Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవసరం లేకున్నా లాభాల కోసం ఉత్పత్తులు
- సాంకేతిక పరిజ్ఞానం ప్రజల మేలు కోసం ఉపయోగపడాలి
- సుందరయ్య జీవితంలోని ప్రతి అంశమూ ఆదర్శనీయమే :సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ ట్రస్టీ బివి రాఘవులు
- మానవ జీవనానికి మార్క్సిజం దిక్సూచి
- విప్లవానికి,సేవకు వైరుధ్యం లేదు : తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పర్యావరణ విధ్వంసానికి పెట్టుబడిదారీ విధానమే కారణమని, లాభం కోసం ఆ వ్యవస్థ ఏమైనా చేస్తుందని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ ట్రస్టీ, సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శించారు. పెట్టుబడి లాభం కోసం ప్రపంచాన్ని, మనిషిని, గాలిని, తినే తిండిని ఇలా అన్నింటినీ నాశనం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం కమ్యూనిస్టులు, పర్యావరణ వేత్తలు పోరాడుతున్నారన్నారని, సుందరయ్య విజ్ఞాన కేంద్రం పర్యావరణ పరిరక్షణ దిశగా ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్లోని గచ్చిబౌలి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వెబ్సైట్ను ఆయన ఆదివారం ప్రారంభించారు. 250 కిలోవాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాన్ని ఎస్వీకే ట్రస్టు బోర్డు కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్విచ్ ఆన్ చేశారు. అనంతరం తమ్మినేని అధ్యక్షతన జరిగిన సభలో బీవీ రాఘవులు మాట్లాడుతూ..వెబ్సైట్, 250 కిలోవాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించి ఎస్వీకే మరో ముందగు వేసిందన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా 13,500 వేల యుక్త వయస్సు చెట్లను నాటి పర్యావరణానికి దోహదపడినట్టేనని అన్నారు. సోలార్ ఉద్యమం పర్యావరణాన్ని రక్షిస్తుందని భావించలేమని, ఇది చిన్న ప్రయత్నమేనని అన్నారు. శాస్త్రవేత్తలు, అభ్యుదయవాదులు, పర్యావరణవేత్తలు పర్యావరణ పరిరక్షణ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తుంటే...మరోవైపు ట్రంప్, మోడీ, కార్పొరేట్ శక్తులేమో పర్యావరణానికి ప్రమాదమేమీ లేదని, పర్యావరణ రక్షణ పేరుతో పెట్టుబడులను, పెట్టుబడి లాభాలను అడ్డుకోవడం సరిగాదని మాట్లాడటం మంచిది కాదన్నారు. వర్గ సమాజంలో సేంద్రీయ ఎరువులతో పండించిన ఆహారపదార్థాలు ధనవంతుల ఆహారమేనని, సామాన్యులు కొని తినలేని పరిస్థితి ఉందని వివరించారు. ఢిల్లీలో వాతావరణం వేగంగా మారిపోతున్నదని, ఇవన్నీ అడవులను యథేచ్ఛగా నరకడం వల్ల వచ్చిన పరిణామాలేనని అన్నారు. కార్పొరేట్ శక్తులన్నీ అమెజాన్, నైలు నది పరివాహక ప్రాంతాల్లోని అడవులను ధ్వంసం చేసి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయని విమర్శిం చారు. వీటన్నింటినీ వదిలేసి గిరిజనులు పోడు గొట్టుకో వడం వల్లే పర్యావరణం దెబ్బతింటున్నదని మన పాలకులు విషప్రచారం చేస్తున్నారన్నారు. న్యూజెర్సీలో పర్యావరణ దెబ్బతినటంతో ఫార్మా కంపెనీలను అక్కడ నుంచి తరిమే యడంతో భారత్లో వచ్చి వాలాయన్నారు. ఇంగ్లాండ్లో కాలుష్యానికి కారమైన టెక్స్టైల్ పరిశ్రమలు ఇక్కడికొచ్చా యన్నారు. దేశంపై ప్రేమతోనే, అభివృద్ధి చేద్దామనే ఆ కంపెనీలు ఇక్కడకు రాలేదని, ఇక్కడ కాలుష్య నియంత్రణపై పెద్దగా ఆంక్షలు లేకపోవడంతోనే వచ్చినవేనన్నారు.
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం దేశంలో వేగంగా అభివృద్ధి చెందిందని, ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ ఉన్న పరిస్థితి ఉందని, అదే సందర్భంలో కనీసం తాగడానికి సురక్షిత నీళ్లు దొరకని పరిస్థితి ఉందన్నారు. సుందరయ్యకు గ్రంథాలయాలకు అవినాభావ సంబంధం ఉందన్నారు. 30 నుంచి 40 వేల పుస్తకాలను ఆయన సేకరించిన విషయాన్ని గుర్తుచేశారు. 22 రకాల రామాయణ, 4 భగవద్గీతల పుస్తకాలను సేకరించారన్నారు. సుందరయ్య సమగ్ర అధ్యయనం చేసి 'ఆంధ్రప్రదేశ్లో సమగ్రనీటి పథకం' అనే పుస్తకం రాసి ప్రభుత్వానికి ఇచ్చారన్నారు. గ్రంథం ఎక్కడికీ పోదని, జ్ఞానం డిజిటలైజేషన్ అయి ఈ పుస్తకాల రూపంలో అందుబాటులోకి వస్తున్నది వివరించారు. పెట్టుబడిదారీ సమాజంలో యంత్రం మనిషి నడిపోస్తోందన్నారు. యంత్రానికి మనం బానిసలైపోయామన్నారు. సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వ్యవస్థను బట్టి మారుతూ ఉంటుందన్నారు. ఆధునికతవైపు కమ్యూనిస్టులు ముందు వెళ్తారన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కార్పొరేట్ల లాభాల కోసం కాకుండా ప్రజల మేలు కోసం ఉపయోగించాలని సూచించారు. మార్క్స్ ప్రపంచంలో అత్యంత లౌకిక పదార్థం డబ్బు అని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. పెట్టుబడిదారీ విధానంలో డబ్బుకు ప్రాధాన్యం ఉంటుందని, విలువలను, మానవ సంబంధాలను ప్రభావితం చేస్తుందని వివరించారు. పెట్టుబడిదారీ వ్యవస్థ అవసరం లేకున్నా వస్తువులను కొనిపిస్తుందని, అలా చేయని పక్షంలో ఆ వ్యవస్థ మనుగడ సాధించదని చెప్పారు. అవసరం లేకున్నా లాభాల కోసం ఉత్పత్తులను చేయడం వల్లనే పర్యావరణం దెబ్బతింటుందని, పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థ పోవాలని అకాంక్షించారు. సుందరయ్యలాగా ప్రతి ఒక్కరూ సింప్లిసిటీని పాటించాలని, వ్యక్తుల మధ్య పరస్పర సహకారం ఉండాలన్నారు. మార్పు అనివార్యమని, పెట్టుబడిదారీ వ్యవస్థ వికృతపోకడలు అత్యున్నత స్థాయికి చేరిన తర్వాత ఆ వ్యవస్థ పతనం కాక తప్పదన్నారు. ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం నడక కోసం వెచ్చించాలని, ఈ రకంగానైనా వాహనాలు వాడకపోవడం వల్ల పర్యావరణాన్ని రక్షించినట్టేనన్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి కేంద్రంగా ఎస్వీకే ఉంటుందన్నారు.
తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..మానవ జీవితంలోని ప్రతి పార్శ్వంలో ఆలోచనా విధానాన్ని మార్క్సిజం,లెనినిజం వివరిస్తుందన్నారు. మానవ మనుగడకు సంబంధించి మార్క్సిజం సమగ్ర శాస్త్రమని చెప్పారు. మార్క్సిజం, లెనినిజం దృష్టితోనే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సమాజం మార్పు కోసం సీపీఐ(ఎం) చేస్తున్న కృషిలో సుందరయ్య కాలం నుంచి ఇప్పటివరకు ఎటువంటి తేడా లేదన్నారు. దేశంలో గొప్ప విప్లవకారుడైన పుచ్చలపల్లి సుందరయ్యను సేవకే పరిమితం చేస్తున్నారా అనే ఆలోచన కొంతమందిలో కలుగుతుందని అయితే విప్లవానికి సేవా కార్యక్ర మాలకు వైరుధ్యంలేదని తమ్మినేని చెప్పారు. సమాజ మార్పులో సేవకు ప్రముఖ పాత్ర ఉందన్నారు. నాయ కులు, అధికారంలో ఉన్న పార్టీలు మారడం మార్పు కాదని.. రాజకీయాల్లో క్రమ పద్ధతిలో మార్పు రావాలన్నారు. ప్రజలందరికీ సమాన అవకాశాలుంటే రాజకీయాలు, ప్రభుత్వాల అవసరం లేదని చెప్పారు. డబ్బు రాజకీయాలకు చరమగీతం పాడే చైతన్యం ప్రజల్లో తీసుకొచ్చేందుకు కృషి జరుగుతోందన్నారు. గచ్చిబౌలి ఎస్వీకేను అభ్యుదయ సినిమాలు ఉత్పత్తి చేసే అధునాతన కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్టు తమ్మినేని వెల్లడించారు. ఎస్వీకే ట్రస్టు బోర్డు సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, ప్రీ సాఫ్ట్వేర్ ఫోరమ్ ప్రధాన కార్యదర్శి కిరణ్చంద్ర మాట్లాడారు. ఎస్వీకే ట్రస్టు బోర్డు మాజీ కార్యదర్శి సాంబిరెడ్డి, గచ్చిబౌలి ఎస్వీకే మాజీ ఇన్చార్జి సాంబశివరావు, లైబ్రరీ ఇన్చార్జి విద్యాసాగర్, సినీదర్శకులు ఉమా మహేశ్వర్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, నాగయ్య, జ్యోతి, స్వేచ్ఛ టీమ్ నాయకులు ప్రవీణ్, ప్రగతినగర్ మాజీ సర్పంచ్ దయాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పీఎన్ఎమ్ కళాకారుడు ఆనంద్ పాడిన పాటలు, భవ్యశ్రీ నృత్యప్రదర్శన, దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు ప్రదర్శించిన నాటకాలు వీక్షకులను రంజింపజేశాయి.