Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్లో43 డిగ్రీలు
- నిజామాబాద్లో అత్యధికంగా 44.5 డిగ్రీలు
- రెండు నగరాల్లోనూ గాలిలో తేమ 16 శాతమే
- జాగ్రత్తలు తీసుకోకుంటే వడదెబ్బకు గురయ్యే అవకాశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సూర్యడు భగభగ మండిపోతున్నాడు. ఈ ఏడాదిలో ఆదివారం నాడు హైదరాబాద్లో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. సాధారణంతో పోల్చుకుంటే 3.4 డిగ్రీలు అధికం. అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే నిజామాబాద్ జిల్లాలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రత కంటే 3.8 డిగ్రీల(44 డిగ్రీలు) ఎండ కాసింది. గాలిలో తేమ శాతం రోజురోజుకీ వేగంగా పడిపోతుండటంతో తీవ్ర ఉబ్బరింపు ఎక్కువవుతున్నది. ఉబ్బరంతో నమోదు అవుతున్న ఉష్ణోగ్రతల కంటే ఒకటి రెండు డిగ్రీలు అధికంగా ఉంటున్న భావన కలుగుతున్నది. హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సోమవారం గాలిలో తేమ 16 శాతమే ఉన్నది. భద్రాచలం, మెదక్ జిల్లాల్లో మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ గాలిలో తేమ 30 శాతంలోపే ఉంది. ఫలితంగా ఉబ్బరంతో ప్రజలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యాన్లు తిరుగుతున్నా, కూలర్లు నడుస్తున్నా ఉబ్బరాన్ని తట్టుకోలేని పరిస్థితి. సోమవారం కూడా రాష్ట్రమంతటా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ ప్రకటించింది. రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర వడగాడ్పులు వీచే ప్రమాదముంది. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, ఆదిలాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లా మీద వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాబోయే మూడు, నాలుగు రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశమున్నది. అదే సందర్భంలో 21,22,23 తేదీల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
వాతావారణ శాఖ సూచించిన జాగ్రత్తలు
- మజ్జిగ, గ్లూకోజ్ వాటర్ను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.
- ఎండలో తిరిగేవారు కచ్చితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లను, నీళ్ల బాటిళ్లను విధిగా తీసుకెళ్లాలి. నీళ్లను ఎక్కువగా తాగాలి.
- వడదెబ్బకు గురైన వారిని వెంటనే నీడకుగానీ, చల్లటి ప్రాంతానికిగానీ చేర్చాలి.
- వడడెబ్బకు గురైన వారి శరీరాన్ని పావుగంటకోసారి తడిగుడ్డతో తూడ్చాలి.
- ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు గ్లాసు నీళ్లను తాగాలి. రోజులో కనీసం ఐదు లీటర్ల నీళ్లను తీసుకోవాలి.
- ఎండలో తిరిగివచ్చిన వెంటనే నీళ్లను తాగకూడదు. కాసేపు ఆగి నీళ్లనుగానీ, కొబ్బరినీళ్లనుగానీ తాగాలి.
- తీవ్రమైన ఎండలో బయట తిరిగి వచ్చినప్పుడు తలతిరుగుట, ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే వైద్యున్ని సంప్రదించి ప్రాథమిక చికిత్స పొందాలి.
- తెలుపు రంగు గల పలుచటి కాటన్ వస్త్రాలను ధరించాలి.
- నెత్తికి టోపి పెట్టుకోవాలి. లేనిపక్షంలో రుమాలు చుట్టుకోవాలి.
చేయకూడని పనులు
- ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వీలైనంత మేరకు ఎండలో తిరగకూడదు. పనులేమైనా ఉంటే మిగతా సమయాల్లో చేసుకుంటే మంచిది.
- ఎండ నుంచి వచ్చిన వెంటనే తీపి పదార్థాలుగానీ, తేనే పదార్థాలుగానీ తీసుకోవద్దు.
- సూర్యకిరణాలకు, వేడిగాలికి గురికాకూడదు. గొడుగు లేకుండా తిరుగొద్దు.
- నల్లరంగు, మందమైన దుస్తువులను ధరించకూడదు.
- వడదెబ్బకు గురైనప్పుడు వేడినీటిలో ముంచిన బట్టతో తుడవరాదు.
- శీతలపానీయాలు, ఐస్క్రీములు తింటే గొంతుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.