Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పుస్తకం మనిషిని తీర్చిదిద్దే అపూర్వశిల్పమని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మెన్ బిఎస్ రాములు అన్నారు. సుందరయ్య 34వ వర్ధంతి సందర్బంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక పుస్తక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పుస్తకం చైతన్య స్రవంతి లాంటిదని కొనియాడారు. నేటి యువత అంబేద్కర్, జ్యోతిరావుఫూలే రచనలు చదవడం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బాలసాహిత్య అభివృద్ధి కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం, చరిత్ర, సైన్స్ కథలు, నవలలు, సామాజిక అంశాలు, తెలంగాణ రచయితల పుస్తకాలు ఒకే దగ్గర లభ్యమయ్యే విధంగా మే 19 నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణ సమాజం హేతుబద్ధ, మూఢనమ్మకాలు, వాస్తు, జ్యోతిష్యం వంటి అశాస్త్రీయ భావాలకు దూరంగా పుస్తకాలు చదివించడం, పిల్లలన సాహిత్యం వైపు మొగ్గు చూపేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ పుస్తక ప్రదర్శన ప్రారంభ కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్, మోదుగుపూలు ఎడిటర్ భూపతి వెంకటేశ్వర్లు, కవి, రచయిత తంగిరాల చక్రవర్తి, ధనలక్ష్మీ, అలకనంద, సుభాషిణి, రఘు, సతీష్, వీరేశం, పుస్తక ప్రియులు, పాఠకులు పాల్గొన్నారు.