Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు ఇంజినీరింగ్ కాలేజీల షిఫ్టింగ్కు ఎన్ఓసీ ఇచ్చా
- సర్కారు సుముఖంగా లేనందున ఆ నిర్ణయం రద్దు
- ఆ కాలేజీ యాజమాన్యాలతో కుమ్మక్కు కాలేదు : సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'నా అధికారాల ప్రకారమే ఐదు ఇంజినీరింగ్ కాలేజీల షిఫ్టింగ్కు నిరభ్యంతర సర్టిఫికెట్ (ఎన్ఓసీ) ఇచ్చాను. ఇంజినీరింగ్ కాలేజీల షిఫ్టింగ్ చేసేందుకు పూర్తి అధికారాలు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్కు కట్టబెడుతూ 2014లో ప్రభుత్వమే ఉత్తర్వులిచ్చింది. ఆ అధికారాల ప్రకారమే ఎన్ఓసీ నిర్ణయం తీసుకున్నాను. నాకు అధికారాలు న్నా ప్రభుత్వాన్ని మళ్లీ అడగాలా?. ప్రతిదీ ప్రభుత్వాన్ని అడిగితే సాంకేతిక విద్యాశాఖ కమిషనర్కు ఉన్న అధికారాలు ఎందుకు. అందుకే తీసుకున్న నిర్ణయాన్ని ఏఐసీటీఈకి పంపించాను. కానీ కాలేజీల షిఫ్టింగ్పట్ల రాష్ట్ర ప్రభు త్వం సుముఖంగా లేదు. అందుకే ఎన్వోసీ నిర్ణయాన్ని రద్దుచేశాను. కాలేజీల షిఫ్టింగ్కు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్కు ఉన్న అధికారాన్ని ప్రభుత్వ పరిధిలోకి తీసుకుంది. కానీ నేను తీసుకున్న నిర్ణయం సరైందే. ఆ కాలేజీ యాజమాన్యాలతో నేను కుమ్మక్కు కాలేదు. ఆ కాలేజీలపై నాకు ప్రత్యేక ప్రేమ లేదు. కాలేజీల షిఫ్టింగ్ అనేది సాధారణ విషయమే.'అని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంజినీరింగ్ కాలేజీల షిఫ్టింగ్ అధికారాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్కు ప్రభుత్వం అప్పగించిందన్నారు. మేనేజ్మెంట్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల షిఫ్టింగ్ అధికారాలు ప్రభుత్వం వద్దే ఉన్నాయని చెప్పారు. తనకున్న అధికారాలకు లోబడే ఐదు ఇంజినీరింగ్ కాలేజీలకు ఎన్ఓసీ ఇచ్చానని వివరించారు. నలుగురు పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్స్ ఆయా కాలేజీలను పరిశీలించి నివేదిక ఇచ్చిన తర్వాతే ఎన్ఓసీ ఇచ్చామన్నారు. ఇంజినీరింగ్యేతర మూడు కాలేజీల షిఫ్టింగ్ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. కొత్త కాలేజీల ప్రారంభం, కాలేజీల మూసివేత అధికారాలు ప్రభుత్వం వద్దే ఉన్నాయని చెప్పారు. కాలేజీల మూసివేత అధికారాలు ప్రభుత్వం వద్ద ఉండడం వల్ల నిర్ణయం ఆలస్యమవుతోందని, ఏడాది, ఆర్నెల్లు అవుతోందని అన్నారు. ఈ అధికారాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్కు ఇవ్వాలని కోరామన్నారు. 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాలేజీల షిఫ్టింగ్ అంశంపై విద్యామంత్రి సమక్షంలో సమావేశం జరిగిందని అన్నారు. ప్రభుత్వం సుముఖంగా లేనందున షిఫ్టింగ్ ఎన్ఓసీ నిర్ణయాన్ని రద్దు చేశామన్నారు. ఆ తర్వాత షిఫ్టింగ్పై కమిషనర్కు ఉన్న అధికారాలను ప్రభుత్వం పరిధిలోకి వెళ్లాయని చెప్పారు. ఏ కాలేజీకీ తాను అనుకూలంగా వ్యవహరించలేదన్నారు. షిఫ్టింగ్ దరఖాస్తు చేసుకుంటేనే అధికారాలున్నందున పరిశీలించి ఎన్ఓసీ ఇచ్చామని చెప్పారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో విద్యార్థులకు 75 శాతం, అధ్యాపకులకు 100 శాతం హాజరుశాతం బయోమెట్రిక్ ద్వారా ఉండాలని ఆదేశించామన్నారు. కొన్ని కాలేజీల్లో అధ్యాపకుల హాజరు శాతం తక్కువుంటే నోటీసులు జారీ చేశామని చెప్పారు.
కోర్సులనే అన్ఎయిడెడ్గా మార్చాం
ఎయిడెడ్ కాలేజీలను అన్ఎయిడెడ్గా మార్చలేదని నవీన్ మిట్టల్ అన్నారు. ఎయిడ్ ఇవ్వాలంటే ఆ కోర్సులో కనీసం విద్యార్థుల సంఖ్య ఉండాలని చెప్పారు. ఏటా దీన్ని పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. తక్కువ మంది విద్యార్థులుంటే ప్రభుత్వ అధ్యాపకులకు రూ.లక్షల జీతాలిస్తే వృధా అవుతున్నాయని చెప్పారు. అందుకే 87 మంది అధ్యాపకులు, 180 మంది బోధనేతర సిబ్బందిని ఎయిడెడ్ కాలేజీల నుంచి ప్రభుత్వ కాలేజీలకు మార్చామని అన్నారు. దీనివల్ల రూ.16.54 కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. ఎయిడెడ్ కాలేజీల్లో నియామకాలపై నిషేధం విధిస్తూ 2006లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రభుత్వం, యాజమాన్యాలు నియమించకుండా ఎయిడెడ్ కాలేజీల్లో ప్రమాణాలు ఎలా మెరుగవుతాయని ప్రశ్నించారు. అందుకే కోర్సులను అన్ఎయిడెడ్గా మారిస్తే యాజమాన్యాలు సొంతంగా అధ్యాపకులను నియమించి ప్రమాణాలు పెంచుతాయని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 65 ఎయిడెడ్ కాలేజీల్లో ప్రభుత్వ ప్రిన్సిపాల్స్ పనిచేస్తున్నారని అన్నారు. ఎయిడెడ్ కాలేజీల ఆస్తులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిశీలించడానికి జాయింట్ డైరెక్టర్ (జేడీ), అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ (ఏజీవో), రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ)తో కమిటీ వేశామన్నారు. ఈ నెలాఖరులోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. ఉన్నత విద్యామండలి అధికారులతో ఎలాంటి విభేదాల్లేవని స్పష్టం చేశారు.