఇంట్లోనే మృతిచెందాడు. మృతుడి అన్న రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. పటాన్చెరు మండలంలో ఇస్నాపూర్ గ్రామ శివారులో రోడ్డు దాటుతుండగా కంటైనర్ ఢ కొనడంతో ఎల్లయ్య (62) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందాడు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పూర్ వద్ద బైకు అదుపుతప్పి మహేష్ (22) మృతిచెందాడు.