Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానికులకు భరోసా కల్పించడంపై ప్రాధాన్యతనివ్వండి
- డీజీపీ కార్యాలయం నుంచి రాచకొండ పోలీసులకు ఆదేశాలు
నవ తెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ముగ్గురు మైనర్ బాలికల దారుణ హత్య జరిగిన హాజీపూర్ గ్రామాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారనే సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ముగ్గురు మైనర్ బాలికలను శ్రీనివాస్రెడ్డి అనే కిరాతకుడు అత్యంత పాశవికంగా హతమార్చి వారి మృతదేహాలను స్థానిక బావిలో పూడ్చిపెట్టిన ఘటన దేశంలోనే సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అట్టుడికిన హాజీపూర్ గ్రామం దీనంతటికీ పోలీసుల నిర్లక్ష్య వైఖరే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేయడమే గాక శ్రీనివాస్రెడ్డిని ఉరేయాలంటూ ఆందోళనకు దిగింది. ముఖ్యంగా ఈ డిమాండ్తో అనేక మంది గ్రామస్థులు ఆమరణ నిరాహార దీక్షకు దిగడం పరిస్థితిని మరింతగా తీవ్ర రూపం దాల్చేలా చేసింది. 'నిందితుడిని పట్టుకున్నాం. అతనికి తప్పని సరిగా కోర్టులో శిక్ష పడేలా చేస్తామ'ంటూ రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ మొదలుకుని కిందిస్థాయి అధికారుల వరకూ హామీలు ఇస్తున్నా గ్రామస్థులు శాంతించడం లేదు. చివరికి వారి నిరాహార దీక్షా శిబిరాన్ని రెండు రోజులక్రితం అర్ధరాత్రి పోలీసులు భగం చేశారు. దీక్షకు కూర్చున్న వారిని బలవంతంగా జవహర్నగర్ పోలీసుస్టేషన్కు తరలించారు. అయినప్పటికీ తమ గ్రామానికి చెందిన అన్నెం పున్నెం ఎరుగని ముగ్గురు మైనర్లను అతి దారుణంగా హత్య చేసిన శ్రీనివాస్రెడ్డిపై కసితో రగిలిపోతున్న గ్రామస్థులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారమూ అందకపోవడం మరింతగా కలత చెందేలా చేస్తున్నాయని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ గ్రామాన్ని సందర్శించాలని భావిస్తున్నట్టు అందిన సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారని తెలిసింది. సీఎం ఆ గ్రామాన్ని సందర్శించేలోగా గ్రామస్థులలో భరోసా పెరిగేలా చర్యలు తీసుకోవాలని రాచకొండ కమిషనరేట్ అధికారులకు డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. సీఎం పర్యటన సందర్భంగా గ్రామస్థులు, బాధిత కుటుంబసభ్యుల నుంచి ఆందోళనకర పరిణామాలు ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలనూ తీసుకోవాలని అంతర్గతంగా ఆదేశించినట్టు సమాచారం. ఇక సీఎం ఏ రోజు పర్యటించేది ఇంకా నిర్ణయం కానప్పటికీ రాచకొండ పోలీసు అధికారులు మాత్రం హాజీపూర్ గ్రామంపై ప్రత్యేక దృష్టిని సారించారని తెలిసింది.